మిఠాయి యుగంధర్ బాబు

ప్రపంచంలో ప్రతి సంస్కృతి, నాగరికత మనిషికి సంక్రమించే వ్యాధులకు ఏదో రకమైన ముఢనమ్మకాలను ఆపాదిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ వ్యాధుల గురించి శాస్త్రీయ అవగాహన లేనప్పుడు, వ్యాధులు దేవతల యొక్క కోప, ప్రకోపాలని భావించే వాళ్ళు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకుంటే వ్యాధి తగ్గుతుందని భావించి అందుకోసం బలులిచ్చి, పూజలు, జాతరలు చేసేవాళ్లు (ఇప్పటికీ జాతరలు అన్నిచోట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి). తరం నుండి మరోతరానికి వారసత్వంగా వచ్చేసరికి నమ్మకాలు ప్రబలి కొండొకచో మూఢ నమ్మకాలుగా తయారవుతాయి. ఈ నమ్మకాలు ప్రజలలో ఒక భాగం అవుతాయి. మన భారతదేశంలో విస్తారమైన నమ్మక వ్యవస్థ నిర్మించబడి ఉంది. రకరకాల వ్యాధుల గురించి రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అలాంటి నమ్మకాలలో ఇప్పటికి కూడా ప్రభలంగా, సజీవంగా ఉన్న వ్యాధి చికెన్ పాక్స్ (chicken pox).

ఈ చికెన్ పాక్స్ వ్యాధిని ‘అమ్మ పోయడం అమ్మోరు పోయడం, అమ్మ తల్లి వచ్చింది, అమ్మోరు, ఆటలమ్మ, చిన్నమ్మ వారు, శీతాలమ్మ, మాత’ ఇలా రకరకాల పేర్లతో అనేక ప్రాంతాలలో అమ్మవారి ప్రభావంగా భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మూఢనమ్మకాలతో ఈ చికెన్ పాక్స్ ముడిపడి ఉంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అపోహలు మనదేశంలో ఈ చికెన్ పాక్స్ చుట్టూ అల్లుకొని ఉన్నాయి. మారెమ్మ, గంగమ్మలతో ముడివడి చికెన్ పాక్స్ ఆ మాతకు, తల్లికి వచ్చిన కోపంగా భావిస్తారు. (అమ్మోరు సినిమాలో మీరు చూసే ఉంటారు).

ప్రకృతిని ఆరాధించడం సర్వసాధారణం. కానీ ప్రతి సమస్యని, అనారోగ్యాన్ని కూడా నమ్మిన దేవతలతో ముడిపెట్టి చూడడం సాధారణమైపోయింది. ఈ వ్యాధి వైరస్ అనే విషయం చదువుకున్న వారికి తెలిసినా చాలామంది పసుపు నీళ్లు, పత్యాలు అని పాటిస్తూ ఉంటారు. (పుస్తకాల్లో, పాఠాల్లో అది వైరస్. …ఇంట్లో అయితే అమ్మవారు అది సంగతి,..అదీ భయం). పల్లెల్లో అమ్మవారికి కోడిని బలి ఇవ్వడం, వ్యాధి సోకిన పిల్లలకైతే తల్లిపాలు ఇవ్వకపోవడం, పోత పాలు పట్టడం, చెవుల్లో ముక్కుల్లో నూనె చుక్కలు వేయడం, తీర్థాలు పసుపు నీళ్లు పట్టడం, వేపాకు ముద్దలు తినిపించడం లాంటివి చేస్తూ ఉంటారు.

పూజలు, బలులు, ఉపవాసాలు, జాగారాలు, దిష్టి తీయడం ఈ తతంగంలో భాగమే. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు దద్దుర్లు దురద పెడుతూ ఉంటుంది. పచ్చి వేపాకు పై పడుకోబెడితే దురద ఇంకా ఎక్కువవుతుంది. వ్యాధి సోకిన వారికి అమ్మవారి పేరుతో రోజుల తరబడి స్నానం చేయకపోతే నీటి బుడ్డలలో బ్యాక్టీరియా చేరి మరింత ప్రమాదంగా మారుతుంది. చికెన్ పాక్స్ ని ఆటలమ్మవారు, చిన్నమ్మ వారు అంటారు కదా, ఆటలాడుతే పోతుందిలే అనుకుంటారు. మూఢనమ్మకాలతో వైద్యం చేయించకపోతే ఇతర సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు బిడ్డ మరణించే ప్రమాదం కూడా ఉంది.

చికెన్ పాక్స్ సాధారణంగా పిల్లల్లో కంటే పెద్దవాళ్లలో తీవ్రంగా ఉంటుంది. ఓ మోస్తరుగా పసుపు యాంటిసెప్టిక్ గా ఉపయోగపడుతుంది. కానీ దురద నుండి ఉపశమనం ఇవ్వదు. ఈ వ్యాధి సోకినప్పుడు శరీరము, చర్మం, పక్క బట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరానికి, దురదకు వైద్యులు సూచించిన మందులను వాడాలి. పిల్లల గోర్లు కత్తిరించి, పలుచని బట్టలు చేతికి చుట్టితే వాళ్ళు గోకేసుకోకుండా ఉంటారు. తేలికగా అరిగే బలవర్ధకమైన ఆహారం వ్యాధి సోకిన వారికి ఇవ్వాలి. అంతేగాని ఉపవాసం ఉండకూడదు.

శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ చికెన్ పాక్స్ వరిసెల్లో జోస్టర్ వైరస్ (VZV) వల్ల కలిగే అంటువ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు చిన్న దురద బొబ్బలను ఏర్పరిచే చర్మపు దద్దుర్లు ఏర్పడతాయి. అవి చర్మాన్ని కప్పివేస్తాయి. ఛాతీ, వీపు మరియు ముఖంపై ప్రారంభమవుతుంది. తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపిస్తుంది. దద్దుర్లు తో పాటు జ్వరం, అలసట తలనొప్పి వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. ఐదు రోజుల నుంచి ఈ ఏడు రోజులు వరకు దీని ప్రభావం ఉంటుంది.

ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుండి నోటి నుండి వెలువడే తుంపర్ల ద్వారా, శరీరంపై ఉన్న నీటి పొక్కుల స్రావాల ద్వారా పక్కనున్న వారికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఎండిపోయి చెక్కు కట్టిన చర్మం వల్ల హాని లేదు. ఇలాగా ఈ అంటి వ్యాధి పట్ల జాగ్రత్త వహించి సరైన చికిత్స చేయించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో చికెన్ పాక్స్ కి వ్యాక్సిన్లు 1990లో  వాడకంలోకి వచ్చింది. గత పదేళ్లుగా మనం దేశంలో కూడా వారిసెల్లో వ్యాక్సిన్లు వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వాలు ఉచిత టీకాల జాబితాలో దీనిని చేర్చకపోయినా విరివిగా అందుబాటులో ఉంది.

ఈ అమ్మవార్ల గురించి మరొక విషయం మీకు చెప్పాలి.
నా చిన్నప్పుడు అంటే దాదాపు 1976 ప్రాంతంలో మా ఊర్లో గోడల పైన స్టెన్సిల్ కటింగ్ రేకు ఫ్రేములపై నీలిమందు రంగు పూసి ఓ ప్రకటనను గోడలపై రాశారు. పూర్తి ప్రకటన గుర్తు లేకపోయినా విషయం గుర్తుంది. అదేమిటంటే “పెద్దమ్మ వారు.. మసూచి ఆనవాళ్లు తెలిపిన వారికి వెయ్యి రూపాయల బహుమతి” అని. అదేదో ఆనవాళ్లు కనిపెట్టేసి, చెప్పేసి… ఆ బహుమతి ఏదో నాకే వస్తే బాగుండునని ఆశ నాకు కలిగింది. కొన్నాళ్ళకి ఆ బహుమతిని పదివేల రూపాయలు దాకా పెంచారు. (ఎంత పొగరు వీళ్లకు?! అనుకున్నా. అది పొగరు కాదని, సైన్స్ ఇచ్చిన భరోసా అని తర్వాత అవగాహన కలిగింది) అప్పట్లో “ఆ పెద్దమ్మ వారు ఎవరో, మాకు ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కున్నారో?? “….ఏదో నాకు గాని నా స్నేహితులకు గాని ఆ మాటకొస్తే మా ఊరిలో ఎవరికీ దొరకలేదు. బహుమతి కూడా అందలేదు. అది వేరే సంగతి అనుకోండి.

తర్వాత తర్వాత తెలిసింది…. పెద్ద అమ్మవారు అంటే అతి భయంకరమైన అంటు వ్యాధి అయిన “మసూచి” అని (పెద్దమ్మవారు, స్పోటకం, Small pox అని కూడా అంటారు). ఆ “పెద్ద అమ్మవారిని” ఈ భూమండలం నుండి తొలగించారని, నిర్మూలించారని, ఇకపై ఆ వ్యాధి ఎవరిని భాదించదని తెలిసింది. (Small pox was eradicated from our Earth, అంటే ఓ పెద్ద అమ్మవారిని ఈ భూమి పైన నుండి తొలగించారన్న మాట)

దాదాపు మూడు వేల సంవత్సరాలుగా ప్రపంచాన్ని గడ గడలాడించి, కోట్ల మందిని పొట్టను పెట్టుకున్న  “మసూచి” (Small pox) అంటువ్యాధి నిరోధించడానికి డాక్టర్ ఎడ్వర్డ్ జెర్నర్ సా.శ.1796 లో వ్యాక్సిన్ ను కనుగొన్నారు. ఆ వ్యాక్సిన్ గురించి పూర్తిగా ప్రజలకు అర్థమై, అవగాహన చేసుకొని, నమ్మకం పెంచుకొని, వ్యాక్సిన్ అందుబాటులో వచ్చి, అందరూ వ్యాక్సిన్ తీసుకొని ఆ వ్యాధిని పూర్తిగా తొలగించడానికి దాదాపు 200 ఏళ్లు పట్టింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సా.శ.1980 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO…World health organisation), భూమిపై మసూచి వ్యాధి పూర్తిగా తొలగి పోయిందని ప్రకటించింది. అంటే ఇకపై భూమిపై ఎవరికి మసూచి వచ్చే అవకాశం లేదన్నమాట.

ఇలాగే రానున్న కాలంలో చికెన్ పాక్స్ ను కూడా ఈ భూమి పై నుండి పంపించవచ్చు. కాబట్టి ఇవన్నీ వ్యాధులే తప్ప అమ్మవారి కోపతాపాలు, ఆటలాటలు కాదని ప్రజల గ్రహించాలి.

మతాధిపతులైనా, పీఠాధిపతులైనా, బాబాలైనా జబ్బు వస్తే డాక్టర్ని సంప్రదించాలి తప్ప మంత్రాలు, తాయెత్తులు, పూజలతో, పవిత్ర జలాలతో, ప్రార్థనలతో, యజ్ఞ యాగాదులతో ఎవరూ నయం చేయలేరు అని చరిత్ర నిరూపించింది. “కరోనా” దాన్ని మరొకసారి బల్లగుద్ది ప్రపంచానికి చాటి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *