డాక్టర్ గేయానంద్

అన్ని వేదాల్లోనో, మన పురాతన గ్రంథాలలోనూ ఉన్నాయని వాదించడం చూస్తాం. అది ప్లాస్టిక్ సర్జరీ అయిన, జెనెటిక్స్ అయినా, విమానాలైనా, ఇంటర్నెట్ అయినా- అవన్నీ మనవాళ్లకు ఎప్పుడో తెలుసు అని, ఆ జ్ఞానాన్ని పాశ్చాత్యులు దొంగలించారని చెబుతూ ఉంటారు. నిజంగా వేద కాలాలలో, భౌతిక జీవితం ఎలా ఉంది? విజ్ఞానం ఏ మేరకు ఉందో ఒకసారి తెలుసుకుందాం.

వేద కాలం లేదా యుగం అంటే స్థూలంగా 1500-600 bc మధ్యకాలంగా తీసుకోవచ్చు. ఆనాటి విషయాలపై రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, ఉపిందర్ సింగ్ లాంటివాళ్ళు పరిశోధించి ఎన్నో విషయాలను ప్రామాణికంగా తెలియజేశారు. వైదిక కాలాలకు సంబంధించిన కొన్ని వాదవివాదాలు ఉన్నాయి. వారు రాసిన విషయాలను దృష్టిలో పెట్టుకొని, స్థూలంగా, ఆనాడు ఉన్న శాస్త్ర సాంకేతిక స్థాయిలను ఈ వ్యాసం ప్రస్తావిస్తుంది. ఆ కాలాలలో ఉన్న విజ్ఞానం, అవగాహన లు, ఆనాటి భౌతిక జీవితానికి, ఉత్పత్తి అవసరాలకు లోబడే ఉంటాయని మనకు తెలుసు. అప్పటి వ్యవసాయం వృత్తులు గురించి తెలుసుకుంటే, అప్పటి సాంకేతిక స్థాయి అర్థం అవుతుంది.

హరప్పా నాటి నగర జీవితాల తర్వాత, భారత ఉపఖండం మళ్లీ తెగల జీవితాలలోకి వెళ్ళిపోయింది. అయితే వేటతోపాటు, వ్యవసాయమూ ఉంది. జనం, ఒక చోటున స్థిరపడి చిన్నచిన్న ఆవాసాలలో, జీవించేవారు. ఈ వాతావరణం లోకి,1800-1400bc ప్రాంతాలలో, ఆర్యులు మధ్య ఆసియా నుంచి, ప్రవేశించారు. వీళ్లు పశుపాలకులు, సంచార జీవులు. ఒక విధంగా ఇక్కడున్న స్థానికుల కంటే, వెనుకబడిన జీవితం వారిది. కానీ గుర్రాలు, రథాలు వారికి ఉన్నాయి. పశువులకు మేత వెతుక్కుంటూ, దఫా దఫాలుగా ఆర్యులు వలస వచ్చారు. ఆర్యులకు, ఆర్యేతర సమాజాలకు (దాసులు, దశ్యులు) కొన్ని సందర్భాలలో ఘర్షణలు జరిగేవి. కాలం గడిచే కొద్దీ, ఆర్య అనార్యుల పరస్పర సంలీనం జరిగింది. వర్ణవ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. బహుశా క్రీస్తుపూర్వం 1000 సంవత్సరంలో, చాతుర్వర్ణ వ్యవస్థను సూచించే ఋగ్వేద రుక్కు (బ్రాహ్మణుడు ముఖం నుండి… శూద్రుడు పాదాల నుండి..) రూపొంది ఉండొచ్చు.

వేద కాలం లేదా వేద యుగాన్ని రెండుగా – తొలి వేద యుగం, మలి వేద యుగంగా విభజిస్తారు. ఋగ్వేదం ఆధారంగా తొలి వేద కాలాల జీవితం (1500-1000bc) తెలుస్తుంది. హిందూకుష్ (ఆఫ్ఘనిస్తాన్) పర్వతాల నుండి, గంగా యమునా మధ్య ప్రాంతం వరకు, కాశ్మీర్ నుంచి సింధు ఉత్తర సరిహద్దు వరకు విస్తరించి ఉన్న ప్రాంతమంతా, ఋగ్వేద ప్రజలకు సుపరిచితం. ‘ఋగ్వేదంతో మనం భారతదేశ చరిత్ర ప్రాంగణంలోకి ప్రవేశిస్తామని’ ఇర్ఫాన్ హబీబ్ అంటాడు.

వేద కాలాలలో ఉన్న భౌతిక జీవితంలో వ్యవసాయం, పశుపోషణ, వేట, వృత్తులు ప్రధానమైనవి. తొలి కాలాలలో, రాగితో, రాతితో, ఎముకతో చేసిన పనిముట్లు వాడారు. అప్పటికి చాల కలం ముందే ఇనుము గురించి తెలిసినా, తొలి వేదాలలో ఇనుము ప్రస్తావన లేదు. రాగితోనో రాతితోనో చేసిన పనిముట్లతో, అడవుల్ని పెద్ద ఎత్తున నరికి, వ్యవసాయ యోగ్యం చేయడం కష్టమే. అందుకే వ్యవసాయం ఉన్నా, విస్తృతంగా లేదు. బలంగానూ లేదు. ఋగ్వేదంలో 30 రకాల తెగలు/ వంశాలు ఉన్నాయి. ఈ తెగల మధ్య కలహాలు ఉన్నాయి. అట్లే ఆర్యుల మధ్య సంఘర్షణలు జరిగేవి. ఋగ్వేదంలో ఉండే చాలా మంత్రాలు యుద్ధాలలో విజయం కోసం చేసే ప్రార్థన లే. అయితే ఒక రాజు, అతని రాజ్యం అనే భావన ఋగ్వేదంలో లేదు. తెగల ముఖ్యులు, యుద్ధాలలో రక్షించే వాళ్ళు, గోవులను కాపాడివృద్ధి చేసే వాళ్ళు, పూజలు చేసే పురోహితులు కనపడతారు. దేవుడికి చేసే నివేదనను బలి అని అన్నారు. పన్నును కూడా బలి అన్నారు. కానీ పన్నుల వ్యవస్థ లేదు. జనుల సమావేశాలను సభ, సమితి అనేవారు. రకరకాల ప్రయోజనాలు ఉన్న తెగల సమావేశాన్ని వివిధ అనేవారు. ఋగ్వేద కాలంలో వ్యాపారం చాలా తక్కువ. వస్తు మార్పిడి ఉండేది. నాణేలు లేవు. పశువులు విలువకు గుర్తుగా ఉండేది. ఆనాడు సంపద అంటే గుర్రాలు, పశువులు, ఆవులు, ఒంటెలు, గొర్రెలు. పెద్ద పెద్ద పశువుల మందలు ఒక రకమైన పెట్టుబడిగా ఉండేవి. వ్యవసాయంలో వచ్చే మిగులను భద్రపరిచే సాధనంగా కూడా ఈ పశువుల మందలు ఉపయోగపడే ఉంటాయి. పశువుల కోసం దాడులు జరిగేవి.  ఎడారులలో రెండు ముప్పురాల ఒంటెలు వాడి ఉంటారు. అడవి జంతువుగా ఉన్న దున్నపోతు ఇంకా మచ్చిక అయి ఉండకపోవచ్చు. బానిసలు ఉన్నారు. అయితే వారు ఇంటి పనికే పరిమితమై ఉండవచ్చు. వ్యవసాయంలో వారికి గుర్తించదగ్గ పాత్ర ఉండకపోయి ఉండొచ్చు. యాగాది క్రతువులు ఉన్నాయి. మొత్తం మీద ఋగ్వేద జీవితం ఒక సరళ జీవితమే అనవచ్చు. ఆనాటి విజ్ఞానాలన్నీ, వేరుగా లేవు. ఈ జీవితంతో కలగలిసిపోయి ఉన్నాయి.

అయితే ఆనాడు ఎటువంటి పనిముట్లు వాడారు? వృత్తులు ఏమిటి అనేది, ఆనాటి వైజ్ఞానిక స్థాయికి ఒక సంకేతంగా ఉంటుంది. వీటి గురించిన ప్రస్తావనలు ఋగ్వేదంలో ఎలా ఉన్నాయో చూద్దాం. 

వ్యవసాయంతో పాటు, రథం బండ్లు తయారీ, వడ్రంగం, కమ్మరం, తోళ్లను శుభ్రం చేయడం, బాణాలను తయారు చేయడం, కుట్టుపని, నేతపని, రెళ్ళు గడ్డితో చాపలు అల్లడం తొలివేద కాలాలలో కనిపిస్తాయి. అట్లే యుద్ధాలు చేసేవారు, పురోహితులు, పశుపోషకులు, రైతులు వేటగాళ్లు క్షురకుల ప్రస్తావనలు కూడా కనిపిస్తాయి. పూర్తి కాలం వెచ్చించి చేయాల్సిన పనులు, నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని సంపాదించాల్సిన పనులు ఇందులో చాలా ఉన్నాయి. 

ఋగ్వేదంలో కొన్ని లోహ వస్తువుల ప్రస్తావనలు ఉన్నాయి. క్షుర (కత్తి), ఖాడి (? గాజు), అసి (గొడ్డలి) ప్రస్తావనలు ఉన్నాయి. కానీ ఇవి ఏ లోహాలో తెలియదు. అట్లే లోహాల పనులకు సంబంధించిన ప్రస్తావనలు కూడా ఋగ్వేదంలో చాలా తక్కువ. కొలిమి తిత్తులు, మంటను వూదే పక్షి ఈకలు ప్రస్తావన ఉంది. ఇదంతా ఆనాటి సాంకేతిక స్థాయిని తెలియజేస్తుంది.

వ్యవసాయానికి సంబంధించిన ప్రస్తావనలు కూడా ఋగ్వేదంలో చూస్తాము. కర్రతో చేసిన నాగలి, పార, కొడవలి, గొడ్డలి, విత్తనాలు శుద్ధి చేయడం, తృణధాన్యం నుంచి ఆహారాన్ని తయారు చేయడం, ధాన్యాన్ని నిలువ ఉంచడానికి పెద్ద పాత్ర ఉపయోగించడం లాంటి ప్రస్తావనలు కనిపిస్తాయి. ఒకచోట వంద తెడ్లు ఉన్న ఓడ ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో పంటలకు సంబంధించిన సమాచారం తక్కువగానే ఉంది. గోధుమల ప్రస్తావన లేదు. కానీ వరి ఉండొచ్చు.

ఆనాటి అలవాట్లలో కూడా కొన్ని అంశాలను అర్థం చేసుకోవచ్చు. గొర్రె మేక ఎద్దులను యజ్ఞాలలో బలి ఇచ్చేవారు. బక్షించేవారు. పాలు నెయ్యి ధాన్యం కూరగాయలు పండ్లు ప్రస్తావనలు కనపడతాయి. పాలను పులియబెట్టి, సోమ మొక్క రసాన్ని కలిపి, సోమరసాన్ని తయారు చేసేవారు. ధాన్యాన్ని పులియబెట్టి మత్తు పానీయం సుర తయారు చేసేవారు. పత్తి ఉన్ని జంతు చర్మంతో చేసిన వస్త్రాలను ధరించేవారు. ఋగ్వేదంలో నూలు వస్త్రాల ప్రస్తావన లేదు. ఆభరణాలు ఉన్నాయి. వీణ వేణువు మృదంగం లాంటి వాద్య పరికరాలు ఉన్నాయి. రథాల పందాలు పాచికల జూదం ఆడేవారు. ఇవన్నీ కూడా తొలి వేద కాలాల సాంకేతికతల గురించి చెబుతాయి.

మలి వేద కాలాలు..(1000-600bc)
ఋగ్వేద కాలంలో సరళ జీవితమే ఉంది. కానీ ఈ మలి వేద కాల జీవితాలలో సంక్లిష్టత ఏర్పడింది. ఇనుము వాడకం పెరగడం, పెద్ద మార్పులకు రంగాన్ని సిద్ధం చేసింది. వ్యవసాయం ప్రాముఖ్యత, గతం కంటే పెరిగింది. వ్యవసాయ పనుల ప్రస్తావనలు చాలా చోట్ల కనిపిస్తాయి. తెగుళ్ల నుంచి రక్షణ, అనావృష్టి అరికట్టడం లాంటి ప్రస్తావనలు ఋగ్వేద అనంతర వాఙ్మయం కనిపిస్తాయి. భూమిపై వంశపు హక్కులు ఉన్నాయి కానీ, సొంత హక్కులు ఇంకా రాలేదు. 

ఇనుము (నలుపు లోహం) గురించిన ప్రస్తావనలు, (కృష్ణ అయస్, శ్యామ ఆయస్) యజుర్వేదం అధర్వ వేదాల్లో కనిపిస్తాయి. నాగటి కర్రును ఇనుముతో చేశారు. జనులకు ఈ లోహంతో ప్రయోజనం ఉందనే మాట కనిపిస్తుంది.

మలివేద వాఙ్మయాలలో, కొన్ని ఇతర వృత్తులు కూడా కనిపిస్తాయి. ద్వార పాలకుడు, రథచోధకుడు, సేవకుడు, జ్యోతిష్యుడు, పశువుల కాపరి, కలప సంగ్రాహకుడు, బుట్టల తయారీదారు, కంసాలి, గజ రక్షకుడు, నగల వ్యాపారి, వైద్యుడు, చాకలి, వేటగాడు, పక్షులు పట్టేవాడు, సరంగు, సేవకుడు, మంగలి, వంటవాడు, పడవ నడిపేవాడు, వార్తాహరుడు, కర్ర నర్తకుడు- ఇలాంటి పనులు/వృత్తులు చేసేవారు కనిపిస్తారు. 

సోమవృక్షం దొరకడం తక్కువైపోయినప్పుడు, మత్తు పానీయాల కోసం ఇతర పద్ధతులు ఉపయోగించారు. గొర్రె మేక ఉన్నితో తయారుచేసిన వస్త్రాలను ధరించారు. తలపాగాలు చర్మపు చెప్పుల ప్రస్తావన ఉంది. లోహపు అద్దాలు ఉండి ఉండాలి. 

క్రమేణా రాచరికం, వర్ణవ్యవస్థ బలపడింది. సామాజికంగా స్త్రీల పరిస్థితి దిగజారింది. యజ్ఞ యాగాదులు సుదీర్ఘమై వ్యయంతో కూడుకున్నవిగా మారాయి

మలి వేద కాలాలలో కూడా వస్తు మార్పిడే కొనసాగింది. చేతివృత్తులు ఉన్నా, అవి ఇంకా బలపడాల్సే ఉంది. ఆదిమ తరహా సంతలు ఉన్నాయి. నాణేలు లేవు. వేద కాలాలలో పట్టణాలు లేకపోయినా, అది ఆదిమ సమాజాలను అధిగమించిన సమాజం. కానీ పట్టణ ఛాయలు ప్రారంభమైన సమాజం.

Pic courtesy aspirantias.com

వేద కాలాల విజ్ఞానానికున్న పరిమితులు
ఈ కాలంలో అధ్యయన విషయాల గురించి, చాందోగ్య ఉపనిషత్తు చెబుతుంది. ఆ కాలంలో ప్రజలు, వేదం, ఇతిహాసం, పురాణం, బ్రహ్మవిద్య, వ్యాకరణం, నీతి శాస్త్రం, శకులనాల జ్ఞానం, మాండలికాల తోపాటు, గణితం, ఖగోళ శాస్త్రం, సైనిక విజ్ఞానం, సర్పవిజ్ఞానం, కాలక్రమం లాంటి విషయాలను అధ్యయనం చేశారు.

ఋగ్వేదంలో ఉన్న తాత్విక చింతన ఏమిటి? ఋగ్వేదంలో, దేవతలు, యజ్ఞ యాగాదులు క్రతువుల గురించి చెప్పినా, సంశ వాద బీజాలు కూడా అందులో ఉన్నాయి. ఆచరణాత్మకంగా, స్వయం ప్రేరిత ప్రక్రియగా సృష్టిని చూడటమనే ఒక విభిన్న ధోరణి కూడా ఇందులో కనిపిస్తుంది. ఈ విశ్వం ఎలా ఎందుకు ఉనికిలోకి వచ్చింది? – అనేది సమాధానం లేని ప్రశ్నగా గ్రహించడం- ఒక సంభాషణలో కనిపిస్తుంది. 

ఋగ్వేద కాల ప్రజలకు లిపి తెలియదు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి ముందు, భారతదేశంలో అక్షరాల వినియోగానికి సంబంధించిన రుజువులు లేవు. అందుకే విజ్ఞానిక పరిజ్ఞానాలు చాలా ప్రాథమిక దిశలో ఉన్నాయి. 

వారికి గణితంలో కొంత అవగాహన ఉంది. పెద్ద సంఖ్యలకు దశాంశ పద్ధతిని ఉపయోగించినట్లు రుగ్వేదంలో ఉన్న అంకెలు తెలుపుతున్నాయి. భూమిని చక్రంగా భావించారు. మొక్కలతోనూ వనమూలికలతో చికిత్స చేసే ప్రస్తావన ఉంది. ఔషధ విలువలు ఉన్న మొక్కలను అనుభవం ద్వారా గుర్తించి ఉంటారు. జబ్బులు పోగొట్టడానికి ప్రార్థనలు మంత్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

వేద యుగంలో మూడు విప్లవాత్మకమైన మార్పులు రంగంలోకి వచ్చాయని వచ్చు. అది ఒకటి ఇనుము వాడకం పెరగడం, రెండు బావి గిలక, రవాణాలో చక్రం వాడకం. రవాణాలో చక్రం ప్రవేశించడం పెద్ద పురోగమనం. అది జంతువులు బరువులు లాగే పనిని సులభం చేసింది. బావులు, ఇక రాతి గిలకలు, నది తీరాల నుండి వ్యవసాయాన్ని బయటకు దాటించింది. భూమిపై ఉపరితలంలో, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ సేద్యానికి వీలు కల్పించింది. ఇనుమును ఉత్పత్తిలో వాడకం, మొత్తం సమాజాన్నే, ఆలోచనలనే మార్చివేసింది.

బౌద్ధ, జైన, చార్వాక కాలాల గురించి తర్వాతి సంచికలో తెలుసుకుందాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *