డా. యం.గేయనంద్

5000 సంవత్సరాలకు వెనక్కు వెళదాం. మనిషి వ్యవసాయం నేర్చుకున్నాడు కానీ పంటలను సాగు చేయడం ఇంకా అరకొర గానే తెలుసు. అటువంటి పరిస్థితులతో,కొన్ని తరాలు గడిచే లోపే, ఈజిప్టు పిరమిడ్లు, భారతదేశంలో మొహంజోదారో హరప్పా నగరవాటికలు మనిషి నిర్మించాడు. ఇంతటి బృహత్తర నిర్మాణాలకు ఎన్నెన్నో సాధనా నైపుణ్యాలు, నిర్మాణ సామర్ధ్యాలు సంతరించుకొని ఉండాలి.

వేటను పూర్తిగా వదలని, ఒక ఆదిమ వ్యవసాయక జీవి ఇవన్నీ చేయగలిగాడు అంటే, అదొక విప్లవమే. ఆ విప్లవాన్ని, ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త గార్డెన్ చైల్డ్ ‘అర్బన్ రెవల్యూషన్’ అన్నాడు.

వ్యవసాయంలో ఏర్పడిన మిగులు…
ఇదేలా జరిగింది? వ్యవసాయంలో ఆహార ఉత్పత్తి ద్వారా, కొద్దిస్థాయిలోనైనా మిగులు ఏర్పడింది.ఈ మిగులు, పెరిగే కొద్దీ, దాని చుట్టూ సమాజ వ్యవహారాలు తిరగసాగాయి. స్థిర నివాసాలు, గ్రామాలుగా మారాయి. ఒకే చోటు ఉంటూ, ఎక్కడెక్కడికో వెళ్లి పంట పండించడం కష్టం. ఒక మనిషి ఎంత దూరం నడచి,వెళ్లి వ్యవసాయం చేయ గలడు? అనేదాని ఆధారంగా గ్రామాల సైజుకు, ఒక పరిమితి ఏర్పడింది. భూమి లభ్యతను బట్టి గ్రామాలు ఏర్పడుతూ పోయాయి. ఈ వ్యవసాయక గ్రామాలు దేనికవే స్వయం సంపూర్ణంగా కూడా తయారయ్యాయి. క్ర మేణా నీటిపారుదల సాంకేతికతలను మనిషి నేర్చుకున్నాడు. నీటిపారుదల అవసరాల కోసం, ఈ చిన్న చిన్న గ్రామాలు, అనేకం సమాఖ్య గా ఏర్పడసాగాయి. నైలు నది తీరంలో ఇటువంటి యూనిట్లు, ఆర్థిక యూనిట్లుగా కూడా మారాయి.

నాగలి, జంతువు ప్రవేశం
మరోపరిణామం కూడా జరిగింది. వ్యవసాయంలోకి నాగలి ప్రవేశించింది. ముందు గుద్దిళ్ల తో స్త్రీలు పొలాన్ని తవ్వే వాళ్ళు. క్రీస్తుపూర్వం 3000 లో, ఈజిప్టు భారతదేశంలో నాగళ్ళు వాడారు.

క్రీస్తుపూర్వం 1400 లో చైనాలో నాగలిని ఉపయోగించారు.ఇది ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. నాగలి వ్యవసాయాన్ని పూర్తిగా మార్పివేసింది. చిన్న కయ్యలుగా ఉన్న వ్యవసాయం పెద్ద పెద్ద పొలాలుగా మారింది. వ్యవసాయంతో పాటు పశుపాలన కూడా పెరిగింది. గ్రామీణ వ్యవసాయం స్త్రీల చేతుల నుండి పురుషుల చేతుల్లోకి వచ్చింది. మానవ బలానికి తోడు జంతు బలాన్ని కూడా ఉపయోగించడం ఒక కీలక పరిణామం. బండ్లను లాగటానికి ఎద్దులను ఉపయోగపెట్టడం ప్రారంభమైంది. ఇదంతా చక్రాన్నికనిపెట్టడానికి చాలా ముందే జరిగింది. బరువులెత్తే పని మానవుడి భుజం నుండి జంతువుల భుజాలకు మారింది. ఒంటెను గుర్రాన్ని గాడిదను కూడా మజ్జిగ చేసుకున్నాడు. జంతువులకు రొమ్ము పట్టకాలు వాడేవారు. అది చాలా సమస్యగా ఉండేది.

జనాభా పెరిగింది. వ్యవసాయేతర పనులు పెరిగాయి. చేతివృత్తిదారులు వచ్చారు. ఈ క్రమంలోనే నగరాలు ఏర్పడ్డాయి. చుట్టూ ఉన్న గ్రామాలు పండించే పంటల మీద, ఆధారపడిన నగరాలివి. కానీ ఈ నగరాలేవీ నదీ లోయలను దాటిపోలేదు. నవీన శిలాయుగపు, కంచు యుగపు నాగరికతల కున్న పరిమితి అది. అందుకే తొలి నాగరికతలన్నీ నదిలోయల నాగరికతలే. ఈజిప్టు, మెసపటోమియా, సింధు, అగ్జాస్, యాక్సిరేట్స్, ఎల్లో నది, యాంగ్ట్ జీ నాగరికతలన్నీ ఇటువంటివి.

తొలి లోహాల ఆవిష్కరణ..
తొలి వ్యవసాయంలో, లోహాల అవసరం పెద్దగా లేదని చెప్పాలి. తొలి నాగరికతలకు కూడా లోహాల అవసరం పెద్దగా లేదని బెర్నాల్ అంటాడు. మాయ నాగరికత, అజ్ టేక్ నాగరికతల మహానగరాలలో,అన్నీ రాతి పనిముట్లే వాడేరనీ, లోహాలు అరుదుగా దొరికేవని, మహా అయితే ఆభరణాల కోసం లోహాలను వాడారని బెర్నాల్ అంటాడు.

అయితే రాగిని, బంగారాన్ని మనిషి ఏ విధంగా కనుకున్నాడు? ఇది ఒక సుదీర్ఘకాలంలో, తప్పొప్పుల ప్రయత్నంలో, జరిగి ఉంటుంది. కొంచెం భిన్నంగా కనిపించే, రాళ్లు, రంగుల రాళ్లు మనిషిని సహజంగానే ఆకర్షించి ఉంటాయి. ఖనిజాలను కాల్చితే, లోహం సులభంగా సాగదీయవచ్చని తెలుసుకొని ఉంటాడు. నిప్పుకు లోహానికి మధ్య చర్యలను అర్థం చేసుకొని ఉంటాడు. రాగిని, ఇతర ధాతువులతో కలిపి వేడి చేయడం కాకతాళియంగా జరిగి ఉంటుంది.

నాగరికత ఆవిర్భావం
నగరంలో పుట్టిందే నాగరికత అనేకంటే, నాగరికత పర్యవసానమే నగరం అనుకోవచ్చు. నగరానికి పల్లెకు ఒక తేడా ఉంది. గ్రామాల్లో ఉండేవాళ్లు, భూమిని దున్ని పంటను పండించే వాళ్ళయితే, నగరాల్లో ఉండేది పరిపాలకులు, నైపుణ్యపు పనివాళ్ళు, వ్యాపారులు, ఇతర పనివాళ్ళు.

నగరాల్లో ఉన్న ఇందరిని పోషించాలంటే, ఎక్కువ అదనపు విలువ మిగిలే విధంగా, వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అభివృద్ధి అయి ఉండాలి. కానీ అటువంటి సాంకేతికత అభివృద్ధి కావాలంటే, మొదట్లో ఒక కేంద్రీకృతమైన వ్యవస్థ ఏదో ఉండి ఉండాలి. ఏదో ఒక గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి నిలువ ఉంచే ఏర్పాటు ఉండి ఉండాలి. అది బహుశా గ్రామదేవతల తంతులు జరిగే గ్రామమై ఉండొచ్చు. చాలా గ్రామాలను నియంత్రిస్తున్న పాలక వర్గం కూడా ఉండి ఉండాలి.

క్రీస్తుపూర్వం 3000 శతాబ్దాల సమయంలో, మెసెపుటోమియా ఈజిప్టు ఇండియా చైనాల, నది లోయలలో దొంతరలతో కూడిన సమాజాలు ఏర్పడ్డాయి.

పూజారులు, యుద్ధ వీరులు, అధికారులు ఉనికిలోకి వచ్చారు. అదనపు ఉత్పత్తులపై పట్టు సంపాదించారు. మిగిలిన సమాజంపై కూడా పై చేయి సాధించి, ఇతరుల శ్రమ ఫలితాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. కొత్త కొత్త ఆస్తులు వచ్చాయి.క్రమేణా, మరిన్ని దొంతరలు ఏర్పడి, సామాన్యులు, స్వేచ్ఛ మానవులు, బానిసలు ఉనికిలోకి వచ్చారు. దూర వ్యాపారాలు జరిగాయి. జంతువుల శక్తిని వాడటం నేర్చుకున్నారు.గుర్రాలను మచ్చిక చేసుకున్నారు. పడవలతో, సముద్రాలపై ప్రయాణం ప్రారంభించారు. తెరచాపను కనిపెట్టి నీటి మీద ప్రయాణానికి, కనిపించని శక్తిగా ఉన్న గాలిని చోదక శక్తిగా ఉపయోగించడం నేర్చుకున్నాడు. కాలాన్ని లెక్కించడం ప్రారంభించారు. గ్రహ చలనాలగురించి ఆలోచించారు. మనుషులలో వర్గ విభజన స్పష్టంగా కనిపించ సాగింది. వ్యాపారాలతో పాటు యుద్ధాలు జరిగాయి. వ్యాపారాలు, యుద్ధాలు, వస్తువుల రవాణా, మనుషుల మధ్య సంబంధాలు, అభిప్రాయాలు- ఇవన్నీ చర్యా ప్రతి చర్యలతో వ్యాపించాయి.

ఈ కాలాన్నే, కంచు యుగం అంటున్నాం. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరానికి, భారతదేశం ఆసియా మైనర్ గ్రీస్ దేశాల్లో కంచి తయారు చేయడం నేర్చుకున్నారు. లోహాల తయారీ పూర్తి కాలం వృత్తిగా తయారయింది. లోహాలను తయారు చేసే వాళ్లను గౌరవించేవారు. ఆహార ఉత్పత్తి లో ప్రత్యక్షంగా పాలుపంచుకొనని వాళ్లు పూజారులు అయితే, వాళ్లకి ఇప్పుడు లోహ వృత్తి కారులు తోడు అయ్యారు. ఒక కొత్త తరగతి తయారయింది. లోహపు పనిముట్లు కావాలనుకున్న వ్యవసాయదారుడు, తన అవసరాలకు మించిన అదనపు ఆహారాన్ని పండించి, పనిముట్లు తయారు చేసే నిపుణులు ఇచ్చి, వస్తు మార్పిడి చేసుకున్నాడు.

కానీ, ఉత్పత్తి దొంతరలు పెరిగే కొద్దీ సమాజంలో సంక్లిష్టత కూడా పెరిగింది. పిరమిడ్లు, జిగురాత్ లనే పెద్ద కట్టడాలు వెలిశాయి. బానిసల శ్రమ అన్నింటికీ పునాది అయ్యింది. లెక్కలు రాతలు అవసరమయ్యాయి. వ్యాపారానికి, భూమి కొలవడానికి ప్రామాణికమైన కొలతలు కావలసి వచ్చింది.

అయితే ఇటువంటి, మార్పులన్నీ ఎక్కడో ఒకచోట ప్రారంభమై, మిగిలిన చోట్లకు విస్తరించలేదు. సరైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, మనుషులు ఎక్కడికి అక్కడే, మార్పులు సాధించారు.. అది ఒకే సమయంలో కాకుండా, వివిధ సమయాలలో జరిగి ఉండొచ్చు. కానీ వివిధ కాలాలలో, వివిధ ఖండాలలో ఉన్న మానవులు దాదాపు ఒకే స్థాయి నాగరికతలను సాధించారు. మనుషులు ఎక్కడున్నా, సహజమైన సృజనాత్మకతతో, వైజ్ఞానికతతో, స్వతంత్రంగా స్పందిస్తాడనటానికి ఈ నాగరికతలే ఉదాహరణలు.

ఇనుము ఆవిష్కరణ
అయితే కంచు యుగ పాలకులకు కొత్త సాంకేతికతలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యుద్ధాల కోసం ఉపయోగపడే సాంకేతికతలపై మాత్రమే శ్రద్ధ పెట్టేవారు. విలాసాలు, కట్టడాలు, యుద్ధాలతో గడిపేవారు. ఒక స్థాయి తర్వాత వ్యవసాయంలో పెద్దగా మార్పు లేకపోవడంతో, సమాజం స్తంభించిపోయింది.

ఈ కాలంలో కొన్ని ఆవిష్కరణలు జరగకపోలేదు. ఈజిప్షియన్లు గ్లాసును కనుక్కున్నారు. బాబిలోనియన్లు అకౌంటింగ్ ను ముందుకు తెచ్చారు. పొనిషియన్లు అక్షరాలను ఆవిష్కరించారు. కానీ ఇవన్నీ సంపన్నుల కోసమో, సంపదను లెక్కించడం కోసమో, నమోదు చేయడం కోసమో ఎక్కువగా ఉపయోగపడ్డాయి. రైతులకో, చేతి వృత్తిదారులకో పెద్దగా ఉపయోగపడింది లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో1300BC లలో ఇనుము ఆవిష్కరింపబడింది. ఇది కచ్చితంగా ఎక్కడ కనుగొనబడిందో చెప్పలేము. కానీ ఇనుమును ఆవిష్కరించింది ఆటవికులు. నాగరికతలు కాదు. కకేషియన్ పర్వతాలలో, సుదూరంగా ఉన్నఒక ఆటవిక తెగ ఇనుమును పెద్ద స్థాయిలో సంగ్రహించడం నేర్చుకొని ఉంటుందని చరిత్రకారులు అంటారు.

అయితే ఇనుమును కలిగించడానికి అధిక ఉష్ణోగ్రతలు అవసరం. కొలిమిలో గాలి ఊదడం ద్వారా నిప్పు ఉష్ణోగ్రతలను పెంచవచ్చని మనిషి కనుగొన్న తర్వాత, ఇనుమును సంగ్రహించడం సులభమైపోయింది. సాధారణ ప్రజలకు కూడా ఇనుము అందుబాటులోకి వచ్చేసింది. అప్పటిదాకా కంచు కులీనుల స్వంతం. కానీ ఇనుము అందరి లోహమైంది.

ఈ కొత్త లోహం, ఒక కొత్త ఎకానమీని, సామాజిక సంబంధాలను, రాజకీయ రూపాలను సృష్టించింది. ఇనుము వాడకం విస్తృతంగా వ్యాపించే క్రమంలో ఎన్నో ఆర్థిక సామాజిక రాజకీయ మార్పులు ముందుకు వచ్చాయి.

మన సింధు నాగరికత
ఇప్పుడు ఒకసారి భారత ఉపఖండానికి వద్దాం. సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత ఇక్కడి స్థానిక పరిస్థితులలో ఏర్పడిన స్థానిక నాగరికత. 3200BC ని తొలినాటి సింధు రోజులుగా చెప్పుకోవచ్చు. 2500-2000 మధ్యకాలంలో ఈ నాగరికత పరిణితి దశలో ఉంది. పాకిస్తాన్ లో కొన్ని మైదానాలు, బెలూచిస్తాన్ లో కొన్ని భాగాలు, మనదేశంలో పంజాబ్ హర్యానా వాయువ్య ఉత్తరప్రదేశ్ ఉత్తర రాజస్థాన్ మరియు గుజరాత్ లతో కూడిన విశాలమైన అవిచ్ఛిన్నమైన భూభాగంలో సింధు నాగరికత కనిపిస్తుంది.

సింధు నాగరికత ఒక ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, 10- 50 లక్షల జనాభా తో ఉండి ఉండవచ్చు అని ఒక అంచనా. మొహంజోదారో, హరప్పా పట్టణాల జనాభా ఒక లక్ష 50 వేల దాకా ఉండొచ్చు. హరప్పా నాగరికత స్థలాలు పాకిస్తాన్లో 406 ఉంటే, భారతదేశంలో 616 స్థలాలు ఉన్నాయి.

అయితే 4000 బీసీకి ముందే ఇక్కడ వ్యవసాయం ప్రారంభమైంది. బర్రెలు గొర్రెలు మేకలు పెంచారు. కలప తో చేసిన మడకలు, రాతి కొడవళ్ళు, తిరుగలి రాళ్లు వాడారు. బండ్లు లాగడానికి పశువులను వాడేవారు. కానీ గుర్రాలు కనిపించవు. రొట్టెలను కాల్చేవారు.

ఆనాడు పండించిన పంటలపై కూడా, చరిత్రకారులు మాట్లాడుతున్నారు. తృణధాన్యాలు గోధుమ బార్లీ పప్పులు బీన్స్ నూనె గింజలు అవిసెలు చిరుధాన్యాలు జొన్న రాగి మొక్కజొన్న నువ్వులు నార పత్తి ఆవాలు, ఖర్జూర కర్బూజా ద్రాక్ష పండించిన ఆనవాళ్లు ఉన్నాయి.

అనేక వృత్తులుండేవి.2500BC సమయంలో కుమ్మరి చక్రం కనిపిస్తుంది. కుండల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగి ఉండాలి. అప్పటికింకా కంచు తయారీ తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. చక్రాన్ని నిలువుగా వాడి, బండి ద్వారా భారీ బరువుల రవాణా మైదాన ప్రాంతాలలో చేశారు. పరికరాలు, ఎక్కువగా రాతితో, ఎముకలతో చేశారు. రాగిని కరిగించే ప్రయత్నం కనపడుతుంది. ఏనుగు దంతాలతో రంగుల రాళ్లతో ఆభరణాలు, పూసలు తయారు చేశారు. రాతి ముద్రికలు కనిపించాయి. ప్రామాణికమైన కొలతలతో కాల్చిన ఇటుకలు, ఎండలో అరబెట్టిన ఇటుకులు కనిపించాయి. అట్లే ప్రామాణికమైన తూనికలు ఉన్నాయి. పట్టణాలలో సరళ మార్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాపీ పనితో నిర్మించిన బావులు, తటాకాలు ఉన్నాయి. ధాన్యాగారాలు, స్నానవాటికలు, డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయి. నగరాలను ఒక ప్రణాళిక (grid pattern) ప్రకారం నిర్మించారు.

సింధు నాగరికతలో లోహ పరిజ్ఞానం. బాగానే ఉంది. నికెల్, ఆర్సినిక్, సీసంలను రాగితో కలిపి మిశ్రమ దాతువులు తయారు చేసేవారు. ఇటుక గోడలతో నిర్మితమైన గుంతలలో రాగిని కరిగించేవారు.

మైనం లేదా మట్టి మూసలలో, రాగిని లేదా కాంశ్యాన్ని పోసి, అచ్చులు వేసేవారు. కత్తులు ఊలులు, కొడవళ్ళు రంపాలు, గొడ్డళ్ళను ఇలా చేసేవారు. కానీ రాగి, కాంస్యంతో కన్నా రాతితో చేసిన పరికరాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. కలపతో నాగలి చేసేవారు. పనిముట్లకు అవసరమైన పిడిని చేసేవారు.

సింధు నాగరికతలో వినిమయ వస్తువులలో ఎక్కువగా కనిపించేది కుండలు. వంట పాత్రలు కప్పులు జాడీలు అనేక రకాల ఆకృతులలో ఉండేవి.ఇవి చాలా దృఢంగా ఉండేవి. కింద, గుండ్రని గది లాంటి భాగంలో ఇంధనాన్ని మండించి, పై గదిలో పాత్రలను కాల్చే వారు. మట్టితో బిళ్ళలు ఆట వస్తువులు ప్రతిమలు చేసేవారు. ఇవి తయారు చేయడానికి చాలా నైపుణ్యం అవసరం అయ్యేది. చేనేత విస్తృత స్థాయిలో ఉండేది. పత్తి తెలిసిన తొలి నాగరికతలలో, సింధు నాగరికత ఒకటి.

విలాస వస్తువులు తయారు చేసేవారు. పూసలు చిన్న ఆభరణాల తయారీకి బంగారు వాడేవారు. బంగారు వెండి మిశ్రమాన్ని కూడా వాడారు.

పొడిచేసిన సిలికేట్ల మిశ్రమంతో మెగ్నీషియం ఇంకా ఇతర లోహ ఆక్సైడ్ ను కలిపి మెరిసే మట్టి గాజు పాత్రలను తయారు చేశారు. రాళ్ళను వేడి చేసి రంగు రాళ్ళను తయారు చేసే వాళ్ళు. వాటితో ఖరీదైన పూసలు తయారు చేసే వాళ్ళు.
వేట ఒక ముఖ్యమైన అంశం. చేపలు పట్టే పరిజ్ఞానం, మంచి పడవలు వలలు అభివృద్ధి అయి ఉండాలి.

సింధు ఆవిష్కరణలు
సింధు ఆవిష్కరణలలో, ప్రామాణికమైన తూనికలు కొలతలు, కుమ్మరి చక్రం, తొలి రాతలు, ముద్రికలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. సింధు ప్రజలకు దశాంశ పద్ధతి, బైనరీ విధానం తెలుసు. దూరాలను కచ్చితంగా కొలిచేవారు. కపాలానికి రంద్రం వేసే చికిత్స ఏదో తెలిసి ఉండాలి.

అట్లే ఇప్పటి నగరాలను తలపించే, నగర ప్రణాళికలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. సింధు నాగరికతలో రైతులు, పశుపాలకులు, తాపీ పనివాళ్ళు, నేత పనివాళ్ళు, కుమ్మరులు, పూసలు చేసేవాళ్ళు, దేశ దిమ్మరులు, బానిసలు, పట్టణ పేదలు, చేతి వృత్తిదారులు, వ్యాపారులు, మతాధిపతులు, పాలకులు ఉండేవారు. బహుశా మిగిలిన నాగరికతలలో ఉన్నంత పీడన లేకపోయి ఉండొచ్చు. ఒక మంచి పౌర జీవితం ఉండి ఉండాలి.

ప్రాచీన నాగరికతలతో, మానవ వికాసం, విజ్ఞానం ఒక పెద్ద ముందడుగు వేసింది. చరిత్ర పూర్వ యుగం ముగి సింది. మసక మసక గా ఉండే ఒక దశ దాటింది. మన అందరి, పూర్వికుల చరిత్ర అది. ఇప్పటికీ, పరిశోధకుల మధ్య ఎన్నో వివాదాలు ఉన్న, చరిత్ర ఇది.

(వచ్చే నెల, వేద కాలాలు)

One thought on “3000 BC.. నగర విప్లవాలు, వికాసాలు..

  1. చాల విలువైన వ్యాసాలు అందిస్తున్న పెద్దలకు కృతఙ్ఞతలు

Leave a Reply to k. Devendra rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *