మానవునితో జీవపరిణామం ఆగిపోయిందా లేక కొనసాగుతోందా అంటే సమాధానం రెండు విధాలుగా వస్తుంది.

కింది స్థాయి జీవులనుండి ఉన్నత జీవులకు పరిణామం నేటికీ కొనసాగుతోంది అనేది మొదటి సమాధానం. మానవుని తరువాత పరిణామం ముందుకు సాగడం ఆగిపోయినట్లే అన్నది రెండో సమాధానం.

జీవపరిణామం అన్నది ఒక నిరంతర క్రమం. పదార్థ నిత్య చలనంలో, నిత్య పరిణామంలో అది అంతర్భాగం. ఈ భూమి, (గ్రహాలు కూడా పదార్థ చలనంలో భాగంగా ఏర్పడినవే. భూమి మీద నిర్జీవ పదార్థంనుండి ప్రాథమిక జీవులు, వాటినుండి ఉన్నత జీవులూ ఆ ఉన్నత జీవులనుండి మరింత ఉన్నత జీవులూ ఇలా పరిణామం చెంది నేడు ప్రపంచంలో మనకు కనిపిస్తున్న జీవవైవిధ్యం ఏర్పడింది. జీవులను ఎవరో సృష్టించలేదనీ, అవి ఎక్కడినుండో ఊడి పడలేదనీ పరిణామక్రమంలో జీవజాలం ఏర్పడిందనీ ఛార్లెస్‌ డార్విన్‌ తన “ఆరిజిన్‌ ఆఫ్‌ స్పిషీస్‌” గ్రంథంలో సోదాహరణంగా విరించాడు. ప్రకృతి వరణం (నేచురల్‌సెలక్షన్‌) ద్వారా పరిణామం జరుగుతోందని కూడా ఆయన చెప్పాడు. తరువాత జీవశాస్త్రంలోనూ, ఇతర శాస్త్రాల్లోనూ జరిగిన అభివృద్ధి అంతా జీవపరిణామ సిద్ధాంతం నిజమేనని నిరూపించాయి.

ప్రకృతి వరణం (నేచురల్‌ సెలక్షన్‌) అనేది జీవులకూ, ప్రకృతికీ మధ్య జరిగే ఒక నిరంతర ఆదానప్రదాన ప్రక్రియ.

జీవులూ, ప్రకృతి ఉన్నంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు భూమిమీద ప్రకృతి ఉంది, జీవులున్నాయి. కనుక ప్రకృతి వరణం కొనసాగుతూనే ఉంటుంది. అంటే జీవపరిణామం జరుగుతూనే ఉంటుందన్నమాట. మరి జీవపరిణామాన్ని మనం గుర్తించగలమా, కింది స్థాయి జీవులనుండి ఉన్నత స్థాయి జీవులు అభివృద్ధి చెందడాన్ని మనం గమనించగలమా? అంటే సాధ్యమే. అయితే అది చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే జీవపరిణామం ఒక తరంనుండి మరో తరానికి జరిగేటప్పటికీ ఈ మార్పు చాలా చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని తరాలవరకు ఎటువంటి మార్పు లేకుండా ఉండవచ్చు. అందువల్ల జీవపరిణామాన్ని కొన్ని సంవత్సరాల్లోనో, ఒక తరంలోనో, రెండు తరాల్లోనో గుర్తించి రికార్డు చేయడం కష్టంతోకూడిన పని. కాని అన్ని జీవుల్లోనూ- ఏకకణ జీవులు, బహుకణ జీవులూ, వృక్షాలు, జంతువులూ వెన్నెముకగల జీవులు, వెన్నెముక లేనిజీవులూ అన్నిటిలోనూ- నీళ్లలో, నేలమీద, అడవుల్లో, ఎడారుల్లో, మంచుఖండాల్లో ఎక్కడైనా సరే జీవులున్న చోటల్లా పరిణామం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. ఇది తిరుగులేని ప్రకృతి ధర్మం.

మనిషి కూడా జీవపరిణామం ఫలితంగా ఆవిర్భవించిన వాడే కదా! జీవుల్లో ఉన్నతవర్గాలకు చెందిన కోతి జాతులనుండి మనిషి ఆవిర్భవించాడని పరిణామ వాదం చెబుతోంది. మరి మనిషి కూడా పరిణామం చెందుతున్నాడా, చెందుతుంటే మనిషినుండి కాలక్రమంలో ఎటువంటి జీవులు ఆవిర్భవిస్తాయి అన్న సందేహం కలగడం సహజం. ఇంకోమాటలో చెప్పాలంటే మనిషి భవిష్యత్తులో ఏ రూపంగా పరిణామం చెందుతాడు అని సందేహం వస్తుంది. కాని విషయమేమంటే మనిషి తరువాత ఇంకా ఉన్నతమైన జీవులు పరిణామం ద్వారా ఏర్పడే అవకాశం లేదు. కారణాల్లో ఒకటి, ఇతర జీవులు పరిణామం చెందవచ్చునేమోగాని మనిషికి మించి అంటే మనిషి తెలివితేటలకు మించి పరిణామం చెందే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే తన విజ్ఞానం ద్వారా భూమిమీదగల అన్ని జీవులమీదా మనిషి ఆధిపత్యం సాధించాడు. వాటన్నిటినీ తన జీవనానికి ఆలంబనగా మలుచుకుంటున్న మనిషి కొన్ని లక్షల సంవత్సరాల తరువాతనైనా ఈ భూమ్మీద మరో జీవి తెలివితేటల్లో తనను మించి పోవడానికి అనుమతివ్వడు. ఇక రెండోది మనిషే పరిణామం చెంది ఉన్నత రూపానికి రావచ్చుకదా! కాని మనిషి యొక్క భౌతిక పరిణామం ఏనాడో ఆగిపోయింది. ఆధునిక మానవుని ఆవిర్భావంతోనే మనిషి భౌతికంగా పరిణామం చెందడం ఆగిపోయింది. దీనికి కారణం కూడా మనిషికి సంక్రమించిన విజ్ఞానమే. ఎలాగంటారా? జీవుల పరిణామం ప్రకృతి వరణం (నేచురల్‌ సెలక్షన్‌)ద్వారా జరుగుతుందనుకున్నాం కదా! జీవులు తాము నివసిస్తున్న పరిసరాలకు అనుగుణంగా శరీరంలో మార్పులు చేసుకుంటాయి. దీన్నే ఎడాప్టేషన్‌” అంటారు. ఆ విధంగా ప్రకృతికి ఎడాప్ట్‌కావడం ద్వారా జీవుల శరీరాల్లో మార్పులు వస్తాయి. డార్విన్‌ దీన్ని మరో విధంగా చెప్పాడు. “ప్రకృతిలో ప్రతి జీవీ విపరీతమైన సంఖ్యలో సంతానోత్పత్తి చేస్తుంది. ఆ సంతానమంతా బతికుంటే ఒక్క జీవి సంతానంతో ఈ భూమి అంతా నిండిపోతుంది. కాని అలా అన్నీ బతకవు. చాలా వరకు చనిపోతాయి. కాని ఏవి చనిపోతాయి, ఏవి బతుకుతాయి అన్నది ముఖ్యం. సాధారణంగా జీవుల సంతానంలో చాలా వైవిధ్యం ఉంటుంది. ఒకే తల్లికి పుట్టిన జీవుల్లో కూడా పొడవు, వెడల్పు, లావు, ఎత్తు, రంగులు, ఇలా చాలారకాల తెడాలుంటాయి. అంటే రకరకాల లక్షణాలున్న జీవులు పుడతాయన్నమాట. అయితే జీవుల్లో ఏ లక్షణాలైతే అవి నివసిస్తున్న ప్రకృతికి అనుగుణంగా ఉంటుందో అటువంటి జీవులు బతకడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అలా అనుగుణంగా లేని జీవులు నశించిపోతాయి. దీన్నే డార్విన్‌ ‘సర్వయివల్‌ ఆఫ్‌ ది ఫిట్టెస్ట్‌’ అన్నాడు. ఈవిధంగా ప్రకృతితో ఎడాప్టేషన్‌ వల్ల జీవుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు: మామూలుగా ఎలుగుబంట్లకు చర్మం ఉంటుంది కాని ధృవ ఎలుగుబంట్లకు చర్మం కింద దట్టమైన కొవ్వు పొర ఉంటుంది. అంటే అక్కడి చలికి అనుగుణంగా దాని చర్మంలో మార్పు వచ్చిందన్నమాట.

కానీ డార్విన్‌ ఈ విషయాన్ని ఎలా వివరించాడంటే. . . . ధృవాల్లో నివసించే ఎలుగుబంట్లు కూడా ఒకానొకప్పుడు మామూలుచర్మంతోనే ఉండేవి. ధృవాల్లో చలి పెరుగుతున్న కొద్దీ చర్మం కింద కొవ్వు ఉన్న ఎలుగు బంట్లకు మాత్రమే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఒకేతల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా అనేక వైవిధ్యాలుంటాయనుకున్నాం కదా! అదే సమయంలో ఒక జీవికి పుట్టినబిడ్డల్లో అన్నీ బ్రతకడానికి అవకాశం లేదు. కొన్ని చనిపోతాయి. ఏవి చనిపోతాయి? చుట్లూ ఉన్న పరిసరాలకు తట్టుకోగలిగేవి బ్రతుకుతాయి, తట్టుకోలేనివి చనిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎలుగుబంటికి అనేక పిల్లలు పుట్టాయనుకుందాం, వాటిలో చర్మం క్రింద కొవ్వు ఎక్కువ ఉన్నవీ, తక్కువ ఉన్నవీ ఉంటాయి. ఎక్కువ కొవ్వు ఉన్న పిల్లలు జీవించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తరాలు గడుస్తున్న కొద్దీ ధృవంలో చలి పెరుగుతున్న కొద్దీ చర్మం కింద మరింత ఎక్కువ కొవ్వు ఉన్నఎలుగుబంట్లు మాత్రమే నివసించి మిగిలినవి నశించి పోతుంటాయి. క్రమంగా ఆ లక్షణం అంటే చర్మం కింద కొవ్వు ఏర్పడే లక్షణం ధృవ ఎలుగుబంటి జన్యు లక్షణంగా మారిపోతుంది. అది అనువంశికంగా తన పిల్లలకు వచ్చేస్తుంది.

పరిణామ వాదానికి మరో ఉదాహరణ: మామూలుగా సరీసృపాలకు (బల్లిజాతి జీవులకు) నాలుగు కాళ్లుంటాయి. కానీ బొరియల్లో నివసించే పాములు వంటి వాటికి కాళ్లు ఉండవు. ఇది కూడా పైన చెప్పిన మాదిరిగా ఏర్పడే పరిణామ ఫలితమే. బొరియల్లో దూరే జంతువులకు కాళ్లు అడ్డం. అందువల్ల సరీసృపాల్లో ఏ జీవులకైతే కాళ్లు చిన్నవిగా ఉంటాయో అవి బొరియల్లో ఎక్కువగా దూరగలుగుతాయి. అందువల్ల బొరియల్లో నివసించే అవకాశాలు వాటికి పెరుగుతాయి. ఆ విధంగా కొన్ని వేల, లక్షల సంవత్సరాల కాలంలో కాళ్లుగలిగిన సరీసృపాల నుండి కాళ్లు లేని పాములు వంటి జీవులు పరిణామం చెందుతాయి.

కానీ మనిషి తన విజ్ఞానంతో, అంటే ఆలోచనా జ్ఞానంతో ప్రకృతి మీద విజయం సాధించాడు కనుక అతను ప్రకృతికి అనుగుణంగా మారడు. అంటే ఎడాప్ట్‌ కాడు. ప్రకృతినే తనకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు. చలి ప్రదేశంలో ఎలుగుబంటి మాదిరిగా తను శరీరంలో కొవ్వు పొర ఏర్పడేదే కాని చలి ప్రదేశంలో మనిషి తన పరిసరాలను తనకు అనుకూలంగా మార్చేస్తున్నాడు. రకరకాల దుస్తులు, పూర్వకాలంలో గుహలు, గుడిసెలు నేడు భవనాలు ఆ భవనాల్లో ఎసిలు, హీటర్లు ఇవన్నీ కూడా పరిసరాలనే తనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోవడమే. అందువల్లనే విజ్ఞానవంతుడైన మానవునిలో భౌతికపరమైన పరిణామం జరగడం ఆగిపోయింది. ఎప్పటినుండి ఇలా అయిందంటే, శాస్త్రవేత్తలు చెబుతున్నది సుమారు 40,000 సంవత్సరాల క్రితం నుండి అని. నేటి ఆధునిక మానవుడైన క్రోమాన్యన్‌ మానవుడు తన పూర్వీకులనుండి 40,000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. పనిముట్లు ఉపయోగించడం, నిప్పు ఉపయోగించడం ద్వారా అతను అప్పటినుండి ఇప్పటివరకు ప్రకృతిని తనకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు. కనుక ఆనాటి నుండి మనిషి భౌతిక పరిణామం ఆగిపోయింది. అప్పటినుండి జరిగిన పరిణామం అంతా, మానవ సమాజంలో వస్తున్న మార్పులే. అప్పుటి నుండి మనిషి భౌతిక పరిణామం ఆగిపోయి అతని సాంస్కృతిక పరిణామం మాత్రమే జరుగుతున్నదన్నమాట.

పెద్ద మెదడు, చిన్న శరీరం!

మనిషి యంత్రాలను కనిపెట్టి వాటితో తనకు కావలసిన పనులు చేయించుకుంటున్నాడు కనుక కాల క్రమంలో మనిషి శరీరం తగ్గిపోయి, అతని మెదడు తద్వారా అతని తల పెరుగుతుందని కొంతమంది ఊహించారు. నిజానికి ఇటువంటి ఊహ ఆధారంగా అనేక సైన్స్‌ ఫిక్షన్‌ కథలు, నవలలు, సినిమాలు, టీవీ సీనియళ్లు వచ్చాయి. స్టీఫెన్‌ స్పీల్‌ బర్గ్‌ తీసిన “ET” గానీ, అంతకు ముందు సంచలనం సృష్టించిన “క్లోజ్‌ ఎన్‌కౌంటర్స్‌ ఆఫ్‌ ది థర్డ్‌ కైండ్”వంటి అనేక సినిమాల్లో అంతరిక్ష వాసులను చిన్న శరీరం, పెద్ద తల ఉన్నట్లు చూపించారు. భూమ్మీద కూడా మనిషి శారీరక శ్రమకు దూరమై, మానసిక శ్రమ చేస్తూ చేస్తూ ఒక నాటికి సినిమాల్లో చూపించిన గ్రహాంతర వాసుల మాదిరిగా తయారవడా అనేది వారి తర్కం.

కానీ ఇదీ జరిగేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మనిషి క్రమంగా ఆహారం, వస్తువుల ఉత్పత్తి కోసం శారీరక శ్రమచేయడం లేదన్న మాట వాస్తవమే అయినా అతను శ్రమకు మాత్రం దూరం కావడం లేదు. ఎందుకంటే ఎంతో మేధో సంపత్తి గల మానవుడు యంత్రాల ఆవిష్కరణల మూలంగా తనకు దొరికిన విశ్రాంతి సమయాన్ని ఆటలు, పాటలు, సాహస యాత్రలు, సాహస క్రీడలు, అనేక రకాల వ్యాయామాలకు వినియోగిస్తున్నాడు. అందుకే ఆహారం సమృద్ధిగా దొరకని, ఆరోగ్యం సరిగ్గా అందని ఒకనాటి కన్నా నేడు అన్ని దేశాల్లోనూ మానవుల సగటు ఎత్తు, బరువు పెరిగింది. ఆయు: ప్రమాణం పెరిగింది. ఒలింపిక్స్‌ వంటి క్రీడల్లో రానురాను రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నారంటే ఎంతగా సాధన జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు.

అందువల్ల రానున్న కాలంలో కృత్రిమ మేథ, రోబోటిక్స్‌, జనిటిక్‌ ఇంజినీరింగ్‌ వంటి కొత్త టెక్నాలజీలు ఎంతగా పెరిగినప్పటికీ మనిషి శారీరక శ్రమకు దూరం కాడు. వాస్తవానికి నేడు జీవనం కోసం బలవంతంగా శ్రమ చేస్తున్న మనిషి కొత్త సమాజంలో సంపాదనకోసం కాకుండా స్వేచ్చగా తనకు ఇష్టమైన పని చేస్తాడు కనుక మరింత శ్రమ చేస్తాడు, మరింత శరీర ధారుఢ్యం పెరుగుతుంది.

– ఎస్‌. వెంకట్రావు

జీవ పరిణామం అందులోనూ మానవుల్లో జీవ పరణామం ఇంకా కొనసాగుతోందా లేక ఆగిపోయిందా? అనేది శాస్త్రవేత్తల్లోనే కాక శాస్త్ర అభిమానుల్లోనూ వున్న ప్రశ్న. ఈ వ్యాసం పై ప్రశ్నకు ఒక వైపు నుంచి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ‘జనవిజ్ఞానం‘ ఈ విషయం మీద చర్చకు ఆహ్వానిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *