ఇస్లామిక్ రామాయణాలు!

– విఠపు బాల సుబ్రహ్మణ్యం

‘రామాయణపు అందమంతా దాని వైవిధ్యంలోనే వుంద’ ని  నానుడి ! అవును రామాయణం చిత్ర విచిత్రమైంది. అది ఎల్లలు దాటి అల్లుకుపోయింది. ఒక్కోచోట ఒక్కో రూపంలో కనిపిస్తూ దేనికదే ప్రత్యేకం కావడం, స్థానిక సంస్కృతులతో మిళితమై పోవడం, ఎవరికి వారు వారి పద్ధతుల్లోకి మార్చుకోవడం రామాయణానికే చెల్లింది. మతంతో సంబంధం లేకుండా, ఏ వివాదాలతో నిమిత్తం లేకుండా ఒక సాంస్కృతిక సంపదగా జనజీవితంలో రామాయణం దేశదేశాల్లో భాగమైపోవడం అద్భుతం, ఆశ్చర్యమే గాదు మనందరికీ గొప్ప పాఠం కూడా!

దేని అందం దానిదే!

ప్రపంచంలో సుమారు మూడు వందల రామాయణాలు వున్నాయంటారు. ఇవి గాక జానపద రామాయణాలకు లెక్కే లేదు. వీటిలో వాల్మీకి రామాయణం ప్రధాన స్రవంతిలో వుంది. మిగిలినవి పాయలు. కానీ ఏ పాయకదే ప్రత్యేకం!  దేని అందం దానిదే! ఇతర దేశాల్లోనే కాదు భారతదేశంలో సైతం బౌద్ధ, జైన, హిందూ ,దళిత, ఆదివాసీలకు ఎవరి రామాయణాలు వారికున్నాయి. ఇక జానపదులకైతే చెప్పలేనన్ని వాచిక రామాయణాలున్నాయి.

అంతవరకు బాగానే వుంది. మరి ముస్లింలకు కూడా రామాయణాలు వున్నాయా అంటారా? ఉండకేం ? ఒకటి కాదు బోలెడు రామాయణాలు వారికీ వున్నాయి. అంటే ఇస్లామీకృత రామాయణాలన్నమాట.

  భారతీయ ఇస్లామిక్ రామాయణాలు

ఇస్లాం ప్రకారం వేల ప్రవక్తలు మహమ్మద్ కు ముందే దేశ దేశాలు పర్యటించారు. వీరెవరూ దేవుళ్ళూ, దేవ కుమారులూకాదు. గొప్ప మానవులు! విచిత్రమేమంటే వీరిలో రాముడు, కృష్ణుడు కూడా వున్నారు ! వీరు భారతదేశంలో పర్యటించారు. ఇలా కావలసినన్ని కథలు చిలవలు పలవులుగా కనిపిస్తాయి. వీటికి గొప్ప గొప్ప పండితుల సమర్థనలకూ కొరవ లేదు. ఈ నేపథ్యంలోనే అక్బరు చక్రవర్తి కోరికపై అబ్దుల్ క్వాదీ బదానీ వాల్మీకి రామాయణాన్ని పర్షియాలోకి (1584 -89) అనువదించాడు. జహంగీర్ నాటికి ‘రామాయణ -ఏ -మసి ‘ గొప్ప ప్రాచుర్యం పొందింది. దీన్ని సాదుల్లా ఖైరానవీ రచించాడు. విచిత్రం ఏమంటే ఇందులో జీసస్, మరియం (మేరీ ) కూడా పాత్రలు!

బయటి దేశాల్లోనే కాదు భారతదేశంలోనూ ఇస్లాం రామాయణాలున్నాయి. మొదట వాటిని గురించి మాట్లాడుకొందాం. ఇస్లాం భారత్ లోకి ప్రవేశించాక ఇక్కడి హైందవ సంస్కృతితో మెల్లమెల్లగా కలిసి పోసాగింది. సూఫీ-భక్తి సమ్మేళనం మన సాంస్కృతిక చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ముస్లింలు విష్ణువును ఆరాధించేదాకా! సూర్య ఆరాధన ఈజిప్షియన్లదని మనకు తెలుసు. అరబ్బుల” రబ్బ ” (అరబిక్ దేవుడు), “రహమాన్” ఇవి రెండూ రాముడినే సూచిస్తాయంటాడు ప్రసిద్ధ పరిశోధకుడు బలరాం ఫణిక్కర్. అలాగే ప్రముఖ మేధావి, పరిశోధకుడు ఎంవి వెంకటరత్నం కూడా దశరథుడికీ,  14 వ శతాబ్దపు “తుష్రట్టాకూ” ( సాధారణ శకం14 నాటి మితానీ రాజు ) ; రాముడికీ రామసెస్ -2 కూ (ఈజిప్టు ఫారో) సామ్యం వుందంటాడు. ఈజిప్ట్ ఫారోల్లో ” రాత్నమ్” ప్రముఖుడు కావడం గమనించదగ్గదంటాడు.

మలయాళీ మాప్పిల రామాయణం

ఎక్కడెక్కడికో ఎందుకు ? ఇప్పుడు మనం మలబారు (కేరళ) వెళదాం. ఇక్కడ “థెయ్యాం” అనే నృత్యం ఉంది. దీన్ని హిందూ దేవాలయాల్లో, ఆచారాల్లో భాగంగా ముస్లిం మహిళలు ప్రదర్శిస్తారు. మాప్పిలా థెయ్యామైతే మరీ ప్రాచుర్యం గలది. కేరళలో మాప్పిలులు ముస్లింలు. వీరి రామాయణం మాప్పిల రామాయణం.  ఇందులోని ఉమ్మాచ్చి, లెయ్యాం ,ముక్క్రి పాత్రలన్నీ ఈ మహిళలే పోషిస్తారు. ఇందులో రాముడు “లాముడు”. సీతకు జరిగిన అన్యాయాన్ని పై పాత్రధారులు అల్లాతో మొరపెట్టుకుంటారు. లామ, లావణ ఇందులో ప్రధాన నాయకులు.

ఈ మాప్పిల రామాయణంలో దశరధుడికి నిఖా జరుగుతుంది. ఆయన రాముడికి “బాప్ప”. శూర్పణఖ మాప్పిల ముస్లిం స్త్రీల దుస్తులు ( ఆహార్యం) ధరిస్తుంది. మొదట రాముడి ( Bearded Saint ) కీర్తన ఉంటుంది. మరో పాటలో శూర్పణఖ శృంగార కీర్తన వుంటుంది. షరియత్ ప్రకారం నలుగురిని పెళ్లాడవచ్చునని ఆమె రాముడితో వాదిస్తుంది! ఈ ముస్లిం రామాయణాలు వాచికాలుగా, గ్రాంథికాలుగా రెండు విధాలుగా కనిపిస్తాయి.మొదట వీటిని ‘అరబ్బీ-మలయాళీలో’ రచించేవారు. మణిప్రవాళంలాగా రెండు భాషల కలగాపులగమన్న మాట!

ఇలాగే ‘ఇషాల్ రామాయణం’ కూడా మలయాళీ ముస్లింలలో ప్రసిద్ధం .ఇషాల్ అంటే రాగం అని అర్థం. దీన్ని మల్లపురం స్థానిక కవి ఒ. యం. కురవర కుందు రచించాడు. ఇందులో 140 గీతాలన్నాయి. వీటిలో కూడా వాక్యాలకు వాక్యాలు అరబ్బీలో ఉంటాయి. రామరావణ యుద్ధానికీ, ఏడవ శతాబ్దపు బాదర్ యుద్ధానికి పోలిక కనిపించడం దీని ప్రత్యేకత .దీన్ని “ఒప్పన్న” కళారూపంగానూ ప్రదర్శిస్తారు. ఇది ముస్లింల ప్రసిద్ధ కళ .పెళ్ళిళ్లల్లో దీన్ని ముస్లింలు ప్రదర్శిస్తుంటారు. ప్రదర్శనకు తగ్గట్టు కథావస్తువును ఎప్పటికప్పుడు మార్చేసుకోడం దీని ప్రత్యేకత.

కురుమన్ కురిక్కల్ అనే ఇస్లామిక్ పండితుడు (పాలక్కడ్ నివాసి)1992లో  ” నవీన రామాయణం ” రచించాడు. ఇది 720 పేజీల బృహద్ గ్రంథం.దీనికి ప్రఖ్యాత హిందూ పండితుడు వడనూర్ వడక్కెప్పెట్టు నారాయణ నాయర్ ముందుమాట రాశారు. తమిళంలో రామావతారం పేర కంబరామాయణం పునర్వచింపబడ్డాక, తమిళ పండితులు ఉమర్ పూలవర్, యం.యం ఇస్మాయిల్ ( రాజకీయ నాయకుడు) దీనికి గొప్ప ప్రచారకులయ్యారు. ఇలా భారతీయ ముస్లింలు రామాయణాన్ని తమ సంస్కృతిలో ఎంతో గొప్పగా భాగం చేసుకున్నారు.

రామాయణంలోకి ఆదమ్, అల్లాలు!

ఈ ధోరణి ఇండోనేషియా, చైనా, వియత్నాం,  జపాన్, థాయిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే వీటిలో కొన్ని దేశాలు రామాయణం తమ భౌతిక ప్రదేశాల్లోనే జరిగినట్టు చెప్పుకోవడం. థాయిలాండ్ లోని “ఆయుథాయ ” అనేదే అయోధ్య అట ! తుర్కిస్థాన్లోని కొథాన్ ప్రాంతం పేర కొథాన్ రామాయణం వుంది. ఇండోనేషియాలోని రామాయణాలకు భారత రామాయణాలకు పోలికలెక్కువ. ఈ దేశపు’ జావనీస్ రామాయణం ‘మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా వుంటుంది. ఇక ‘కకావిన్ రామాయణ ‘కవి. “సునన్ కలిజగ” ఆదికవి (ఆది వలి )! ఆయన కూడా అచ్చం మన వాల్మీకి లాగానే బందిపోటు.  ఒక సన్యాసిని దోచుకోవడంతో ఆయన “వలిగా” మారిపోతాడు. మారాక ఇస్లాం స్వీకరిస్తాడు. (ఇస్లాం ప్రచారకులని వలీలు అంటారు). వీళ్ళలో. “కలిజగ” మొదటివాడు.

ఇక ఇండోనేషియా ఇస్లాం రామాయణాల్లోని ” సేరతు కందం “, రామ కెళింగ” రామాయణాలు నాటకాలుగా సుప్రసిద్ధాలు. బాలి లోని “వయంగ వొంగ” నాటకపు సీనులన్నీ మన రామాయణంలోనివే! ఈ ఆధునిక రామాయణాలు అక్కడి నుంచి వియత్నాం, థాయిలాండ్, మయన్మార్లకు విస్తరించాయి. ఆశ్చర్యం ఏమంటే “సేరతు కందం” అనే రామాయణంలో ఆదమ్, మహమ్మద్ లు కూడా పాత్రలు. రామరావణుల మధ్య “జిబ్రీల్” ప్రవేశించి యుద్ధ నివారణకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఈ జిబ్రీల్ దేవతలకు, మనుషులకు మధ్యవర్తి మన నారదుడులాంటి వాడు.  ఇండోనేషియన్లు రామాయణాన్ని తమ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదగా భావిస్తారు. వాళ్లేమీ రాముణ్ణి దేవుడిగా ఆరాధించరు. రామాయణాన్ని పవిత్ర గ్రంధంగా పూజించరు.

అయిదు సార్ల నమాజు తప్పనిసరి!

ఫిలిప్పీన్స్ లోని మరో ఇస్లాం రామాయణం “మహారాడియా లావణాలో” రావణుడిది ప్రధాన పాత్ర. ఇతడికి ఎనిమిది తలలు !ఇతని తండ్రి పులు సుల్తాన్ బాండియార్.  ( ఇది మన పులస్త్యుడికి దగ్గరగా లేదూ?). ఈ పులు సుల్తాన్ తన కొడుకు లావణుడి చేష్టలు భరించలేక ఒక ద్వీపానికి తరిమేస్తాడు. ఈ దేశపు మరో రామాయణం ” హికాయత్ మహారాజా లావణ” కూడా రావణుడి ప్రవాసంతోనే ప్రారంభమవుతుంది. ఆ దీవిలో రావణుడు తన తన తలను అగ్నిలో దహించబోగా ఆదమ్ వచ్చి అతని విపరీత కోరికలన్నీ తీరుస్తాడు. కొన్ని రామాయణాల్లో అయితే సాక్షాత్ అల్లానే ప్రత్యక్షమై వరాలిస్తాడు! మన బ్రహ్మ కాస్తా అల్లా అయ్యాడన్నమాట! ఫిలిప్పీన్స్ ఇస్లాం రామాయణాలు ఎక్కువ భాగం మౌఖికాలు.  ఇప్పుడు వీటన్నిటిని జాగ్రత్తగా రికార్డు చేశారు.

 వీటిని ప్రదర్శించే ముస్లింలు రోజుకు ఐదు సార్లు నమాజు చేసి గాని రంగస్థలం ఎక్కరు. వారికి ప్రదర్శనంతా కంఠోపాఠం.

ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇస్లాం రామాయణాల కథ కంచికి చేరడానికి ఏళ్ళూ, పూళ్ళూ పడుతుంది. మన పంచతంత్ర కథల్లాగా, అరేబియన్ నైట్స్ కథల్లాగా రామాయణం కూడా ప్రాంతీయ మార్పులతో లోకమంతా విస్తరించిందన్నమాట ! ఒకసారి ఆలోచించండి ! రామాయణాన్ని మత గ్రంథం గానే భావిస్తే దానికింత బహుళ ప్రచారం లభించేదా? ఇన్ని దేశాల్లో ఇన్ని ప్రేమాభిమానాలు దక్కేవా ? ఇదీ భక్తికీ, సంస్కృతికీ మధ్య వున్న తేడా! 

ఆధారం: అజీజ్ తరువన (మలయాళం) ; “కారవాన్” నవంబరు 2021

One thought on “సంస్కృతి

Leave a Reply to G. Sudhakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *