మిఠాయి యుగంధర్ బాబు
“సార్ ! వాడు పున్నమినాగు సార్. వాడిని ముట్టుకోకండి.” “వాడిని పాము చాలా సార్లు కాటేసింది సార్. వాడి వొళ్లంతా విషం”. “వాడిని ముట్టుకోకండి”. పాఠశాలలో మధ్యాహ్నం పూట వంట చేసే ఆమె తన కొడుకు గురించి అందరూ ఇలా అంటుంటే… పిల్లవాడిని తీసుకొని ఊరు వదిలి పోవడానికి తయారయింది.
ఓ పది ఏళ్ల ముందు జరిగిన విషయం ఇది. ఒకే అబ్బాయిని పాము అనేకసార్లు కాటు వేయడమేమిటో..??? పున్నమినాగు వ్యవహారం ఏమిటో..??? అసలు విషయం తేల్చడానికి ఆ పాఠశాల ఉపాధ్యాయులు మమ్మల్ని ఆహ్వానించారు. జన విజ్ఞాన వేదిక తరఫున మేము ఆ పాఠశాలకు బయలుదేరాం.

ఆ అబ్బాయిని పాము కాటు వేసిన ప్రతిసారి ఓ ఆసుపత్రిలో చికిత్స చేసి విషం బయటకు తీశారట. వెళుతూ వెళుతూ దారిలో ఆ ఆసుపత్రికి కూడా వెళ్ళాం. అక్కడ డాక్టర్ లేదు, ఓ నర్స్ ఉంది. పలానా అబ్బాయి విషయం మాట్లాడుతూ నిజంగానే అన్నిసార్లు పాము కాటేసిందా ?… విషం ఎలా తీసారు ? అని అడిగితే ఆమె ఇలా చెప్పింది “ఆ అబ్బాయి శరీరంపై పాము కాటేసిన గుర్తులైతే సరిగా లేదు. ఎప్పుడూ రెండు చుక్కలు మాత్రమే కనిపించేవి. అక్కడ రాయి పెట్టి విషం బయటకు తీసే వాళ్ళం” అని మా చేతిలో చిన్న నల్ల రాయి పెట్టింది. పాము కాటేసిన చోట ఆ రాయి పెట్టి గట్టిగా కట్టేస్తే విషమంతా తీసేస్తుందట (ఈ రాయి గురించి తర్వాత చెప్తాను).
విషయం కొంచెం అర్థమైంది. తర్వాత ఆ పాఠశాలకు వెళ్లి ఆ అబ్బాయిని (పున్నమి నాగును) పిలిచి దగ్గరికి తీసుకున్నాను. అక్కడ ఉన్న పిల్లలందరూ గట్టిగా “ముట్టుకోకండి” అని అరిచారు. అందర్నీ సమాధానం పరిచి అసలు విషయం కనుక్కున్నాను. ఓ నాగుపామును అబ్బాయి ఒకరోజు రాయితో కొట్టాడట. ఆ పాము తప్పించుకొని పారిపోయి, అప్పటినుండి వాడిపై కసి పెంచుకొని వెంటాడుతోందట. ఆ అబ్బాయి ఇంటి నుంచి బయట కాలు పెడితే వెంటపడి తరిమి తరిమి కాటేస్తుందట. సైకిల్ లో పోతుంటే వేగంగా వెంటపడి తరుముతోందని, ఇప్పటికీ ఆరుసార్లు కాటేసింది అని ఆ అబ్బాయి చెప్పాడు. ఇది ఎవరైనా గమనించారా అటే… ప్రత్యక్ష సాక్షి ఎవ్వరూ లేరు అన్న సమాధానం వచ్చింది.
ఆ అబ్బాయిని బుజ్జగించి, పూర్తిగా విచారిస్తే తేలింది ఏమంటే….. ఒకసారి ఆడుకుంటూ ఉంటే ఆ అబ్బాయికి పొదలో ముల్లు గుచ్చుకుంది. పాము కాటేసిందేమో అని అపోహ పడి భయంతో కేకలు పెట్టాడు. వాళ్ళమ్మ ఆసుపత్రి తీసుకెళ్లింది. అక్కడ నర్స్ వాళ్లు ఆ నల్ల రాయి కట్టిపెట్టి, పడుకోబెట్టి పళ్ళు పాలు ఇచ్చారు. హాయిగా స్కూల్ ఎగ్గొట్టి ఓరోజు పూర్తి విశ్రాంతి దొరికింది. ఇదేదో బాగుందని ప్రతిసారి తనే ఓ ముల్లుతో కాలుపై గుచ్చుకొని ఈ పాము కాటేసిన నాటకం ఆడాడు. “అమ్మ పులి…. నాన్న పులి” కథ లాగా. ఈ ఆట శృతి మించి రాగాన పడి “పున్నమినాగు” అన్న బిరుదుతో ఊరు వదిలి పారిపోవాల్సిన స్థితి ఏర్పడింది. ఆ స్కూల్ పిల్లలందరికీ పాముల గురించి అన్ని విషయాలు చెప్పి భయం పోగొట్టి, ఆ అబ్బాయి పున్నమి నాగు కాదని, వాడి ఒంట్లో విషం ఏమి లేదని చెప్పి వచ్చాము.
నిజంగానే పాములు పగబడతాయా? పాములు పగబట్టే విషయంపై అనేక కథలు, కథనాలు, పురాణాలు, సినిమాలు, సీరియళ్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రచారంలో ఉన్నాయి. పాముల గురించి ఉన్నన్ని అపోహలు, ఊహగానాలు, కథలు, విగ్రహాలు, గుళ్ళు మరి ఇతర ఏ జంతువుల గురించి లేవు. మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ ఈ పాముల గురించి అనేక తప్పుడు కథనాలు, పురాణాలు ఉన్నాయి.
నిజానికి పాములు ఎలాంటి కసి పెట్టుకోలేవు. అసలు మనుషులను, జంతువులను గుర్తుపెట్టుకుని దాడి చేసేంత జ్ఞాపకశక్తి పాములకు ఉండవు. దాని మెదడు అంతగా అభివృద్ధి చెందలేదు. ఎపుడైనా ఒకే వ్యక్తిపై పాములు పలుమార్లు దాడి చేసి కాటు వేయడం యాదృచ్ఛికమే. పాములు కావాలని మనుషుల మీద దాడి చేయవు. తమకు ప్రమాదం కలుగుతుంది అని భావిస్తే ప్రాణ రక్షణ కోసం బుసలు కొడతాయి, లేదా కాటు వేస్తాయి. దెబ్బతిని తప్పించుకున్న పాములు “పగబడతాయి …ప్రాణాలు తీస్తాయి” అని చెప్పడం కేవలం మూఢనమ్మకం.

ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు బాగా వింటే “వాడికి పాము చెవులు” అంటారు. నిజానికి పాములకు బయట కనిపించే చెవులు ఉండవు. నేరుగా శబ్దాలను వినలేవు. దాని శరీరం కింద ఉండే పొలుసులు కంపనాలను (vibrations) మాత్రమే గ్రహించగలవు. పాములను ఆడించేవాడు నాగస్వరాన్ని ఊదేటప్పుడు నేల మీద చేతితో తడుతూ శబ్దం చేస్తాడు. ఆ కంపనాలు గ్రహించి పాము పడగ విప్పి, కళ్ళముందు కదులుతున్న నాగస్వరం బూరను చూసి తల అటు ఇటు కదిలిస్తుంది. అంతేగాని నాగస్వరాన్ని వినలేదు. ఇంట్లో నాగస్వరం పాట వింటుంటే పాములొస్తాయేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు ..అది ఒక అపోహ మాత్రమే.
లక్షల ఏళ్ళ నుండి భూమి మీద సంచరిస్తున్న అతి పురాతనమైన ప్రాణుల్లో పాములు కూడా ఒకటి. ఇవి సరీసృపాల (reptiles ) వర్గీకరణకు చెందినవి. పాములు మాంసాహారులు (carnivorous). పాములు తమ ఆహారాన్ని నమలలేవు, కొరకలేవు. ఆహారాన్ని నేరుగా మింగేస్తాయి. పాములు పాలు తాగవు. వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు పనికిరాదు. పాములు చాలా ముఖ్యమైన జీవులు. ఆహారపు గొలుసులో కీలకమైన మాంసాహారులుగా చిన్నచిన్న జంతువుల సంఖ్యను అదుపులో ఉంచుతూ ఎలుకలు లాంటి జంతువుల్ని పట్టి చంపి పంటలకు స్నేహకారిగా ఉంటున్నాయి. పాములు తోటమాలి లాగా పనిచేస్తాయి. పళ్ళు, విత్తనాలను తినే జంతువులను ఇవి తింటాయి. పొలాల్లో విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. ఇవి గద్దలకు ఆహారం అవుతాయి. అలా ఆహారపు గొలుసులో ముందుకు సాగుతాయి.
WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) లెక్కల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. వీరిలో మరణించడం లేక కళ్ళు పోగొట్టుకోవడం, కొన్ని అవయవాలు తొలగింపునకు గురికావడం లాంటివి జరుగుతున్నాయి. గ్రామీణ పేద ప్రజలకు పాముకాట్ల ప్రమాదం ఎక్కువ. అన్ని పాములు ప్రమాదకారి కాదు. కొన్ని పాములు మాత్రమే విషపూరితమైనవి. పాముకాటుకు చికిత్స కోసం మంత్రాలు, తంత్రాలు, పూజలు చేయకూడదు. పాముకాటుకు వెంటనే వైద్యం తీసుకోవాలి హాస్పిటల్ కి వెళ్లి యాంటీవెనం తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఈ యాంటీవెనం, అంటే విషానికి విరుగుడు. ఈ మందు పాము విషం నుంచే తయారు చేస్తారు. ఇంకా క్యాన్సర్, ఆర్థరైటిస్ స్ట్రోక్స్, ఆర్థరైటిస్, హిమొఫీలియా, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలకు మందులు తయారీలో పాము విషం వాడతారు.
ఇక పాముల గురించి అపోహలు, మూఢనమ్మకాలు తర్వాత తెలుసుకుందాం..