ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాల రావు

ప్రస్తుతం “వాతావరణ మార్పు” ప్రపంచాన్ని వణికిస్తున్న అంశమని అర్థమౌతూనే ఉంది. కారణం, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అన్ని రంగాల్లోకి అతిముఖ్యమైంది వ్యవసాయం-ఆహారొత్పత్తి. ప్రతి చిన్న వాతావరణ ఎగుడు, దిగుడులు, పర్యావరణ పరిణామాలు, అత్యంత సున్నితమైన జీవావరణం పై పడతాయి. ఫలితంగా మన ఆహారానికి కీలకమైన పంటల సాగు, జీవాల పెంపకం, సమస్యల వలయంలోకి నెట్టబడతాయని యిప్పటికే అనుభవాలు చెప్తున్నాయి.

ఈ వాతావరణ మార్పుకు “హరిత గృహవాయువులు (Green house gases)” మూలకారకాలని అర్థమౌతూనే ఉంది. హరితగృహ వాయువుల్లో బొగ్గుపులుసు (కార్భన్ డైయాక్సైడ్) వాయువు, మిధేన్, నైట్రస్ అక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్లతో పాటు హైడ్రోఫ్లోరో కార్బన్స్, సల్ఫర్ హెగ్సాఫ్లోరైడ్, పెరోఫ్లోర్ కార్భన్ వంటి ఫ్లోరినేటెడ్ వాయువులు ముఖ్యమైనవి. వీటి సాంద్రత పెరిగిన కొలది భూమి, పర్యావరణం వేడెక్కుతుంది. అనేక వాతావరణ మార్పులు సంభవిస్తాయి.

పట్టిక: గత శతాబ్దకాలంలో పెరిగిన హరిత గృహ వాయువుల సాంద్రత

హరిత గృహ వాయువుపెరుగుదల %
బొగ్గుపులుసు వాయువు31
మిథేన్151
ఓజోన్31
నైట్రస్ ఆక్సైడ్31

ఉష్ణోగ్రత పరంగా గత దశాబ్ది కాలంలో సాధారణ స్థాయికంటే షుమారు 0.60 సెల్సియస్ పెరిగింది. యిది అత్యంత వేగంగా పెరుగుతూ, వచ్చే వందేళ్ళల్లో 3.5 -5 సెల్సియస్ పెరిగే స్థితి కనబడుతున్నది. అలానే వర్ష ఋతువుల్లో మార్పు లొచ్చాయి. గత 14-15 సం||ల్లో 11 సంవత్సరాలు వర్షపాతం అనిశ్చిత స్ధితికి చేరినట్లు అర్ధమౌతుంది. వర్షం పడే రోజుల సంఖ్య కూడా తగ్గటం అనుభవం లోకొచ్చింది. సంవత్సరానికి 1.9 పిపియం స్థాయిలో బొగ్గుపులుసు వాయువు సాంద్రత పెరుగుతూ వస్తున్నది. ఫలితంగా 2050 నాటికి 550 పిపియం, 2100 నాటికి 700 పిపియం కు చేరే అవకాశం ఉంది. గత దశాబ్దకాలంలో చలిగాలులు, వర్షాభావ పరిస్థితులు, వరదలు, ఉప్సెనలు తరచుగా అనుభవంలోకొచ్చాయి.

సముద్రమట్టం 1950 నుండి సంవత్సరానికి 5మి. మీ పెరుగుతూ వస్తున్నదని అధ్యయనకారులు తెలియజేస్తున్నారు. అలాగే హిమాలయ పర్వత మంచు శిఖరాలు (Glaciers) వేగంగా కరుగుతున్నాయి. వ్యవసాయంతో ముడిపడివున్న వర్షపాతం, నీటి వనర్లు ఈ మద్యకాలంలో అనేక ప్రతికూల పరిస్ధితుల్ని కలిగించడం చూస్తునే ఉన్నాం. తీవ్రమౌతున్న వాతావరణ మార్పు ఈ స్ధితిని యింకా వేగవంతం చేసి ఆహారోత్తత్తి విషయంలో మనల్ని అభద్రతకు చేర్చబోతున్నది.

గత శతాబ్ద 70వ దశకం నుండి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావం, కరువు పరిస్ధితులు తరుచుగా పునరావృతమౌతున్నాయి. ఈ కరువులకు, పెరుగుతూపోతున్న ఉష్ణోగ్రతలకు, తగ్గుతున్న వర్షాపాతానికి, కరిగిపోతున్న మంచు పొరలకు, దిశ మరల్చబడుతున్న గాలులకు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలకు సంబధమున్నదనేని సైన్స్ చెబుతున్న సత్యం.

యిప్పటికే నీటి ఎద్దడి, భూవనరు తరుగుదల, పతనమౌతూపోతున్న జీవవైవిధ్యతలు మన అహార ఉత్పత్తిపై ప్రభావం చూపెడుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రత ఈ ప్రభావాన్ని వేగవంతం చేయబోతున్నదని వాతావరణ అధ్యయన కారులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో (సమోష్ణ, అధికఉష్ణ మండలాల్లో) వాతావరణ మార్పువల్ల వర్షపాత మోతాదు తగ్గకపోయినా, వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గుతూపోతున్నది. అనగా కుండపోత వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అనుహ్యమైన పరిస్ధితుల్లో కురుస్తున్నాయి. అలానే వర్షానికి, వర్షానికి మధ్య సుదీర్ఘ ఎడం ఉండడం వల్ల వర్షపాతం వ్యవసాయానికి ఏ మాత్రం అనువుగా ఉండటంలేదు.

ఫలితంగా భారతదేశంలో షుమారు 18 మిలియన్ హెక్టార్లు (మి.హె) పూర్తిగా వ్యవసాయానికి పనికిరాని (ఎడారి వంటి) భూమిగా మారుతుంది. మరోక 60మి.హె భూమి గాలి దుమారాల వల్ల నష్టకరంగా మారబోతున్నది. అనగా ప్రస్తుతం సాగుయోగ్యమైన భూమి తరగిపోవడానికి ఈ వాతావరణ మార్పు కూడా కారణమని గుర్తించాలి. భూసార పతనం, నేటి వ్యవసాయం ఎదుర్కొంటున్న అతిముఖ్య సమస్య. అసలే పూర్తి రసాయనాధారిత (హరితవిప్లవ) వ్యవసాయం, మట్టి లక్షణాన్ని మార్చింది. హరిత విప్లవ ప్రారంభంలో ఒక కిలో రసాయన (నత్రజని) ఎరువు ద్వారా 15 కిలోల తిండిగింజలు ఉత్పత్తి అయ్యేవి. అది 1989-90 నాటికి 7.5, 2000-2001 నాటికి 4.8, 2007-2008 నాటికి 3.6, 2020-23 నాటికి 2కిలోలకు దిగజారినట్లు నిపుణులు బయటపెట్టారు.

తీవ్రతరమౌతున్న వాతావరణ మార్పు ప్రభావాలు, రసాయనాల ద్వారా జరిగిన నష్టాన్ని యింకా ఎక్కువ చేస్తాయి.

భూమిలోకి చేర్చబడే కృత్రిమ నత్రజని, హరిత గృహ వాయువుల్లో ఒకటైన మిథేన్ మీద ప్రభావం చూపుతుంది. భూమిలో మనుగడ సాగించే కొన్ని సూక్ష్మజీవులు అనేక ప్రయోజనకర జీవ ప్రక్రియలకు ప్రేరకాలుగా ఉంటాయి. యివి నత్రజని ఎరువు వలన అణగారిపోతాయి. ఫలితంగా భూమికి మిధేన్ వాయువును పొదిమి పట్టుకొనే (దాచుకొనే) శక్తి తగ్గిపోతుంది. పైగా భూమిలో నిలిచిపోయే నత్రజని ఎరువు వల్ల నైట్రస్ ఆక్సైడ్ – మరో ముఖ్య హరిత గృహ వాయువు పేరుకుపోతుంది. యిది యింతటితో ఆగక, భూమి అడుగు పొరల్లోకి చేరి, సముద్ర జలాల్లోకి వ్యాపిస్తుంది. దాని వల్ల ‘పచ్చనాచు’ జాతి జీవులు విస్తరించి, నీళ్ళలోని ప్రాణ వాయువు సాంద్రత తగ్గించే స్థాయికొస్తుంది. ఫలితంగా చేపలు, ఇతర సముద్రజీవులు తరిగి పోతాయి. అంతేగాక సముద్రాల కుండే హరితగృహ వాయువుల్ని దాచుకోగల స్థితి దిగజారిపోతుంది.

నీటి వనర్లు :
భారతదేశం నీటి వనర్లక్కూడా ముఖ్య నిలయమని ఎక్కుమంది నమ్మకం. కాని జనభా దామాషాలో చూస్తే మనదేశంలో కేవలం ప్రపంచంలో లభించే మంచి నీటి వనర్లలో 4% మాత్రమే ఉన్నాయి. అనగా ప్రస్తుతం తలకొకరికి 1900 క్యు.మీ. నీరు మాత్రమే లభ్యమౌతున్నది. యిది 1947 నాటి స్ధితితో పోలిస్తే 1/3 వంతు మాత్రమే. 2050నాటికి ఈ లభ్యత 100 క్యు.మీ.కు దిగజారుతుంది. ఇది ప్రపంచ సగటు తలసరి లభ్యత (1700క్యు.మీ.)తో పోలిస్తే చాలా తక్కువ. అంతర్జాతీయ కొలమానాల ప్రకారం “నీటి ఎద్దడి” నీటి కొరత తీవ్రత ఎదుర్కొబోయే దేశాల్లో భారత దేశం ఒకటి కాబోతున్నది. యిప్పటికే దాదాపు 2/3 వంతు దేశంలో భూగర్భ జలాల పరంగా దిగజారుడు స్ధితిని చూస్తున్నాం. ఈ అతి విలువైన సహజ వనరు అతిప్రమాదకర స్థాయిని చేరటానికి మూలం, వాతావరణ మార్పు కూడాననేది వాస్తవం.

రాబోవు దశాబ్దాల్లో ఈ వాతావరణ మార్పు, భూగోళం వేడెక్కిపోయే పరిస్థితుల వల్ల నీటి వనర్లు యింకా దిగజారి పోతాయి. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమాలయ పర్వతాల వంటి ఎత్తు ప్రదేశాల్లో ఉండాల్సిన మంచు పొరలు (Glaciers) కూడా కరిగిపోతాయి. తాత్కాలికంగా నదుల్లో నీళ్లు లభించేందుకు అది తోడ్పడవచ్చు. కాని దీర్ఘకాలంలో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. పంటల సాగు సమస్యల వలయంలో చిక్కుకొనబోతున్నది. నిపుణుల అధ్యయనాల ప్రకారం గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో “లూని” నది వట్టిపోవటం వల్ల కరువు తాండవించబోతున్నది. అలానే మహి, పెన్నార్, సబర్మతి, తపతి వంటి సాధారణ నదుల మీద నడుస్తున్న వ్యవసాయం, సంక్షోభంలోకి నెట్టబడుతున్నది. కావేరి, గంగా, నర్మదా, కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, మహానదుల అనకట్టలపై నడిచే వ్యవసాయం ఇతర ఆహార ఉత్పత్తి వ్యాసాంగాలు గడ్డు పరిస్ధితి ఎదుర్కొనబోతున్నాయి.

ఈ పరిస్ధితుల్ని మన ప్రభుత్వ విధానాలు యింకా యింకా వేగవంతం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సాలీనా రు. 5000 కోట్ల భూగర్భజల వ్యాపారం నడుస్తున్నది. ఫలితంగా వాతావరణ ప్రభావం అత్యంత వేగంగా నీటి వనర్ల పై పడబోతున్నదని చెప్పనవసరం లేదు.

అనగా వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గటం నీరు వేగంగా అవిరైపోవటం, బాష్పోత్సేకం చెందడం సమంగా జరుగుతుంది.

వ్యవసాయం పై వాతావరణ మార్పు సూటి ప్రభావాలు :
ఉపరితల వేడి, చలికాలంలో 2-4 డీగ్రీల సెల్సియస్ పెరిగితే ఎంత ప్రమాదకరమో శాస్త్రవేత్తల ప్రయోగాలు సూచించాయి. దాని ప్రకారం ప్రతి 1 సెల్సియస్ వేడికి, 4-5 మి. ట గోధుమ ఉత్పత్తులు తగ్గుతాయి.

ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల వరి పంటకాలంలో మార్పు రావటం, దిగుబడుల్లో ప్రతి కూలత ఏర్పడటం గమనించబడ్డది.

అపిల్ వంటి శీతల ప్రాంత పండ్ల సాగుకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నట్లు గమనించారు. దీని వెనుక చలి గాలుల్లో వచ్చిన మార్పని తేలింది. ఫలితంగా హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల రైతులు ఊర్ధ పర్వత సానువుల్లోకి, అపిల్ సాగును మార్చుతున్నారు. రవాణా రీత్యా ఇది ప్రతి కూలతకి దారితీస్తున్నది.

చేపల, కోళ్ళ పెంపకాల పై కూడా ఈ వాతావరణ మార్పు తీవ్ర ప్రభావం కలిగిస్తున్నది. చేపల వృద్ధి తగ్గటం. సముద్రంలో వాటి వలసలు పెరగటం, కోళ్ళలో జబ్బు క్రిములు వ్యాపించడం వంటి ప్రతికూల అంశాల మీద వాతారణ మార్పులు ప్రభావం చూపుతున్నాయి.

వాతావరణ మార్పుల వల్ల, పంట సాగు కాలంలో తగ్గుదల, ఆడ పువ్వు భాగాలు వృధాగా మారడం, పుప్పొడిలో కణజాలాలు వికటించడం, గింజల పరిమాణం, సంఖ్యతగ్గడం, మగ, ఆడ మొక్క బాగాల మధ్య సమన్వయ పెరుగుదల లోపించడం, నీటి లభ్యత, చీడపీడల ఉదృతి పెరుగుతూ రావటం, భూమిలో “సేంద్రియ కర్బన్” స్థాయి తగ్గటం, గమనించబడిన అంశాలు.

వాస్తవానికి నత్రజని ఎరువుల్లో సగానికి పైగా మొక్కల బాహ్య పర్యావరణంలోకి పోతుంది ఆ రకంగా చేసినప్పుడు 2006-07లో షుమారు 100 మిలియన్ టన్నులతో సమానమైన బొగ్గు పులుసు, నైట్రస్ వాయువులు వాతావరణం లోకి వదలబడ్డాయి. అనగా మొత్తం హరిత గృహ వాయువుల్లో 6 శాతం ఈ రసాయన ఎరువుల వల్లే వాతావరణంలోకి వదలబడుతుందని అంచనాలు తెలుపుతున్నాయి. దీనితో పాటు, ఎరువుల వాడకం ఇతర సమస్యల్ని కూడా ఉపరితలంలోకి తెచ్చిందని అందరూ అంగీకరిస్తున్న సత్యమే. రాను రాను వీటి మోతాదు పెంచవలసి రావటం, అలానే వీటి ఫలితాలు దిగజారుడును సూచిస్తున్నది. భూ అడుగు పొరల్లోకి చేరిన రసాయన ఎరువుల వల్ల జలాలు-నదులు, చెరువులు కలుషితమౌతున్నాయి. వాటిని శుభ్రపరిచేందుకు మళ్ళీ హరిత వాయువుల్ని పెంచే ఇంధనాల్ని వాడాల్సి వస్తున్నది. వీటి వల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు మూడో వంతు భూమిలో చౌడు సమస్య ఉత్పన్నమైంది. ఈ మధ్య పండ్ల రకాల్లో చొప్పించబడిన మార్పులు (కృత్రిమ జన్యు మార్పిడి విధానం) కృత్రిమ రసాయన వనరుల అవసరాన్ని యింకా పెంచుతూ వస్తున్నాయి. 1970లతో పోలిస్తే రసాయన ఎరువుల వాడకం 9 రెట్లు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలే సూచిస్తున్నాయి. అలానే సస్యరక్షణ మందులు గతం కంటే మూడు రెట్లు పెరిగాయి.

ఆహారోత్పత్తి :
పెరిగే దేశ జనాభా రీత్యా(160 కోట్లు), 2025 నాటికి కనీసం125 మి.ట. బియ్యం,115 మి.ట గోధుమలు కావాలి. అదే విధంగా ముతక ధాన్యాలు, అపరాలు, నూనె గింజలు యిప్పటికంటే కనీసం 30-40 శాతం ఎక్కువ కావాలి. పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, గ్రుడ్లు, చేపలు, రొయ్యలు, వంటి వాటి ఉత్పత్తులు కూడా పెరగాల్సి ఉంది. (పట్టిక : 4)

పంటపెంచాల్సిన ఉత్పత్తి స్ధాయి (%)
వరి56
గోధుమ62
ముతకధాన్యాలు36
అపరాలు116
నూనె గింజలు120
కూరగాయలు40
పండ్లు35
గ్రుడ్లు22
మాంసం28
పాలు25

కానీ ఇప్పటికే హరితగృహ వాయువుల్లో ముఖ్యమైన కార్భన్రైఆక్సైడ్ సాంద్రత (550 పిపియం) పంట మొక్కల పై ప్రతికూలతల్ని సృష్టిస్తుంది. ఇక ప్రతి 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల వల్ల కరిగే హరిత గృహ వాయువుల సాంద్రతలో మార్పు పంటల దిగుబళ్ళను దిగజారుస్తూ పోయినప్పుడు పరిస్థితి ఏమిటి ? వరి, గోధుమ, పంటల ఉత్పత్తులు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల, కార్బన్ డయాక్సైడ్  వంటి వాయువుల సాంద్రత పెరుగుదల వల్ల తగ్గిపోతాయని శాస్త్రీయంగా గుర్తించబడ్డాయి. అంతేకాక ఆ గింజల్లో ముఖ్య పోషకాలు ఉండాల్సిన స్థాయిలో ఉండవని తేలింది. కొన్ని పంటల గింజలు ముడతలుబడి పోయి ఆహారానికి తగని స్ధితికి చేరతాయని కూడా అర్ధమౌతుంది.

ప్రత్యామ్నాయమేమిటి ? :
పంటల సాగు, వనర్ల వాడక పరంగా, సమూల మార్పులు అనివార్యంగా వస్తే తప్ప విషవాయువుల సాంద్రతని తగ్గించలేమని తేలింది. అయితే ఎటువంటి మార్పులు రావాలనే దాంట్లో వైరుధ్యాలు నెలకొనున్నాయి.

కొన్ని దేశాల్లో పూర్తి సేంద్రియ వ్యవసాయం (పంట సాగుకు కావల్సిన బాహ్య వనర్లు అవసరంలేని) భద్రత నివ్వగలదని తేల్చారు. అలానే పంటల వైవిధ్యత రక్షణ నివ్వగలదని తేల్చారు. దీన్ని వక్రీకరించి ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రచారంలో పెట్టారు.

సమగ్ర సస్యపోషణ, సస్యరక్షణలను ఆచరించినపుడు కూడా వ్యవసాయం ద్వారా ఉద్భవించే నష్టకర (వాతావరణ మార్పును వేగిరపరచే) వాయువుల సాంద్రత కొంతవరకు తగ్గింవచవచ్చని తేలింది. భూసారాన్ని పంట పోషకాలకనుకూలంగా మార్చగల, వానపాముల ఎరువులు, పశువుల ఎరువులు, పట్టణ కంపోస్టు, పచ్చిరొట్టె పెంచే పంటల వంటివి వ్యవసాయంలో ముఖ్య భాగాలయినప్పుడు వాతావరణ మార్పుకు తట్టుకోవచ్చని అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) వారు కూడా వివరించారు. అటువంటి కృత్రిమ రసాయనేతర వనర్ల వాడకం వల్ల చీడపీడల స్థాయి తగ్గటం, పంట మొక్కలు సరైన స్ధాయిలో పోషకాల్ని ఉపయోగించుకోవటాన్ని శాస్త్రవేత్తలు క్రోడీకరించారు. నీటిని పొదుపు చేసే వీలును కలిపించే ఎస్.ఆర్.ఐ. (System of Rice Intensification) వరి సాగు ఆర్ధికంగా ప్రయోకరమే గాక పర్యావరణ రక్షణకు శ్రేయస్కరమని తేలింది. అలానే భూగర్భ జల పునరుద్ధరణకు తగిన చెరువులు, కుంటలు, జలాశయాల్ని రక్షించుకోవాలి! తక్కువ నీటికి ప్రతిఫలమివ్వగల ఆహార పంటలకు (తృణధాన్యాలు) ప్రాధాన్యత నివ్వాలి! రసాయనేతర పద్దతుల్ని వ్యవసాయంలో అనుసరించాలి. జీవసాంద్రత (Bio-Intensive) విధానాల్లో కీలకమైన అనేక అంశాల్ని వ్యవసాయంలో రూపొందించుకొని ఆదరించాలి! నీటిని వ్యాపార వస్తువుగా మార్చే విధానాలకు ప్రభుత్వాలు స్వస్తి చెప్పాలి! వ్యవసాయంలో శిలాజ ఇంధనాలు, ప్లాస్టిక్ పాత్ర గణణీయంగా తగించాలి! చిన్న కమతాల కుటుంబ ఆధారిత సేద్యం ద్వారా పటిష్టతను పెంచే పద్దతుల్ని ప్రోత్సహించాలి! వనర్ల పరిరక్షణకు ప్రాధాన్యత నిచ్చే రైతులకు, అధిక ఆధాయం లభించే విధంగా మార్కెట్ రక్షణ, కృత్రిమ వనర్ల అందుబాటు, పరపతి లభ్యత, బీమా అనివార్యంగా ప్రభుత్వం కల్పించాలి! అనగా వాతావరణ ఒడిదుడుకుల్పి తట్టుకొనే శక్తిని చిన్న రైతులకు కల్పించాలి. జాతీయ వ్యవసాయదార్ల కమీషనన్ (NFC) 2007 లోనే, ఈ విషయాన్ని ప్రభుత్వం ముందు పెట్టిందని గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *