డా.యం.గేయనంద్
ప్రాథమిక జ్ఞాన విజ్ఞానాలు..ని, ఎవరో మంత్రం వేసినట్టు సృష్టించలేదు. జీవ పరిణామంలో మానవజాతి ఆవిర్భావం యాదృచ్ఛికం. భూఖండాలు కలవడం విడిపోవడం, వివిధ శీతోష్ణ పరిస్థితులు లక్షలాది సంవత్సరాలు కొనసాగడం, మంచు యుగాలు ఏర్పడటం, మధ్యలో వెచ్చటి వాతావరణాలు, అడవులు పెరగడం క్షీణించడం, మైదానాలు ఏర్పడటం, అగ్నిపర్వత విస్పోటనం – ఇలాంటి పరిణామాల మధ్య, తిని తిరిగి నిలదొక్కుకోగలిగిన జీవులు మానవ స్వరూపం సంతరించుకున్నాయి. గత 60-70 లక్షల సంవత్సరాలలో, ఒక్కోసారి ఒక్కో శారీరక లక్షణాన్ని అభివృద్ధి చేసుకొంటూ వచ్చాయి. జీవ జన్యువులలో అనుకోకుండా వచ్చే మార్పుల నేపథ్యంలో మానవజాతి రూపుదిద్దుకున్నది.
మన వయసు 26 లక్షల సంవత్సరాలు...
మానవజాతి అంటే ఒక్క జాతే కాదు. గత 26 లక్షల సంవత్సరాలలో, వివిధ రకాలుగా మార్పులు సంతరించుకుంటూ వచ్చిన 15 రకాల మానవుల రకాలు ఉండేవని ఆంత్రోపాలజిస్టులు అంటున్నారు. ఒక్కోసారి రెండు మూడు జాతులు ఒకే సమయంలో బతికిన రుజువులు ఉన్నాయి. ప్రస్తుతానికి (శాస్త్రజ్ఞుల మధ్య విభేదాలు ఉన్నా) ఈ జాతులన్నింటినీ, మన పూర్వీకులుగా భావిద్దాము. ఇప్పటికీ, అత్యంత ఎక్కువ కాలం, విజయవంతంగా జీవించిన మానవజాతి మనం కాదు. అది హోమో ఎరక్టస్ అనే జాతి. ఆ జాతి దాదాపు ఒక లక్ష సంవత్సరాల క్రితమే అంతమైంది. హోమో ఎరక్టస్, ఒక పది లక్షల సంవత్సరాలు బతికితే, మనం అంటే హోమో సెపియన్స్ పుట్టి ఇంతవరకు గడిచింది మూడు లక్షల సంవత్సరాలే. హోమో ఎరక్టస్ బతికినన్ని రోజులైనా, మనం అంతం కాకుండా ఉంటామనే హామీ లేదు. నిజానికి అది మానవజాతి చేసే నిర్ణయాల మీద ఆధారపడి ఉంది.
ఒక కీలక నిర్ణయం..
ఇటువంటి నిర్ణయమే, 25-26 లక్షల సంవత్సరాల నాడు, అప్పుడున్న హోమో హెబిలిస్ (పరికరాలు వాడేమానవుడు అని అర్థం) అనే మానవజాతి తీసుకున్నది. అది రాతిని పనిముట్టుగా వాడాలనుకోవడం. అప్పటినుంచి పాత రాతియుగం ప్రారంభమైందని, సాంకేతికంగా అనవచ్చు. బెర్నాల్ ఒక మాట అంటాడు. ‘ఒక రాతిని చేత్తో పట్టుకొని, ఎప్పుడైతే ఒక లక్ష్యం వైపు మనిషి విసిరాడో- అప్పుడే మానవుడి సాంకేతిక అభివృద్ధి ప్రారంభమైంది’ అంటాడు. ఈ పనిముట్టుని తయారు చేసే ఇంకో పనిమట్టును(tool) తయారు చేసుకున్నప్పుడు, ఇక ఆ అభివృద్ధి ఒకదానికొకటి, అంతం లేకుండా కొనసాగుతూ పోతుందని అంటాడు. ఇప్పటికీ 10,500 సంవత్సరాల ముందు కాలమంతా, పాత రాతియుగమే. అయితే ఈ పాత రాతియుగం వివిధ ప్రాంతాలలో వివిధ సమయాలలో ఉంది. ఒకే సమయంలో లేదు. పాత రాతి యుగంలో మానవ జీవితం ఏ విధంగా ఉండేదో, మెదడు, శరీరం, సంస్కృతి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసుకోవాలంటే, పాత రాతి యుగ కాలాల లోతుల్లోకి వెళ్ళటం తప్పనిసరి. హోమో సెపియన్స్(అంటే తెలివైన మానవుడు అని అర్థం) అనే ఆధునిక మానవజాతి ఆవిర్భావానికి రంగస్థలం పాత రాతియుగమే.
హంటర్ గాదరర్ సమాజాలు..

పాత రాతి యుగం సమాజాలను, వేట ఆహార సేకరణ (హంటర్ గాదరర్) సమాజాలు అంటారు. అంటే జంతువులను వేటాడే, పళ్ళు ఫలాలు ఏరుకునే సమాజాలని అర్థం. ఈ సమాజాలలోకి, రాతి పనిముట్లుప్రవేశించాయి. రాతిని పనిముట్టుగా చేయడం అంటే, దాని పెచ్చులు తీయాలి. కూచిగా చేయాలి. చేతిలో ఒదిగేట్టు మార్చుకోవాలి. ఆ తరువాత వాటిని వేటలో వాడాలి. చనిపోయిన జంతువులను, కోయడం, కత్తిరించడం, కుచ్చడం, గోకడం చేయాలి. ఇవన్నీ మామూలు చర్యలుగా అనిపిస్తాయి. కానీ బెర్నాల్ ఏమంటాడంటే, ‘ఇవన్నీ మనిషిని, భౌతిక, జీవ, విజ్ఞానాల వైపు మళ్ళించాయి’, అని. అంతేకాదు జంతు మాంసం లభించడం, తినడం, అంత ముందు కంటే సులభంగా మారింది. ఇది మెదడు పరిణామంలో మార్పులకు కారణమైంది.
కాలక్రమంలో ఈ పనిముట్ల రూపురేఖలు మారాయి. గులకరాళ్లుగా, పెచ్చులుగా ఉన్న పనిముట్లు, రాతి గొడ్డలిగా, రాతి కత్తులుగా, సమాంతర ముఖాలు గల కత్తులుగా, మొనదేలిన, అర్థ చంద్రకారంలో ఉన్న పనిముట్లుగా క్రమేణా మార్పులకు గురి అయ్యాయి. ఎముకలు, పశువుల కొమ్ములు, చెట్ల కొమ్ములు పనిముట్లు అయ్యాయి. వేట సమయాలలో, ఆహార సేకరణ సమయాలలో ఈ పనిముట్లను చేతిలో పట్టుకుని తిరగాల్సి వస్తుంది. అందులో సౌలభ్యం ఉండదు. అందుకే చేతికో నడుముకో, కాలికో, వెంట్రుకలతో తగిలించుకోవడం నేర్చుకున్నాడు.. క్రమేణ ఎమకలు ఈకలు చర్మాలు వీటికి తోడయ్యాయి. బొచ్చు ఉండే చర్మంలో వెచ్చదనం అర్థమై ఉంటుంది. మొదటి దుస్తులు చర్మాలే. చర్మాన్ని కాలికి రక్షగా వాడి ఉంటాడు. దీనితో మనిషి తిరుగాడే పరిధి బాగా పెరిగి ఉంటుంది. ఇదంతా ఒక రోజులోనో, ఒక సంవత్సరంలో జరిగేది కాదు. ఇందుకు కొన్ని వేల సంవత్సరాలు పట్టి ఉండవచ్చు. జంతు చర్మాలను/ చెట్ల ఆకులు, బెరళ్లను శరీరాన్ని కప్పుకోవడానికి వాడటం ప్రారంభమై, 1,70,000 సంవత్సరాలయి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చెట్ల ఆకులు కొమ్మలనో, జంతు చర్మాలనో ఉపయోగించి, వేటాడే సమయాలలో, వేచి ఉండటం కోసం, తాత్కాలిక నివాస స్థలాలను నిర్మించుకోవడం ప్రారంభమై నాలుగు లక్షల సంవత్సరాలు ఉండొచ్చు. రసాయనిక క్రమాలకు కారణమైన నిప్పు.. కొన్ని జంతువులు పక్షులు కీటకాలు రకరకాల పుల్ల పుడకలను వాడుకుంటాయి. కట్టుకోవడం అల్లడం నేయడం కూడా ఒక సహజాతంగా చేస్తాయి. కానీ ఇవి చేయలేని పని ఒకటి, ఆదిమ మానవుడు చేశాడు. అదే నిప్పును వాడటం, మచ్చిక చేసుకోవడం. అయితే ఇది ఎలా జరిగిందో ఖచ్చితంగా చెప్పలేము. అగ్నిపర్వతాల దగ్గరో, సహజవాయువులు వెలువడే చోటో, కార్చిచ్చుగానో ఉండే నిప్పు మొదట భయాన్ని కలుగజేసి ఉంటుంది. అది ప్రమాదకరంగా కష్టంగా కూడా ఉండి ఉంటుంది. అందుకే ప్రపంచంలో అన్ని చోట్ల నిప్పు చుట్టూ కథలు పురాణాలు కనిపిస్తాయి. 20 లక్షల సంవత్సరాల నాడు, నిప్పును, రాత్రిపూట శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి, బహుశా మొదట వాడి ఉండొచ్చు. ఆస్ట్రేలియా ఆదిమ జాతులు శరీరం చుట్టూ కాగడా లాంటివి, దుస్తులకు బదులుగా, కట్టుకుంటారు. అది బహుశా జంతువులను భయపెట్టడానికి కూడా కావచ్చు. చలి మంటలు వేసుకోవడం అలవాటయిన తర్వాతే, ఆహారాన్ని కాల్చి తినడం అనుకోకుండా ప్రారంభమై ఉంటుంది. రాతి పనిముట్టును, నిప్పునూ వాడటం తెలిసిన తరువాత, ఆదిమానవుడు ఒక వైజ్ఞానిక మానవుడిగా మారడం ఒక సహజ క్రమమే. పనిముట్టు అతన్ని భౌతిక యాంత్రిక విజ్ఞానాల వైపు నడిపింది. నిప్పు రసాయన విజ్ఞానానికి కారణమైంది. నిప్పును వాడి, మాంసాన్ని దుంపలను కాల్చుకోవడం పెద్ద కష్టమేమీకాదు. కానీ నీళ్లను మరిగించడం మాత్రం ఒక పెద్ద సమస్య. చర్మాన్ని వాడటం మొదట్లోనే నేర్చుకున్న మానవుడు చర్మపు దోనెల్ని తయారు చేసుకుని ఉంటాడు. రాళ్లను మంటల్లో కాల్చి, ఆ వేడి రాళ్ళను చర్మపు దోనెల్లోని నీళ్లలోకి వేయడం ద్వారా, నీళ్లను వేడి చేసి ఉండొచ్చు. ఇదొక సృజనాత్మకమైన చర్య అంటాడు బెర్నాల్. ఇట్లా చిట్లిన రాళ్లు మానవుడి చరిత్ర పూర్వ ఆవాసాలలో(Prehistoric camps) కనిపించాయి. ఆ తర్వాత్తరువాత బహుశా వెదురు బుట్టకు మట్టి ముద్దలను అతికించి, అందులో నీటిని వేడి చేయొచ్చని తెలుసుకొని ఉంటాడు.

ప్రాచీన శిలాయుగం చివరికంతా (11 వేల సంవత్సరాల నాడు), బుట్టను వేరు చేసి, మట్టి పాత్రను వాడొచ్చని, అందులో నీళ్లను వేడి చేయవచ్చని తెలుసుకొని ఉండొచ్చు. అయినా నీళ్లను కాచడం ఒక కష్టమైన పనే. ముఖ్యంగా వేట సమయాల్లో వాటిని మోసుకుపోవడం బరువైన విషయమే. ఇట్లా మట్టి పాత్రల వాడకం అర్ధమైన తర్వాత, పులియపెట్టడము అర్థం అయి ఉంటుంది. ఒక పదార్థం ఇంకో పదార్థంతో కలిపితేనో, ముంచితేనో మారుతుందని తెలుస్తుంది. ఇదే తొలి రసాయన విజ్ఞానం. ఈ విజ్ఞానం మొదటి విజయం రంగులు తయారు కావడం. తన ఆహారాన్ని సంపాదించుకునే క్రమంలో, తన్ను తాను రక్షించుకునే క్రమంలో, మనిషి ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని పోగు చేసుకున్నాడు. గుంపులో ఉన్నవారు ఒకరినొకరు చూసి నేర్చుకున్నారు. ఈ క్రమంలో పనిముట్లు, నిప్పు ఒక ముఖ్యమైన పాత్ర వహించాయి. నాలుగు లక్షల సంవత్సరాల నాడు, అగ్ని వాడకం మామూలైపోయింది.
తొలి జీవ విజ్ఞానాలు..
కానీ ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రకృతిని పరిశీలించడం అంటే, ప్రకృతినంతా పరిశీలించడం కాదు. ఆహార అవసరాలు, రక్షణ లాంటి ఇతర అవసరాలు తీర్చుకునే క్రమంలో ఉండే పరిసర ప్రకృతిని పరిశీలించేవాడు. ఆ విధంగా జంతువుల ప్రవర్తన మొక్కల లక్షణాలు గమనించాడు. బహుశా ఆదిమ మానవుడి ఆసక్తి ఎక్కువ భాగం జంతువుల పైన మొక్కలపైనే ఉండి ఉంటుంది. చలించే జంతువులను వేటాడే వేటలో ఒక ఉత్సాహం కూడా ఉంటుంది. ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇదంతా జీవ విజ్ఞానాలకు ఒక పునాదిని సమకూర్చింది. అప్పుడు మనిషి నివసించిన గుహల్లో గీసిన బొమ్మలలో, జంతువుల చిత్రాలే ఎక్కువ కనిపిస్తాయి. ఈ చిత్రాలలో, పైపై ఆకారాలే కాక, ఎముకలు గుండె ఇంకా అంతర్భాగాలు కూడా చిత్రించారు. బహుశా వేటాడిన జంతువులను కోసినప్పుడు గమనించి ఉంటారు. ఇదంతా జంతు విజ్ఞానానికి దారితీసి ఉంటుంది. ఇప్పటికీ గిరిజన సమాజాలలో ఉండే జంతు నృత్యాలు, మన పూర్వీకులకు జంతువులతో ఏర్పడిన సంబంధాలకు ఒక గుర్తు.
మొదటి ఉత్పత్తి శక్తి.. భాష..
ఆదిమ మానవుల మధ్య ఒక సాన్నిహిత్యం ఏర్పడటానికి, వారు శక్తివంతంగా పురోగమించడానికి ఇంకొక ముఖ్య కారణం ఏమిటి? అంటే భాష ఏర్పడటం అంటాడు బెర్నాల్. భాష ఏర్పడే క్రమాన్ని కూడా వివరిస్తాడు. భాష దానికదే ఒక ఉత్పత్తి శక్తి. బహుశా, మానవ గమనంలో మొదటి ఉత్పత్తి శక్తి. చేతులతోనూ కర్రలతోనూ రాళ్లతోనూ వేటాడే క్రమంలో మానవుల మధ్య కొన్ని సంకేతాలు, సమన్వయం, వ్యక్తీకరణలు అవసరమవుతాయి. అయితే అవి అప్రయత్నంగానే జరిగి ఉండాలి. బహుశా తొలి భాషా సంజ్ఞ ఆహారం గురించి మనుషుల చలనాల గురించి పనిముట్ల వాడకం తయారీ గురించి ఉండి ఉండొచ్చు. మెదడులో వచ్చే మార్పులు, స్వర పేటికలో వస్తున్న మార్పులు, ఆదిమ మానవుడి జీవన పరిస్థితులు-వీటి మధ్య పరస్పర చర్యల పరిణామ క్రమంలో తొలి భాష ఏర్పడి ఉంటుంది. కంటికి చేయికి మధ్య సమన్వయం అవసరమై ఉంటుంది. ఆ తరువాత చెవికి నాలుకకు సమన్వయం ఏర్పడి ఉంటుంది. ఈ క్రమంలో, మానవుడి మెదడు పరిణామం చెందింది. అన్ని క్షీరదాలూ, ఒకదానితో ఒకటి వ్యక్తీకరించుకోవడానికి శబ్దాలను వాడుతాయి. అయితే ఈ శబ్దాలు భావోద్వేగాల- సెక్స్, కోపం, భయం- వ్యక్తీకరణగా ఉంటాయి. అంటే పరిసరాల గురించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడాలు ప్రారంభం కాక ముందే, మనుషులలో కూడా భావోద్వేగాల కోసం, ఏదో ఒక భాష లాంటిది ఉండి ఉంటుంది. భాష కుండే ఈ భావోద్వేగ సంబంధమే, ఇప్పటికీ పాటలో, సంగీతంలో, సాహిత్యంలో కనిపిస్తుంది. మాటలను మంత్రాలుగా విశ్వసించడానికి, ఇదొక కారణమై ఉంటుంది. కానీ భాష అభివృద్ధి చెందడం అనేది, రోజువారి అవసరాలతో ముడిపడి ఉంది. ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో, సంస్కృతీ ప్రత్యేకతలలో భాగంగా భాష రూపుదిద్దు కొన్నది. ప్రతి సమాజం తన భౌతిక సామాజిక జీవితాలకు అవసరమైన పదాలను వెతుక్కున్నాయి. శబ్దాలకుండే అర్థాలపై తమ మధ్య ఒక సమ్మతిని సాధించాయి. ఆ సమ్మతిని ఒక సాంప్రదాయంగా నెలకొల్ప గలిగాయి. అందుకే భాషలో సార్వత్రిక లక్షణాలు ఉన్నా, చాలా వైవిధ్యపూరితంగా కూడా ఉంటుంది.
ఆదిమ సమాజాల, వ్యక్తికరణ అవసరాలను భాష తీరుస్తుందా?
ఒక సందర్భాన్ని వివరించాలంటే శబ్దాలు చాలకపోవచ్చు. సందర్భాలు సంక్లిష్టంగా ఉంటాయి. ఆ సంక్లిష్టతను పదాలు పట్టుకోలేకపోవచ్చు. ఒక పదం అనేక అంశాల సాధారణీకరణగా, క్లుప్త వ్యక్తీకరణగా ఉంటుంది. ఒక విషయం మెదడులో దృశ్యకరణ జరిగి, దానికి ఒక శబ్ద సంకేతం ఏర్పడుతుంది. ఒక విధంగా, సైన్స్ సూత్రాలు సిద్ధాంతాలు కూడా భాషా కల్పనలో, విస్తరణలో ఒక సహజసిద్ధమైన భాగమే అంటాడు బెర్నాల్. పదాలలో వ్యక్తీకరించేదంతా, సరైన విజ్ఞానాన్ని ప్రతిఫలించకపోవచ్చు కూడా. అంటే తప్పు వ్యక్తీకరణలు కూడా ఉండొచ్చు. పదాలకున్న ఉద్వేగ స్వభావం ఎక్కువ చేసి చూపితే అది మార్మికతకు దారి తీసే అవకాశం ఉంది. అవే పదాలు భౌతిక జీవితానికి సంకేతాలుగా మారిస్తే, ఒక తార్కికతను ఆవిష్కరిస్తాయి. మనిషి సాధించిన రాతి పనిముట్లతో పోల్చుకుంటే, భాషలో ఒక విధమైన శాశ్వతత్వం దాగి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషల తొలిరూపాలేవో, రాతియుగపు గణాలు మాట్లాడే ఉంటాయి. అందుకే భాష అనేది ఒక సజీవ చారిత్రిక శకలం(రెలిక్) అంటాడు బెర్నాల్. ఒక భౌతిక సంస్కృతిని అధ్యయనం చేయడానికి, అప్పటి అవశేషాలను ఏ విధంగా అధ్యయనం చేస్తామో, అట్లే ఇప్పటి భాషను కూడా అధ్యయనం చేయాలని అంటాడు బెర్నాల్.
అన్నీ పెన వేసుకుని నడిచిన కాలం..
ఇదంతా మానవ పరిణామం, విజ్ఞానం, సంస్కృతి అన్ని ఒకదానితో ఒకటి పెరవేసుకొని నడచిన ఆదిమ కాల చరిత్ర. కానీ ఒక యాభై వేల సంవత్సరాలనాడు, ఆదిమ సమాజాలలో మార్పులు చాలా వేగంగా వచ్చాయి. ఈనాటి మానవ ప్రవర్తనకు, మూలాలు అక్కడే ఉన్నాయని అంటారు.
12-14 వేల సంవత్సరాల నాడు వచ్చిన మార్పులు, ఒక పెద్దవిప్లవానికి దారితీసాయి.
అవేంటో, తరువాత చూద్దాము…