అహింసాత్మక, రాడికల్,
ప్రత్యమ్నాయ సైన్స్ వాది – గాంధీజీ
డా. నాగసూరి వేణుగోపాల్
9440732392
ప్రముఖ సైన్స్ కాలమిస్ట్ &
ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు
“విజ్ఞాన శాస్త్రపరంగా సాధించిన గణనీయమైన అభివృద్ధి అనేది సమాజంలోని విద్వేషాలను, అన్యాయాలను తగ్గించలేకపోయింది. యూరోప్ ఖండపు నైతిక స్థాయి ఒక అంగుళం కూడా పెరగలేకపోయింది.” అనే మాట మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన అభిప్రాయం! ఇంతకూ ఈ అభిప్రాయం చెప్పిన వారెవరు? ‘ మ్యాన్స్ ప్లేస్ ఇన్ ది యూనివర్స్’ అనే పుస్తకాన్ని 1904 లో వెలువరించిన జీవశాస్త్రవేత్త, యాంత్రోపాలజిస్ట్, చిత్రకారుడు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ (Alfred Russel Wallace) ఈ మాటలు చెప్పారు. గాంధీజీ విజ్ఞాన శాస్త్రాలు సర్వ మానవాళి సమగ్ర అభివృద్ధికి దోహదపడాలనీ అలాగే పాదార్థిక వస్తు సముదాయమే పరమావధి కాదని; మానవాళి సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా గడించే పురోభివృద్ధియే అసలు కీలకమని పరిగణించేవారు!
గాంధీజీ చాలా సీదా సాదా భారతీయ గ్రామీణుడి లాగా దుస్తులు ధరించేవారు, పటాటోపం ఏమాత్రం లేకుండా జీవనం గడిపేవారు. ఆయన చెప్పే విషయాలు కూడా అత్యంత సరళంగా ఉండేవి. కనుక గాంధీజీకి సైన్సు ఏమాత్రం తెలియదని భావించే అవకాశం ఉంది. అంతకు మించి సైన్స్ గురించి ఆయన చెప్పిన విషయాలను దాదాపు పెడచెవిన పెట్టడమే జరిగింది కానీ, కనీసం వివరించే ప్రయత్నాన్ని ఆయన సహచరులు, శిష్యులు కూడా పెద్దగా చేయలేకపోయారు. ఇది ఎలా జరిగిందో ఈ ధారావాహిక వ్యాసాలలో ముందు ముందు తెలుసుకుని విశ్లేషించుకుందాం. ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను ఎన్నోసార్లు చాలా విస్పష్టంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనసు నిర్మలంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందనీ, అలాగే రక్తపోటు అధికంగా ఉందంటే మనసుపై అవసరమైన నియంత్రణ లేదని అర్థం చేసుకోవాలని గాంధీజీ భావిస్తారు. గమనించి, నేర్చుకొని చెప్పినవి కొన్నయితే; తెలుసుకొని చెప్పిన మరికొన్ని.
1925 సంవత్సరంలో గాంధీజీ ఓ విషయాన్ని రాశారు. లావెట్రీ అనేది డ్రాయింగ్ రూమ్ కన్నా శుభ్రంగా ఉండాలని 35 ఏళ్ల క్రితం గమనించానని చెబుతూ; ఆ విషయాలను పాశ్చాత్య దేశాల్లో తెలుసుకున్నానని, ఇక్కడి దేశాలకన్నా పాశ్చాత్య దేశాలలోనే ఈ శుభ్రత సంబంధించిన పట్టింపు బాగా ఉందని విశ్లేషించారు. మనదేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా విసర్జించడమనే అలవాటు ఎన్నో రోగాలకు మూల కారణమని కూడా పేర్కొన్నారు. ఈ విషయం చాలా ప్రాథమికమైనదని మనకు ఇప్పుడు అనిపించవచ్చు ; కానీ 1890 ప్రాంతంలో ఆయన గమనించిన విషయాన్ని మనం నేటికీ సాధించలేక, ఇప్పుడు స్వచ్ఛభారత్ మిషన్ అంటూ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు పదేళ్లుగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి, పోలికను ఆయన లావెట్రీ , డ్రాయింగ్ రూమ్ మధ్య తేవడం చాలా కటువైనదనే చెప్పాలి. కానీ అలా చెబితే తప్పా స్పృహ కలుగదని గాంధీజీ భావమై ఉండాలి. ఎందుకంటే పారిశుద్ధ్యం గురించి ఆయన 1916 ఫిబ్రవరి 4వ తేదీన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సందర్భంలో చేసిన ప్రఖ్యాత ప్రసంగంలో పేర్కొన్న నాలుగు అంశాల్లో ఇది కూడా ఒకటి!
ఇక నుంచి ప్రతి నెల ‘జనవిజ్ఞానం’ మాసపత్రికలో మీరు ఈ ‘బాపూజీ సైన్స్ బాట’ ధారావాహికలో గాంధీజీ సంబంధించిన సైన్సు దృక్కోణపు విశ్లేషణలు చదువబోతున్నారు. చిరునవ్వులు చిందిస్తున్నట్టు, కర్రతో వడివడిగా నడుస్తున్నట్టు, ధ్యానం చేస్తున్నట్టు, పిల్లల్ని ముద్దాడుతున్నట్టు.. మొదలైన గాంధీజీ ఫోటోలు చిరపరిచితం. అయితే ఒక ఫోటో తెలుగు నాట పెద్దగా ప్రచారంలో లేదు. కింద కూర్చుని, పుస్తకాలు కావలసిన ఎత్తుకు అమర్చుకుని, దానిపైన ఉంచిన మైక్రోస్కోప్ లో తదేకంగా చూస్తున్న గాంధీ తాత ఈ ఫోటోలో మనకు కనబడతారు.

అది 1940 సంవత్సరంలో సేవాగ్రామ్ ఆశ్రమంలో కుష్టు వ్యాధి సూక్ష్మక్రిములను గాంధీజీ దీక్షగా పరిశీలిస్తున్న సందర్భం. ఇక్కడ మనం గమనించాల్సిందే మిటంటే ఆయన వయసు ఒక విషయం కాగా; రెండవది ఆయన కూర్చున్న తీరు. అప్పటికి ఆయన వయస్సు 70 దాటింది కానీ, ఆ వయసులో కూడా అంత పట్టుదలగా నేల మీద కూర్చుని, ఆయన విద్యార్థుల కన్నా మించిన శ్రద్ధతో పరిశీలిస్తున్నారు. అది ఆయనకు పరిశీలన పట్ల, ప్రయోగం పట్ల వెరసి సైన్స్ పట్ల ఉన్న నిరంతర దృష్టిని మనకు వివరిస్తుంది.
గాంధీజీ ప్రేమ కేవలం మైక్రోస్కోప్ కు మాత్రమే పరిమితం కాలేదు. 60 ఏళ్లు వయసు పైబడిన తర్వాత ఖగోళ శాస్త్రం గురించి తొలిసారి గాంధీజీ నేర్చుకున్నారు అని తెలుసుకున్నప్పుడు, మనకు తప్పక ఆశ్చర్యం కలుగుతుంది. పూనా దగ్గరున్న ఎర్రవాడ జైల్లో అరెస్టై బందీగా ఉన్నప్పుడు తోటి ఖైదీ సాయంతో ఖగోళ విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడమే కాకుండా జైలు అధికారుల అనుమతితో బొంబాయిలో ఉండే ఒక మిత్రుడు సాయంతో రెండు పెద్ద టెలిస్కోపులు తెప్పించుకున్నారు. వాటిని జైల్లోనే ఏర్పాటు చేసుకుని ఆకాశాన్ని, ఖగోళ వస్తువులను ఆయన పరిశీలించేవారు. అంతే కాకుండా ఖగోళ శాస్త్రానికి సంబంధించి ‘మ్యాజిక్ ఆఫ్ ది స్టార్స్’, ‘గ్రీక్ ఆస్ట్రానమీ’, ‘హిందూ ఎస్ట్రానమీ’, ‘ ఏన్షియెంట్ సైన్స్ ఆఫ్ హిందుస్’, గెలీలియో జీవిత చరిత్ర వంటి పుస్తకాలను కూడా ఆధ్యయనం చేశారు.
1935లో చెక్ దేశస్తుడైన డాక్టర్ కెరెల్ హుజెర్ (1902-88) భారతదేశం వచ్చి, వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించిన పిమ్మట శాంతినికేతన్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ ను కలిశారు. అటు తర్వాత గాంధీజీ అతిథిగా రెండు వారాలపాటు సేవాగ్రామ్ ఆశ్రమంలో ఉండి; ఆయనకు, అతని మిత్రులకు ఆధునిక ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో తాత్విక విషయాలు బోధించారు. అంతకుమించి అదే సంవత్సరం ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీ వార్ధాలో సమావేశమైనప్పుడు గాంధీజీ సలహాపై ఆ శాస్త్రవేత్త రెండు ప్రసంగాలను కూడా చేశారు. ఈ విషయాన్ని గమనిస్తే గాంధీజీకి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తి తోపాటు తన మిత్రులకే కాకుండా, సాటి రాజకీయ నాయకులకు కూడా సైన్స్ నేర్పించాలని తపన ఉన్నట్టు మనకు బోధపడుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడు మన రాజకీయ నాయకులకూ అలాగే రాజకీయ సమావేశాలను ప్రణాళిక చేసే పెద్దలకు వివరించి చెప్పాలనిపిస్తుంది.
గాంధీజీకి యూక్లిడ్ శాస్త్రవేత్త అంటే బాల్యం నుంచి ఆకర్షణ కనుక పాఠశాల స్థాయిలో ఆనందంగా గణితం నేర్చుకున్నారు. కుట్టు మిషన్ రూపొందించిన ఐజాక్ మెరిట్ సింగర్ అనే శాస్త్రవేత్త అంటే కూడా చాలా అభిమానం. అలాగే రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ పట్ల వల్లమాలిన మక్కువ. 1901 డిసెంబర్ లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో గాంధీజీ తొలిసారి పాల్గొన్నారు. దానికి కారణం ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రఫుల్ల చంద్ర రే. ఆయన అతిథిగానే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి ఈ రాజకీయ సమావేశాల్లో పాలు పంచుకున్నారు. అలాగే జగదీశ్ చంద్రబోస్ అంటే మరెంతో అభిమానం. ఇంకా సి.వి.రామన్ అంటే కూడా ఎంతో ఇష్టం.
అరకొర అధ్యయనం కూడా లేకుండా, కేవలం ఏదో గాంధీజీ ఆకారం, దుస్తులు వగైరా చూసి నిర్ణయించు కున్న లేదా ఎవరో అలవోకగా చెప్పిన వాటిని దశాబ్దాల పాటు ప్రచారం చేస్తూ వచ్చారు. వీటి సంగతి కూడా ముందు ముందు పరిశీలిద్దాం. అయితే గాంధీజీ సైన్స్ దృష్టి పట్ల ఒక విలువైన, పదునైన, సుదీర్ఘ విశ్లేషణ 2001 సెప్టెంబర్ 29 (సంపుటి 36, సంచిక 39) ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ లో సి శంభు ప్రసాద్ అనే పరిశోధకుడు వెలువరించారు. నలభై పేజీల పాటు సాగే ఆ వ్యాసం శీర్షిక ఇది’Towards an understanding of Gandhi’s views on Science ‘ వీరి విశ్లేషణ ప్రకారం స్థూలంగా గాంధీజీ సైన్స్ దృష్టిని ఇలా చెప్పవచ్చు:
1. విజ్ఞాన శాస్త్రానికి, యాంత్రికరణకు గాంధీజీ వ్యతిరేకం కానే కాదు.
2. సైన్స్ పరంగా గాంధీజీ చెప్పిన చాలా విషయాలు ప్రయోగాలకు నోచుకోకపోయినా; అప్పటి (ఇప్పటికి కూడా) ప్రత్యామ్నాయ సైన్స్ విధానాలను ప్రతిపాదించారని గమనించాలి.
3. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఆభౌతికమైన వనరులపై దృష్టి పెట్టాలనడం చాలా కీలకమైన అంశం.
4. ‘సత్యాగ్రహి శాస్త్రవేత్త’ అనే గాంధీజీ భావన ఇప్పుడు మనకు తెలిసిన, ఇంతవరకు మనం పాటిస్తున్న సైన్స్ విధానాలకు పూర్తిగా విభిన్నమైనది.
5. మనిషి-ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం; అలాగే వాస్తవం – విలువ అనే వాటికి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా సార్వత్రికమైన, సృజనాత్మకమైన విషయాలను గాంధీజీ ప్రతిపాదించారు.
ఈ ఐదు అంశాలు కాస్త సంక్లిష్టంగా అనిపించినా వాటిని సులువుగా అర్థమయ్యేట్టు మనం ముందు ముందు సోదాహరణంగా చర్చించుకుందాం. అందులో సైన్స్ విషయాలతో పాటు చారిత్రాత్మక విశ్లేషణలు కూడా ఉంటాయి.
Very nice. Very useful science magazine.for both students and tearchers.