– రాహుల్జీ
హైదరాబాదు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ అడవిలో భారతదేశ రక్షణ అవసరాల కోసం ఒక లోఫ్రిక్వెన్సీ రాడార్ స్టేషన్ ని ఏర్పాటు చేస్తున్న విషయం చాలామందికి తెలిసే వుంటుంది. ఈ ప్రతిపాదన 2014 నుంచే వున్నా, ఈ మధ్య అన్ని రకాల అనుమతులతో ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నౌకాదళానికి భూమిని బదలాయించడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడంలో స్వతంత్ర జర్నలిస్టులది, సోషల్ మీడియాది ముఖ్యమైన పాత్ర.
ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 2900 ఎకరాలను కేటాయించింది. ఇది మొత్తం అటవీ ప్రాంతం. దీనిలో ఒక రాడార్ స్టేషన్, అధికారుల నివాస సముదాయాలు, వారికి అవసరమైన ఇతర సౌకర్యాలతో ఒక టౌన్షిప్ ఉంటాయి.

ఈ అడవిలో తొలగించిన చెట్ల స్థానంలో దాదాపు 12 లక్షల చెట్లను వేరే ప్రాంతంలో పెంచుతామని నౌకాదళం అంటోంది. అంటే ఇక్కడ 12 లక్షలు చెట్లను తొలగిస్తారని అనుకోవాలి. అటవీశాఖ ఈమధ్య ఇచ్చిన ఒక ప్రకటనలో కేవలం 48% భూమినే వాడుకుంటారని, దాదాపు రెండు లక్షల చెట్లే నాశనం అవుతాయని చెప్పింది. ఏది నిజమో తెలీదు. రెండులక్షలు చెట్లు కూడా చిన్న సంఖ్య ఏమీ కాదు. అందులోనూ వందల ఏళ్ళ చెట్లను నరికేసి మొక్కలు పెంచడం వల్ల వచ్చే ప్రయోజనం ఎప్పటికీ ఒకటి కాదు. అక్కడ ఉన్న ఔషధ మొక్కలు వృక్షజాతులు, వన్యప్రాణుల వివరాలను అధ్యయనం చేసిన దాఖలాలు అసలే లేవు. ఇక్కడ నాశనం అయ్యే ఔషధ మొక్కల్ని, వన్యప్రాణుల్ని ఇంకో దగ్గర పెంచడం అసాధ్యం. వీటన్నిటి నాశనం ద్వారా వచ్చే నష్టాన్ని ఎలా పూడ్చగలరు?
అలాగే ఈ వికారాబాద్ అడవులు మూసీ నదికి జన్మస్థలం. ఇన్ని లక్షల చెట్లున్న అడవి నాశనం అయ్యాక ఇక మూసీ నది బతుకుతుందా? దాని ప్రవాహానికి దోహదం చేసే చిన్న చిన్న సెలయేళ్లు అడవితో పాటే మాయం అయిపోతాయి. ఒకపక్క మూసీనది ప్రాణం తీస్తూ మరో పక్క సుందరీకరణ అంటే ప్రయోజనం ఏముంటుంది?
ఇంత దట్టమైన, ఒక నదికి జన్మస్థానం అయిన అడవిలోనే ఈ కేంద్రాన్ని పెట్టాలా? ఇంతకంటే అనువైన స్థలం దేశంలోనే లేదా? ఇప్పటికే ఇలాంటి ఒక రాడార్ కేంద్రం తమిళనాడులో ఉంది. ఇంకొకటి మళ్లీ దక్షిణ భారతదేశంలోనే పెట్టడం వ్యూహాత్మకంగా సరైనదేనా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఇక ఈ ప్రాజెక్టు కోసం గ్రామస్తులను ఒప్పించిన తీరుకూడా పారదర్శకంగా లేదు. దామగుండం చుట్టూ దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. 60 వేల జనాభా. ఈ గ్రామాల్లో వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, భూముల విలువ పెరుగుతుంది, ఊళ్లన్నీ వ్యాపార కూడళ్లు అవుతాయి అనే భ్రమలు కల్పించారు. అయితే ఇప్పుడిప్పుడే గ్రామస్తులు ఆ ప్రయోజనాల కంటే రేడియేషన్ వల్ల దీర్ఘకాలంలో జబ్బులు వస్తాయని నమ్ముతున్నారు.
నిజంగా ఇలాంటి రాడార్ కేంద్రం వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అవి ఆ గ్రామస్తులకే వస్తాయా? రాడార్ కేంద్రం అంటే అత్యున్నత సాంకేతిక తో కూడుకున్నది. దాంట్లో కొన్ని టెక్నికల్ ఉద్యోగాలు ఉంటాయి. అవి ఆ గ్రామస్తులకే ఇవ్వడం కుదరదు. కొన్ని సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలువస్తే రావచ్చు. అదైనా ఇన్ని ఉద్యోగాలు మీకు వస్తాయని నిర్దిష్ట సంఖ్య ఏమి ప్రభుత్వం చెప్పలేదు.
రాడార్ కేంద్రం వెలువరించే లో ఫ్రీక్వెన్సీ తరంగాలు వల్ల వచ్చే రేడియేషన్ ఎంత? దీనివల్ల జబ్బులు వస్తాయనే ప్రచారం కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంది. దీనిగురించి మరింత శాస్త్రీయ సమాచారం సేకరించాలి.

అభివృద్ధి, దేశ రక్షణ అవసరాలు ఎవరూ కాదనలేనివి. అవి దేశానికి అవసరం కూడా. కానీ పర్యావరణాన్ని నాశనం చేసే అభివృద్ధి అవసరం ఎంత? పర్యావరణానికి హాని చెయ్యని కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వున్నప్పుడు దాన్ని వాడుకోవాలి. జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేసే ఈ రకమైన రాడార్ కేంద్రాలు ప్రపంచంలో చాలా కొద్ది చోట్ల ఉన్నాయి. అమెరికా సాటిలైట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తోంది. మరి మన దేశం ఎందుకు ఇంకా రాడార్ వ్యవస్థ మీదఆధారపడుతోంది. దీనికి కూడా సమాధానం వెతకాల్సిఉంది. ప్రజల్లో ఉన్న ఈ సందేహాలు అన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నా దట్టమైన అడవి నాశనం అవడం, కనీసం రెండులక్షలు వృక్షాలు నాశనం అవ్వడం మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. భారతదేశంలో అడవులు కేవలం 21%. ప్రపంచ సగటు 31%. ఈ మిగిలిన అడవుల్ని కూడా నాశనం చేసుకుంటూ, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్ని ధ్వంసం చేస్తే ఏమవుతుందో ఇటీవలి వాయనాడ్ విలయం హెచ్చరిస్తూనేవుంది. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో అడవులు నాశనం చేయడాన్ని ఖండించాలి. అది నికోబార్ దీవుల్లో కావచ్చు. ఛత్తీస్ ఘడ్ లో కావచ్చు. వికారాబాద్ లో కావచ్చు.