సంపాదకీయం
గత పదేళ్లలో ఏకంగా దేశంలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఈ మూతల్లో మధ్యప్రదేశ్ (29 410), ఉత్తర ప్రదేశ్ (25,126) రాష్ట్రాలు 60.9% వాటాతో ముందున్నాయి. దీన్నీ మధ్య సాక్షాత్తు కేంద్ర విద్యా శాఖ ఉప మంత్రి జయంత్ చౌదరి గారు పార్లమెంటులో ప్రకటించారు.
మన తెలుగు రాష్ట్రాలు ఈ “రికార్డును” 2015 కు ముందే సాధించాయి! వీటిలో 9503 పాఠశాలలు అప్పటికే తలుపులు మూసేశాయి. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలు. ప్రాథమిక పాఠశాలలు. చిన్న చిన్న పాఠశాలలు. గత ఐదేళ్ల నుంచి మన రాష్ట్రంలో మూసివేతలకు తోడుగా విలీనాలు, స్థాయి తగ్గింపులు,తరగతుల తరలింపులు, క్రమబద్ధీకరణలు, క్లస్టరైజేషన్లు ఇలా పలు నామధేయాల చర్యలతో ఊరిబడి సతమతమవుతోంది. ఎప్పుడు ఏ బడి ఏ రూపంలో వుంటుందో తెలీక వ్యవస్థ మొత్తం కకావికలైపోతోంది. లక్షల మంది పిల్లల్ని బలవంతంగా ఒక బడి నుంచి మరో బడికి తరలించడం ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా చూడనిది. ఈ పోడు పడలేక గత ఒక్క సంవత్సరంలోనే 2.63 లక్షల మంది పిల్లలు చరిత్రలో ఎప్పుడూ లేనట్టు ప్రైవేటు బాట పట్టారు.
ఇప్పుడు మళ్లీ పాఠశాలలు తెరుస్తున్నారు. గత ప్రభుత్వం ఆరు రకాలుగా బడుల్ని విడగొడితే ఇప్పటి సర్కారు తొమ్మిది రకాల పాఠశాలల్ని తెస్తోంది. తలచుకుంటే భయమేస్తోంది. ఎందరు పిల్లలు జారుకుంటారో, ఎన్ని బడులు అదృశ్యమవుతాయోనని !
విద్యారంగం మీద ఏ చర్చ జరిగినా ఇప్పుడు చిన్న స్కూళ్ళు వచ్చి ముందు నిలబడుతున్నాయి. వీటిని నానా శాపనార్ధాలు పెడుతున్నారు. వీటిలో చదువు రాదనీ, ఒక్కో బిడ్డకు వ్యయం 40,000 అవుతుందనీ, పేదలు వీటిలో ఎందుకు చేరాలనీ ఎద్దేవా చేస్తున్నారు.
నీతి ఆయోగ్ “మూడేళ్ల అజెండా” ఈ చిన్న స్కూళ్లపై రాష్ట్రాలు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలనింది. ‘నూతన విద్యా విధానం’ ఇంకొంచెం ముందుకెళ్లి వీటిలో సగటున 14 మందికి మించి పిల్లలు లేరనీ, వీటన్నింటికీ వసతులు కల్పించడం కష్టమనీ, వీటి నిర్వహణ భారమనీ, వీటి ఒంటరితనం పిల్లల మీద, టీచర్ల మీద, చదువుల మీద ప్రతికూల ప్రభావం చూపుతోందననీ చాంతాడంత దండకం చదివి, “ఈ సమస్యను 2025 నాటికి రాష్ట్రాలు అధిగమించాల్సి వుంది, దీనికి పలుమార్గాల్ని అన్వేషించించాల్సి వుంది” అని ముక్తాయించింది. ఉమ్మడి ఉపాధ్యాయుల నియామకం, స్థానిక సమాజాలకు అప్పగించడం, విలీనం చెయ్యడం లాంటి పరిష్కారాల్ని సూచించింది. వీటి మరణశాసనం రాష్ట్రాలే రాయాలని చెప్పకనే చెప్పింది!
చరిత్రలోకి వెళితే ఈ చిన్న స్కూళ్ళను తెచ్చిందే ప్రపంచ బ్యాంకు ! అదే మొదట భారతీయ పాఠశాల విద్యా రంగంపై 1980 నుంచి పుంఖాను పుంఖాలుగా సర్వేలు, అధ్యయనాలు చేసి, ప్రస్తుత విద్యా వ్యవస్థ పేద, మారుమూల పిల్లలందరికీ అత్యవసరంగా చదువు నేర్పడానికే మాత్రం సరిపోదంటూ పలు రకాల పరిష్కారాలను ముందుకు తెచ్చింది. వీటి కోసం ప్రాజెక్టులను తెచ్చి నిధులిచ్చింది ఒక్క సంవత్సరం చదువుతో 13% కార్మికుల ఉత్పాదకత పెరుగుతుందని లెక్కలేసి ఊరించింది. భారత ప్రభుత్వం ఇప్పటికే తాత్సారం చేసిందనీ, అర్జంటుగా మేల్కొనాలని హెచ్చరించింది. ఇంతకూ ప్రపంచ బ్యాంకుకు కావలసింది పేద పిల్లలు అక్షరాస్యులు కావడం తప్ప విద్యావంతులు గావడం కాదు. దీనికి చిన్న స్కూళ్లు చాలు.
ఒకసారి జనానికి చదువు రుచి తెలిస్తే వారే మంచి స్కూలు వెతుక్కుంటారనీ, ఆ రుచి చూపడమే ప్రభుత్వ కర్తవ్యమనీ కూడా ప్రపంచ బ్యాంకు ప్రవచించింది. దీనికనుగుణంగా “ఆపరేషన్ బ్లాక్ బోర్డు”, “డిపి ఇ పి” లాంటి ప్రాజెక్టుల్ని రాష్ట్రాల నెత్తి మీదకెత్తింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రజలే నడుపుకొనే అనియత కేంద్రాల్లాంటి వేలాది పాఠశాలలు వెలిశాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ బ్యాంకులు నేరుగా జోక్యం చేసుకొనే “ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు” దేశంలోనే ముందుగా మన రాష్ట్రం శ్రీకారం చుట్టి ఈ పోటీలో ముందు నిలబడింది. దీంతో కాలనీలన్నిటా ఇబ్బడిముబ్బడిగా స్కూళ్లు వెలిశాయి. అన్నీ ఒక గది, ఒక వరండా, ఒకటి టీచరు వుండే ప్రాణం లేని స్కూళ్లు. అక్షరం రుచి చూపడానికి మించి అక్కరకు రాని స్కూళ్ళు! ‘అందుబాటులో బడి’ అనేంతవరకివి సరిపోవచ్చు. మొదటి తరం గిరిజనుల్నీ, దళితుల్నీ బడికి రప్పించేందుకూ పనికొచ్చి వుండొచ్చు. ‘ఆ బడి ఎలాంటి బడి?, అందులో ఏం చదువొస్తుంది’ అంటే మాత్రం జవాబు లేదు. దీంతో పాటు ఊరిలోని పెద్ద బడి కూడా వున్న పిల్లలు చెల్లాచెదురై కాలనీ బడుల సరసన చేరింది! ఇప్పుడన్నీ చిన్నబడులే అయ్యాయి ! ఈ ప్రమాదాన్ని ‘నీపా’ ( NUPEPA) లాంటి సంస్థలు పసిగట్టి, ఎంత చెప్పినా ప్రాజెక్టుల యావలో పడి ప్రభుత్వాలేమీ పట్టించుకోలేదు.
ఇప్పుడు మన రాష్ట్రంలో 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే వాటిలో 5495 పదిలోపు పిల్లలవి! ఇక 20 లోపు పిల్లలవి 14,750 ప్రాథమిక పాఠశాలలు! గత సంవత్సరం ప్రైవేటు బాట పట్టిన పిల్లలు 2.63 లక్షల మంది! వీరిలో 1.8 లక్షల మంది ఈ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వారే. ఇక ఐదో తరగతి పిల్లలకు మూడో తరగతి వాచకం చదవడం రాదని ‘అసర్’, ఐదేళ్లు బడికెళ్లినా 50 శాతానికి పఠన సంఖ్యాజ్ఞానాలు లేవని ‘ప్రపంచ బ్యాంకు’, సమస్యంతా పసలేని వానాకాలపు చదువులలోనే వుందని ‘అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్’ లాంటివి నిగ్గు తేల్చడం మొదలెట్టడంతో ఈ చిన్న స్కూళ్ల మీద నమ్మకం మరీ కునారిల్లసాగింది.
ఒకవైపు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రుల ఆకాంక్షలు ఎప్పుడూ ఎరగనంత పెరిగి, పేద వర్గాలు సైతం మంచి చదువుల కోసం వెతుకులాట మొదలెట్టడంతో, మరోవైపు ప్రైవేటు పాఠశాలల విస్ఫోటనంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ దుస్థితినేమాత్రం అధ్యయనం చెయ్యకుండా గత ప్రభుత్వం అంగన్వాడీల్ని, ఒకటి రెండు తరగతుల్నీ కలిపి కొత్తగా ఫౌండేషన్ స్కూళ్ల వ్యవస్థను తీసుకొవచ్చింది. ప్రాథమిక పాఠశాలల్ని ముక్కలు చేయడం సరిగాదని రోహిత్ ధన్ కర్, కృష్ణకుమార్ లాంటి విద్యావేత్తలెందరు చెప్పినా, ఉపాధ్యాయ సంఘాలు ఎంత మొత్తుకున్నా వినలేదు. ఈ పునాది పాఠశాలలు మరీ చిన్నవై మూతకు సిద్ధమయ్యాయి. పిల్లలు వెళ్ళి పొయారు. ప్రస్తుత ప్రభుత్వానిదీ ఇదే బాట. ఈ విద్యాసంవత్సరం నుంచి రాబోతున్న 5000 ఫౌండేషన్ స్కూళ్లు, 19,000 బేసిక్ స్కూళ్ళదీ ఇదే దారి కావడం ఖాయం!
కాలక్రమంలో ఇవన్నీ మూతబడతాయనీ, కొత్తగా తెరమీదికొస్తున్న 9200 ఆదర్శ పాఠశాలే మిగులుతాయనీ ప్రభుత్వం దృఢంగా నమ్ముతున్నట్టుంది. వీటినైనా ఆధునికావసరాలకు తగ్గట్టు మార్చడానికీ, నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం ఎంత సిద్ధంగా వుందో తెలియదు. ఒకటి మాత్రం నిజం. మన రాష్ట్రం నూతన విద్యా విధానాన్ని ‘సాహసోపేతంగా’ అమలు చేయబోతోంది!
విచిత్రం ఏమంటే ‘మేము ఒక్క బడీ మూసెయ్యం’ అంటోంది ప్రభుత్వం. పిల్లలు లేక వాటికవే మూతబడతాయనీ, ఇప్పటికే అలాంటివి 500 దాటాయనీ దానికి తెలుసు. ఇదంతా అమాయకంగానో, అవగాహనా రాహిత్యంతోనో జరగడం లేదు. దీని వెనుక SALT ఒప్పందం వుంది. దాని Cost Effective Approaches వున్నాయి !
ఇలా ప్రపంచ బ్యాంకును నమ్ముకోకుండా తనకంటూ బలమైన సొంత పాఠశాల విద్యా వ్యవస్థను నిర్మించుకొని, కాలానుగుణంగా దాన్ని ఆధునీకరించుకున్న కేరళ లాంటి రాష్ట్రాలకు ఈ కష్టాలు రాలేదు. ప్రపంచ బ్యాంకు జోలికి పోకుండా జాగ్రత్త పడ్డ పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు కూడా ఈ సమస్య తలెత్తలేదు. దూరదృష్టి గల హిమాచల్ ప్రదేశ్ లోనూ ఈ దుస్థితి రాలేదు. అక్షర జ్ఞానం చాలనుకొని, ప్రాజెక్టుల మీద యావతో అరకొర బడులు పెట్టి మొత్తం వ్యవస్థనే కునారిల్ల జేసి, వేల పాఠశాలల్ని మూసేసుకోవల్సిన దుర్గతి ప్రపంచ బ్యాంకును నమ్ముకున్న వారికే దాపురించింది . మొత్తం విద్యారంగాన్ని తీవ్ర సంక్షోభం ముంగిట్లోకి నెట్టింది.
రాబోయే ఐదేళ్లలో ఇది మరింత తీవ్రం కానుంది. అన్ని స్కూళ్లు చిన్న స్కూళ్ళే అవుతాయి. అన్నీ మూతకు సిద్ధమవుతాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నామమాత్రంగా మిగులుతాయి.
ఈ ఆపద్ధర్మ విధానాల్ని, అంతర్జాతీయ సంస్థల జోక్యాన్ని ఎండగట్టి, బలమైన ఆధునిక పాఠశాలల కోసం,
సొంత విద్యావిధానం కోసం పోరాడకపోతే మన కళ్ళ ముందే ప్రభుత్వ విద్య పాతాళంలోకి జారిపోతుంది.
కార్పొరేట్ల వికృత విద్యా మాయా జాలంలో మన పిల్లలు చిక్కుకుపోతారు.