యుగంధర్
అది ఊరి బయట ఒక ఇంటిలో ఓ గది. గది గోడల నిండా రకరకాల దేవతల భయంకర రూపంలో ఫోటోలు. గది అంతా దీపపు కాంతితో వెలిగిపోతోంది. అక్కడక్కడ సాంబ్రాణి పొగ లుంగ చుట్టుకుని మెల్లగా వెలువడుతోంది. గది మధ్యలో పెద్ద ముగ్గు. ఆ ముగ్గులో అక్కడక్కడ పూలు, పసుపు కుంకుమలు, పెద్ద పెద్ద నిమ్మకాయలతో అలంకరించబడి ఉంది. ముగ్గు మధ్యలో పిండితో చేయబడి, వికృతంగా కాళ్లు, చేతులు చాపుకుని వెల్లికిలా పడుకుని ఉన్న ఓ బొమ్మ ఉంది. ముగ్గు ముందు తలపై జడలతో, నుదుటి కుంకుమతో మెడలో పూలమాలతో ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఏదో మంత్రాలు చెబుతూ గుగ్గిలాన్ని నిప్పులపై చల్లుతూ.. చేతిలో ఓ సూది తీసుకొని ఆ బొమ్మ కాలుపై గుచ్చాడు. అంతే… అక్కడెక్కడో ఇంకో ఊరిలో దూరంగా ఉన్న వ్యక్తి కాలు నొప్పితో విలవిలాడిపోయాడు.
ఇక్కడ ఈ బొమ్మకు చేతిపై గుచ్చితే అక్కడ ఆ వ్యక్తి చేయి నొప్పితో విలవిల్లాడాడు. చివరికి బొమ్మ తల పక్కకు విరిస్తే అక్కడ ఆ వ్యక్తి చచ్చిపోతాడు.
ఇది ఓ తెలుగు సినిమాలో దృశ్యం. ఒక్క తెలుగు సినిమానే కాదు.. అటు బాలీవుడ్, హాలీవుడ్ అన్ని సినిమాల్లోనూ ఇలాంటి సన్నివేశాలు మీరు చూసే ఉంటారు. కాకపోతే దేవతల బదులు జీసస్ ఫోటోలు ఉంటాయి లేకుంటే నక్షత్రాల, దర్గాల ఫోటోలు ఉంటాయి.
ఈ ప్రక్రియను చేతబడి అంటారని ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. చేతబడి, బాణామతి, చిల్లంగి, వశీకరణ, క్షుద్రపూజ రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాలలో ఇవి చెల్లుబాటు అవుతున్నాయి. వీటిని నిజమని నమ్మే జనాలు చాలామంది ఉన్నారు.
కర్ణాటకలోని దావణగిరి జిల్లాలోని ఓ గ్రామంలో ఒక మహిళను వశీకరణం (చేతబడి) చేయడానికి వెళ్లిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకొని చితకబాదారు. గాయాలు పాలైన వీరిద్దరినీ పోలీసులు చికిత్స చేసి విచారించారు. ఆ మహిళను వశీకరణం చేయడానికి 70 వేల రూపాయలకు వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. ఓ సంచిలో పసుపు, కుంకుమ నిమ్మకాయలు, వెంట్రుకలు, ఇనుప కడ్డీలు మొదలగు చేతబడి చేయడానికి (చేయగలరని భావించే) ఉపయోగించే సామాగ్రి వీరి దగ్గర దొరికాయి.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చెప్పుడు మాటలు విన్న భర్త, తన భార్య చేతబడి చేస్తోందనే భయంతో, మంత్రాలు చదువుతోందనే నెపంతో కటింగ్ ప్లేయర్ తో ఆమె పళ్ళు ఊడ లాగడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఆమె సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి… అతనిని జైలుకీ పంపారు.
బొంబాయి నగరంలో కార్పొరేట్ వైద్యానికి బ్రాండ్ పేరు ఉన్న లీలావతి హాస్పిటల్లో చేతబడి (బాణామతి) జరిగిందని, క్షుద్ర పూజలు జరిగిందని ఆనవాళ్లు, ఆధారాలతో కోర్టును ఆశ్రయించారు ఆస్పత్రి ట్రస్ట్ వారు. ట్రస్ట్ ఆఫీసులో చేతబడి చేశారని పుర్రెలు, ఎముకలు నిండి ఉన్న ఎనిమిది కలశాలతో సహా క్షుద్ర పూజకు సంబంధించిన వస్తువులను గుర్తించి పోలీసులకు అప్పగించారు ట్రస్ట్ ప్రతినిధులు. బాంద్రా కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర “యాంటీ బ్లాక్ మ్యాజిక్” ఆక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక మన రాష్ట్రంలో మదనపల్లిలో జరిగిన జంట హత్యలు ఈ క్షుద్ర పూజలకు పరాకాష్ట. ప్రముఖ విద్యా సంస్థ నిర్వహిస్తున్న పద్మజ అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు అలేఖ్య, దివ్యసాయిలను త్రిశూలంతో పొడిచి, కొట్టి చంపిందని ఆరోపణ. అలేఖ్య భూపాల్ లోని సెంట్రల్ ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగము. దివ్యసాయి సంగీతం లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. నిందితురాలి భర్త పురుషోత్తమ నాయుడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్. ఈయన తన భార్యతో కలిసి ఇద్దరు పిల్లలను క్షుద్ర పూజలు పేరుతో చంపేశారు. “అదృశ్య ప్రకృతి శక్తులు తమను నడిపిస్తున్నాయని, తమ కూతుర్లను చంపమని వారు సూచించారని, వారు తిరిగి బ్రతుకుతారని… తమ పిల్లల్ని తిరిగి బ్రతికించడానికి 24 గంటల సమయం ఇవ్వాలని” అరెస్టు చేసిన సమయంలో ఉన్మాదస్థితిలో ఉన్న ఆమె పోలీసులను కోరారు.
ఈ అంశాలు అన్నింటినీ పరిశీలించినట్లయితే ఈ అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు స్థలం కానీ చదువు కానీ పరిమితి కాదని తెలుస్తోంది. ఓ పల్లె. …ఓ పట్టణం… ఓ నగరం…. ఓ మహానగరం, చదువుకున్నవారు… చదువురాని వారు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ఈ మూఢ నమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇదే కాకుండా మన రెండు రాష్ట్రాల్లో అనేక మందిని బాణామతి చేస్తున్నారని, చిల్లంగి చేతబడి చేస్తున్నారనే నెపంతో ముఖ్యంగా మహిళలను కొట్టడం, సజీవంగా కాల్చివేయడం, నాలుక కోసేయడం వంటి సంఘటనలు వార్తల్లో గమనించే ఉంటారు.
ఈ మధ్య తరచుగా ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను వశీకరణ పై పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు, ఆకర్షణీయమైన వార్తలు వస్తున్నాయి.
.”స్త్రీ, పురుషుల వశీకరణ మీ పేరు, ఫోటోతో 12 గంటల్లో వశీకరణ చేయబడును. అలా కాకపోతే మీ డబ్బులు వాపసు చేయబడును”.
.”ఇప్పటిదాకా అందరి దగ్గర మోసపోయి ఉంటారు. ఒకసారి మమ్మల్ని నమ్మి కాల్ చేయండి 12 గంటల్లో స్త్రీ, పురుష వశీకరణ చేయబడును గ్యారెంటీగా వశీకరణం చేస్తాము”.
.”24 గంటలలో మీరు కోరుకున్న వాళ్లు మీ వశమవుతారు. మాకు కాల్ చేయండి”. ఇలాంటి ప్రకటనలు జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయి.
సైన్స్ అభివృద్ధి చేసిన మాధ్యమాలను వాడుకొని ఫక్తు అశాస్త్రమైన భావాలను ప్రచారం చేస్తున్నారు ఈ వ్యాపార మోసగాళ్లు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, బలహీనులైన వారు, మహిళలు, దళితులు ముఖ్యంగా చదువుకున్న మూర్ఖులు వీటిని నమ్మి మోస పోతున్నారు. ప్రజల అజ్ఞానం, భయాలు,, మూఢనమ్మకాలు, మూర్ఖత్వం అనే పునాదులపై గట్టిగా నిర్మింపబడ్డ అద్భుత కల్పనల సౌధమే ఈ వశీకరణ పూజల తతంగం.
ఇంతవరకు ఎవరూ వశీకరణం చేయబడినట్లు గానీ, ఒకరిని ఇంకొకరు లొంగ తీసుకున్నట్లు గాని, చేతబడి వల్ల చంపబడడం గానీ జరగలేదు. ఈ మంత్రగాళ్లు తాత్కాలిక భ్రమలు కల్పించి అన్ని జరిగినట్లుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఇది నమ్మి వాళ్ళకి డబ్బు ఇచ్చి అవి చేయించుకున్న వాళ్ళు కొంతకాలానికి అవన్నీ అబద్ధాలని తెలుసుకొని మరింత కుంగిపోతారు.
కొంతమంది మంత్రగాళ్లు “మందు పెట్టడం” అనే ఒక ప్రక్రియ ద్వారా వశీకరణం చేస్తామని నమ్మిస్తారు. ఓ పల్లెలో మ్యాజిక్ చేస్తూ ‘మంత్రం లేదు, తంత్రం లేదు ఉన్నదంతా సైన్స్” అని చెబుతూ ఉంటే ఓ పెద్దావిడ లేచి ఇలా చెప్పింది. …. “మా బంధువు ఒకాయనకు వాళ్ళ అత్తగారు మందు పెట్టి (అన్నంలో కలిపి తినిపించి) మనసు మార్చేశారు. ఓ మంత్రగాడు మంత్రం వేసి ఆ మందు కక్కించాడు. ఇది ఆరు నెలల ముందు అత్తగారు తినిపించిన ముందు అని ఓ నల్లటి రాయి, తీసి అందరికి చూపాడు” అని చెప్పింది. నేను మనసులో నవ్వుకుని అసలు విషయం ఆమెకు వివరించాను.
ఏదైనా పదార్థం మనం తిన్న తర్వాత జీర్ణమై ఓ రెండు మూడు గంటల్లో బయటికి రావాల్సిందే. మన నోటి దగ్గర నుండి గుదము వరకు (అన్నవాహిక, కడుపు,చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు కలిసి) ఏకధాటిగా సాగే గొట్టము జీర్ణవ్యవస్థ (కంటిన్యూయస్ పైప్ ). అందులో మధ్యలో అరలు, గదులు లాంటివి లేవు. తిన్న ఆహారం మరుసటి రోజు వ్యర్థమై బయటికి రావాల్సిందే. అలాంటప్పుడు, ఎప్పుడో ఆరు నెలల కింద పెట్టిన (అని చెప్పిన) మందు కడుపులో ఏ మూలలో ఎక్కడ దాక్కొని ఉంటుంది? అలా ఉండడానికి అవకాశమే లేదు (మలబద్ధకం ఉంటే తప్ప కడుపులో ఏది ఆగదు!. అది కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే.!!) కాబట్టి మందు పెట్టడం మనసు మార్చడం అనేది అభూత కల్పనలు. ఆ మంత్రగాడు మందు కక్కించడం, అందులో నుంచి నల్ల రాయి చూడడం కనికట్టు మాత్రమే. “హస్త లాఘవం” అని మ్యాజిక్ లోని ఒక అంశం. (ఇదర్ కా మాల్ ఉదర్. ఉదర్ క మాల్ ఇదర్).
కొందరు ఇంకో వితండ వాదన కూడా చేస్తారు. సైన్సు అన్ని విషయాలను వివరించ లేదనీ, సైన్స్ కు అందని అంశాలు చాలా ఉన్నాయనీ వాదిస్తారు. అయస్కాంతం (సూదంటు రాయి) గురించి తెలియనప్పుడు, సైన్సు వివరించే పరిస్థితిలో లేనప్పుడు, పెద్ద రాయి ఇనుప గొడ్డలిని ఆకర్షిస్తే “ఏదో అతీత శక్తి గొడ్డలిని లాక్కుంటోంది అని భయపడ్డారు”. కానీ సైన్సు అయస్కాంతం కనుగొన్న తర్వాత అతీత శక్తి “అదృశ్యం” అయిపోయింది. కాబట్టి సైన్స్ అన్ని విషయాలు ఎప్పుడో రేపు ఆ తర్వాత్తర్వాత వివరిస్తుంది. సైన్స్ కు అందని, లొంగని విషయాలు ఉండదని నా భావన. కాకపోతే సమయం కావాలి. అది సంవత్సరాలు కావచ్చు దశాబ్దాలు కావచ్చు శతాబ్దాలు కావచ్చు. అంత మాత్రం చేత అభూత కల్పనలు, అబద్ధాలు నిజం అయిపోవుకదా. ఏదో ఒక రోజు సైన్స్ వివరిస్తుంది. కాబట్టి చెప్పొచ్చేదేమంటే ఈ చేతబడి, బాణామతి, చిల్లంగి, క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా అశాస్త్రీయ భావనలు, మూఢనమ్మకాలు మాత్రమే. అదేదో సినిమాలో బ్రహ్మానందం “సిగ్గా, గౌరవమా, భయమా?” అంటే గిరిబాబు “సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చే గౌరవం” అయి ఉంటుంది అంటారు. అలాగ ఈ మూఢనమ్మకాలకు కారణం అజ్ఞానమా, ఆందోళనా, భయమా? అంటే “అజ్ఞానంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన భయమే” కారణము.