అరవింద గుప్త
విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ కమల సొహొని. పేద పల్లెప్రజలు తినే ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతంగా జీవరసాయనిక పరిశోధనలు చేసి వాటి పోషక విలువలను ఆమె కనుగొన్నారు.

కమల 1912లో జన్మించారు. తండ్రి నారాయణరావ్ భగత్, మామయ్య మాధవరావ్ పేరుగాంచిన రసాయనిక శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని భారత విజ్ఞానశాస్త్ర సంస్థ నుంచి మొదట పట్టభద్రులైన వాళ్లల్లో వీరు కూడా ఉన్నారు. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి భౌతిక, రసాయనిక శాస్త్రాలతో కమల బి.ఎస్సి చేశారు. విశ్వవిద్యాలయంలో అగ్రస్థానంలో నిలిచినా ఆమెకు తరువాత పరిశోధనల కోసం బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ప్రవేశం తేలికగా లభించలేదు.
ప్రఖ్యాతిగాంచిన నోబెల్ గ్రహీత సర్. సి.వి.రామన్ భారత విజ్ఞాన శాస్త్ర సంస్థలో రామన్ (Raman Research Institute, ఆర్ఆర్ఐ) స్థాపనలో ప్రముఖ పాత్రవహించి, ఎన్నో పత్రికలకు నాంది పలికారు. అయితే ఆయన మహిళా విద్యార్థుల పట్ల విముఖతతో ఉండేవారు. అందువల్ల 1933లో విశ్వవిద్యాలయంలో అగ్రస్థానంలో నిలిచినా, రామన్ ఆమె దరఖాస్తుని బేఖాతరు చేశారు. కానీ కమల అంత తేలికగా తలొగ్గలేదు. రామన్ ను నేరుగా కలిసి, ఆయనను ఒప్పించారు. రామన్ ఆఫీసులో సత్యాగ్రహం చేశాక పురుషుల పనిని చెడగొట్టగూడదన్న షరతుతో, ప్రొబేషన్ మీద కమలను చేర్చుకున్నారు. కమల తీవ్రంగా మనస్తాపం చెందినప్పటికీ, అందుకు అంగీకరించక తప్పలేదు.
కమల తరవాత ఇలా వివరించారు, “రామన్ గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ, సంకుచిత స్వభావులు. కేవలం మహిళనన్న కారణంతో నన్ను కించపరిచేలా ప్రవర్తించారు. నన్ను క్రమమైన విద్యార్ధిగా చేర్చుకోలేదు. అది నాకు చాలా అవమానకరమైన విషయం. మహిళలపట్ల వివక్ష ఆరోజుల్లో తీవ్రంగా ఉండేది. ఒక నోబెల్ గ్రహీత కూడా ఈ విధంగా ప్రవర్తిస్తే, ఇంకా అనుకునేది ఏముంది?”
కమల చిత్తశుద్ధికి సంతుష్టులైన రామన్, సంవత్సరం తరవాత జీవరసాయనిక శాస్త్రంలో క్రమమైన పరిశోధనలు కావించేందుకు ఆమెకు అనుమతినిచ్చారు. అప్పటినుంచి సంస్థలో మహిళా విద్యార్థులకు ప్రవేశం లభించింది! ఇది కమలకు పేర్కొనదగ్గ విజయం. ఆమె కృషివల్ల శాస్త్రవేత్తలు కాదలచిన మహిళలకు మార్గం తేలికైంది.
ఐఐఎస్సి(IISc)లో తన గురువైనటువంటి శ్రీ శ్రీనివాసయ్య వద్ద కమల శ్రమించి పనిచేశారు. జీవరసాయనికశాస్త్రంలో గొప్ప వ్యక్తుల రచనలు చదవమని, వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరపమని శ్రీనివాసయ్య ప్రోత్సహించారు. పాలు, పప్పుధాన్యాలలోని మాంసకృత్తుల విలువలమీద ఆమె కృషి చేశారు. సరైన పోషకాహారం లభించని భారతదేశంలో ఇది ఎంతో కీలకమైన పని. 1936లో డిగ్రీ చదువుతుండగానే, పప్పుధాన్యాల మాంసకృత్తుల మీద కృషి జరిపిన మొదటి వ్యక్తి ఆమె. ఆమె పరిశోధనలు ముంబయి విశ్వవిద్యాలయానికి పంపి, ఎం.ఎస్సి పట్టా పొందారు. తరవాత ఆమె కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ డా॥ డెరిక్ రిచర్ ప్రయోగశాలలో పనిచేశారు. పగలు ఆమె పనిచేసే బల్లమీదే రాత్రి డెరిక్ విశ్రమించేవారు. డా॥ రిచర్ వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు, ఆమె మొక్కల కణజాలం మీద డా॥ రాబిన్ హిల్తో పనిచేశారు.
బంగాళాదుంపల మీద పరిశోధనలు జరుపుతున్నప్పుడు, ప్రతి కణంలోనూ‘సైటోక్రోం’ అనే ఎంజైమ్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ ఎనైజైమ్ మొక్క కణాల ఆక్సీకరణకు తోడ్పడుతుంది. మొత్తం వృక్ష జగత్తుకు సంబంధించిన ఈ విషయాన్ని ఆమె సొంతంగా కనుగొన్నారు.
రెండు స్కాలర్షిప్లు లభించడంతో, గొప్ప ప్రజ్ఞావంతులతో పనిచేయాలన్న ఆమె కల సఫలమైంది. మొదటిది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సర్ విలియం డాన్ జీవరసాయనిక సంస్థలో. దీనివల్ల నోబెల్ గ్రహీత ప్రొ. ఫ్రెడరిక్ హాప్కిన్స్ తో ఆమె జైవ ఆక్సీకరణ, రిడక్షన్ రంగాలలో కృషి చేశారు. రెండవది అయిన అమెరికన్ ట్రావెలింగ్ ఫెలోషిప్ వల్ల కమలకు యూరపులోని ప్రముఖ శాస్త్రవేత్తలను కలిసే అవకాశం లభించింది. పిహెచ్.డి కోసం మొక్కల కణజాలల శ్వాసక్రియలో “సైటోక్రోం సి”ని కనిపెట్టడం గురించి ఆమె థీసిస్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఆమె పిహెచ్.డి మొత్తం పరిశోధన, రచన కేవలం 14 నెలల్లో పూర్తయ్యింది. ఆమె థీసిస్ కేవలం 40 పేజీలు మాత్రమే! ఆమె విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి పొందిన మొదటి భారతీయ మహిళ!
1939లో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు. న్యూ ఢిల్లీలోని లేడీ హార్డింగ్ కళాశాలలో కొత్తగా ప్రారంభమైన జీవరసాయనిక విభాగానికి అధిపతిగా పనిచేశారు. తరవాత కూనూర్ లోని పోషకాహార పరిశోధనా ప్రయోగశాలలో సహాయక సంచాలకులుగా నియమితులయ్యారు. ఇక్కడ విటమిన్ల ప్రభావం మీద పరిశోధనలు జరిపారు. 1947లో వృత్తి రీత్యా జీవిత బీమాలో గణాంక శాస్త్రజ్ఞుడు అయినటువంటి శ్రీ. ఎమ్.వి. సొహోనీని వివాహమాడి ముంబయికి మారారు.

ముంబయిలో రాయల్ విజ్ఞాన శాస్త్ర సంస్థలో కొత్తగా ప్రారంభమైన జీవ రసాయనిక విభాగంలో చేరారు. ఉపయోగపడే పరిశోధనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించారు. ఆమె విద్యార్థుల్లో ఎంతో మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలుగా రాణించారు.పేద పల్లెవాసుల ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతమైన పరిశోధనలు జరిపారు. వాటి పోషక విలువలను నిర్ధారించారు. వీరి పరిశోధనలలో కొన్ని – పప్పుధాన్యాలలోని మాంసకృత్తులు, భారతీయ పప్పుధాన్యాలలో అరుగుదలను తగ్గించే ట్రిప్సిన్ నిరోధకాలు, ఇతర పదార్థాలు, నీరా, తాటి బెల్లం, తాటి మొలాసిస్, ధాన్యాన్ని మిల్లు పట్టించేటప్పుడు, పాలిష్ చేసేటప్పుడు ఏర్పడే నూక. పేద ప్రజల ఆహారంపై ఆమె పరిశోధనలు చేసినందువల్ల అవి భారత సమాజానికి ఎంతగానో ఉపయోగించాయి. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ సూచన ప్రకారం, ఆమె “నీరా” మీద మొట్టమొదటిసారిగా పరిశోధనలు జరిపారు.
తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించడానికి ‘ఆరె’ అనే పాల పరిశ్రమకు కమల సలహాలనిచ్చారు. నీరా కల్లు పామ్ జాతి పువ్వుల నుంచి ఉత్పత్తి అవుతుంది. అది తియ్యగా ఉండి, ఎంతో పోషకదాయకమైంది. “నీరా”ని ఉపయోగించడం వల్ల పోషక విలువలు సరిగా లభించని గిరిజనుల పెరిగే వయస్సు పిల్లల్లో, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. నీరా పోషక విలువలపై ఆమె జరిపిన కృషికి రాష్ట్రపతి పురస్కారం లభించింది.
భారతదేశ వినియోగదారుల మార్గదర్శక సంస్థ (Consumer Guidance Society of India, సిజిఎస్ఐ)లో ఆమె క్రియాశీలక సభ్యురాలు. అక్కడ ఆమె ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పని చేశారు. 1982-83లో ఆమె సిజిఎస్ఐకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఆ సంస్థ తరఫున ప్రచురించే“కీమత్” అనే పత్రికకు ఎన్నో వ్యాసాలు రాశారు.
తన పరిశోధనల పట్ల సంతృప్తి చెందినప్పటికీ, సంస్థలోని రాజకీయాలు, అసూయల పట్ల కమల వ్యాకుల చెందారు. ఎన్నో సంవత్సరాలు ఆమెకు డైరెక్టరు పదవి లభించలేదు. వృత్తిలో తన సాఫల్యానికి తండ్రి, శ్రీనివాసయ్య, భర్త కారణమని ఆమె చెబుతుండేవారు. చివరకు ఆమెకు డైరెక్టరు పదవి లభించినప్పుడు కేంబ్రిడ్జ్ లోని ఆమె మొదటి మార్గదర్శి డా॥ డెరిక్ రిచర్ ఇలా వ్యాఖ్యానించారు, “ఇంత పెద్ద శాస్త్రీయ సంస్థకు మొదటి మహిళా డైరెక్టరుగా ఆమె చరిత్ర సృష్టించారు.”
కమల సొహొని జీవితం భారతీయ మహిళా శాస్త్రవేత్తల పోరాటానికి దర్పణం. పురుషుల ఆధిపత్యమైన విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రవేశించటానికి కేవలం ప్రతిభ, కుటుంబ ఆలంబన సరిపోలేదు.
కమల సొహొని కృషి, పోరాటం గురించి తెలుసుకున్న భారత వైద్య పరిశోధనా కౌన్సిల్ (Indian Council of Medical Research, ఐసిఎంఆర్)కు మొదటి మహిళా డైరెక్టరు జనరల్ అయిన డా॥ సత్యవతి 84 సంవత్సరాల వయసు ఉన్న కమలను ఆహ్వానించి న్యూఢిల్లీలో ఘనంగా సత్కరించారు. 1998లో 86 ఏళ్ళ వయసులో కమల సొహొని మరణించారు.
మంచి పుస్తకం ప్రచురణ “వెలుగు రవ్వలు” పుస్తకం నుండి