డా.విరించి విరివింటి

సైన్సు అంటే మన చుట్టుపక్కల పరచుకొని వున్న చరాచర జగత్తుకి ఒక వివరణాత్మక నమూనా మాత్రమే. కానీ ప్రపంచం సైన్సుని అంతవరకే చూసిందనలేము. మనం 19 -20 శతాబ్దాల చరిత్రను చూస్తే మానవులు సైన్సుని చాలాసార్లు ఒక భావజాల ఆయుధంగా వాడుకున్నారన్న వాస్తవం బయటపడుతుంది. మనుషుల్లోని వైషమ్యం, అసమానత, యుద్ధపిపాస, సంకుచిత జాత్యాధిపత్యం వీటన్నిటికీ శాస్త్రపరమైన సమర్ధనల్ని సైన్సు అందించింది. అది మానవ కపాలాలను కొలిచే ‘క్రేనియోమెట్రీ’ కావచ్చు, వాలేస్ ఆంత్రో పాలిజికల్ లైన్ కావచ్చు, మరొకటి కావచ్చు.

అందువల్ల సైన్సును ఏ ఆపోహలకు తావివ్వకుండా, ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోడానికి నిరంతర అధ్యయనం, కృషీ జరుగుతూనే వుండాలి. లేకపోతే శాస్త్రప్రియులైన మనందరి ఆదర్శాలు ఆదర్శాలుగానే మిగిలిపోతాయి.

ఎంతటి శాస్త్రావిష్కరణలు, సిద్ధాంతాలు బయటకు వచ్చినా, దాన్ని జనం తమదైన పద్ధతిలో అరకొరగా అర్థం చేసుకోడం, విశ్లేషించుకోడం జరుగుతూనే వుంటుంది. శాస్త్రరంగంలోని మేధావుల్లోనూ ఇలాంటి విశ్లేషణలు మామూలైతే ఇక సామాన్యుల సంగతి ఏమిటి?

డార్వినిజం తెచ్చిన తాత్విక నష్టం
ఇలాంటి ఉదాహరణల్లో మొదటిగా చెప్పుకోవాల్సింది డార్విన్ సిద్ధాంతాన్ని గురించి! ఇది సరికొత్త నిరూపణలతో ఆ నాటి సమాజంలో ప్రకంపాలను పుట్టించిన మాట వాస్తవం. కానీ దాని తాత్వికను అర్థం చేసుకునే విషయంలో తప్పుడు మార్గాలు తొక్కి సమాజాన్ని కొందరు కోల్పోలేని దెబ్బతీసిన మాట కూడా అంతే వాస్తవం.

వీరిలో మొదట మాట్లాడుకోవలసిన వ్యక్తి హెర్బర్ట్ స్పెన్సర్. ఆయన డార్విన్ చెప్పిన ‘ప్రకృతి ఎంపిక, అనుసరణ’ ను (Natural Selection and Adaptation) సమాజానికి అన్వయించి ‘శక్తి వంతుడే మిగలడం’ (Survival of the Fittest) సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. దాంతో పాటు సైన్సుకు, శాస్త్రవేత్తలకు, సమాజానికి మాత్రమే గాక మొత్తం తాత్విక రంగానికి సైతం ఎంత నష్టం తేవాలో అంత నష్టం తెచ్చాడు.

పందొమ్మిదవ శతాబ్దంలో విజయవంతమైన శాస్త్ర సిద్ధాంతాలన్నీ ఏదో ఒక విధంగా అప్పటి మతాన్ని, శాస్త్రాలను, రాజకీయ తాత్వికతలను ప్రభావితం చేసిన మాట నిజం. డార్విన్ కు కూడా అందులో మినహాంపు లేదు. కానీ డార్వినిజాన్ని సమాజపరం చేసి, సామాజిక నియంతృత్వాలకు ఊతమిచ్చేలా చేసింది మాత్రం స్పెన్సర్, గాల్టన్లు మాత్రమే. ఇలాంటి ధోరణుల్ని లోతుగా తరచి చూడాల్సి వుంది. దీనికి ముందు నేను ఒక ఉదాహరణతో మొదలు పెడతాను..

సమాజపరిణామం సరళరేఖ లాంటిదా?
 ఇంతగా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా ఈ నాటికి కొందరు మనుషులు ఎందుకు మూఢనమ్మకాలు పట్టుకు వేలాడుతున్నారనీ, గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారనీ మనం తరచూ చర్చించుకొనే వాళ్లను చూస్తుంటాం. ముఖ్యంగా కొద్దిపాటి సైన్సు చదువుకున్న వారు, హేతువాదులు ఇలా వాపోతుంటారు. “మతములన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అన్న గురజాడ వాక్యాన్ని వీరు పదేపదే గుర్తు చేస్తుంటారు.

 ఈ ఆలోచన మనకు హెర్బర్ట్ స్పెన్సర్ అందించిన ఒక తప్పుడు వివరణ ఆధారంగా వచ్చింది. స్పెన్సర్ మానవ సమాజాలు మతం మూఢనమ్మకాలతో కూడిన ఆటవికత నుండి హేతుబలద్ధత, శాస్త్రబద్ధత కలిగిన ఆధునిక సమాజాలుగా పరిణామం చెందుతాయని ఊహించాడు. అంటే ఒక ఏకరూప నమూనాలో మానవ సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రతిపాదించాడు. ఇంకా చెప్పాలంటే ఇదొక రకమైన టెక్నలాజికల్ ఆర్గ్యుమెంట్! సమాజ పరిణామం ఒక లక్ష్యంతో సాగుతుందని ప్రతిపాదించడం. జంతుజాలం సరళత నుండి క్లిష్టత వైపు ప్రయాణించినట్టు మానవ సమాజం కూడా ఆటవికత నుండి హేతుబద్ధత వైపు పరిణామం చెందుతుందనుకోడం. దీని వల్ల మన మానవ సమాజపు తాత్విక సాంస్కృతిక పరిణామం కూడా ఒక సరళరేఖ లాగా సాగుతుందనే భ్రమ మొదలవుతుంది.

మతాలకూ సర్దుబాటు తెలుసు
అయితే మనం గమనిస్తే స్పెన్సర్ చెప్పిందానికి విరుద్ధంగా మానవ సమాజాలు మార్పు చెందుతున్నాయి. మానవ సమాజానికి ఉత్థాన పతనాలుంటాయి. అప్పుడప్పుడు పురాతన సంస్కృతుల పునరుద్ధరణ కూడా జరుగుతుంటుంది. అలాగే మతమూ శాస్త్రీయ విజ్ఞానమూ కూడా కలిసి జీవితం సాగిస్తుంటాయి. స్పెన్సర్ చెప్పినట్టు మూఢనమ్మకాలు కనుమరుగవడం ఏమీ వుండదు. పాతవాటి స్థానంలో కొత్తవి మొలకెత్త వచ్చు. ఒక నిరంతర చలన శీలత కలిగిన మానవ సమాజాన్ని ఒక యాంత్రికమైన సామాజిక పరిణామ వాదంతో (Social Evolution) వివరించభునుకోవడమే ఈ అపోహలకు కారణం. లెవీ స్ట్రాస్ ప్రకారం మతాలు సామాజిక అవసరాన్ని బట్టి సర్దుబాటు (Adopt ) అవుతూ వుంటాయి. ఆ క్రమంలో అవి మూఢ నమ్మకాలను కూడా తిరిగి పట్టుకు వెళ్ళాడుతాయి. పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక మూఢనమ్మకాలను తొలగించేస్తోందనుకోవడం పూర్తిగా అసంబద్ధం. అవి ఒకే సమాజంలో కలిసిమెలిసి పక్కనే వుంటాయని మనకు అమెరికా ఇండియాలు నిరూపిస్తున్నాయి కూడా! మైకేల్ పూకో అభివృద్ధి అనేది అధికారంతో నిర్మితమైనది కాబట్టి అది సహజ స్థితి కాదంటాడు.

స్పెన్సర్ ని ఈ విషయం మీద తీవ్రంగా విమర్శించిన వాడు నీషే. సరళరేఖలో మానవ సమాజాల అభివృద్ధిని కాదని నీషే సంస్కృతుల ఉత్థాన పతనాలను వివరిస్తాడు. విజ్ఞాన శాస్త్రం మత మూఢనమ్మకాల నుండి సమాజానికి విముక్తి కలిగిస్తుందనుకోవడం మరో మూఢనమ్మకమవుతుందంటాడు. మనం మానవ చరిత్రలను పరిశీలిస్తే అవి నిరంతరం ప్రతీకలను, పురాణాలను మోసుకొని తిరిగాయి. కాబట్టి ప్రస్తుత సమాజంలో మూఢనమ్మకాలు వున్నాయంటే అక్కడ శాస్త్రం అభివృద్ధి చెందలేదని అర్థం కాదు. స్పెన్సర్ చెప్పినట్లుగా పోత పోసినట్టుగా ఏకరూప సరళరేఖ మీద మానవ సమాజాలు పరిణామం చెందవు అని దీని అర్థం. దీన్ని అర్థం చేసుకోలేక పోతే శాస్త్రాభివృద్ధి, హేతువాదం గల సమాజమే అసలైన మేధోపరిణామనే, దాన్ని సాధించడమే అంతిమ లక్ష్యమనే ఒక తప్పుడు ఆదర్శం బయలుదేరుతుంది.

సైంటిఫిక్ బీభత్సం
 అయితే ఇంత వరకూ నేను చెప్పింది ప్రమాద రహితమైన ఉదాహరణ. కానీ 19 -20వ శతాబ్దాలలో డార్విన్ తర్వాత వచ్చిన డార్వినిస్టులు, హెర్బర్ట్ స్పెన్సర్, డాల్టన్ వంటి వారు సృష్టించిన సైంటిఫిక్ బీభత్సం చాలా తీవ్రమైంది. హేయమైంది కూడా. ముఖ్యంగా ఇది మనుష్య జాతుల మధ్య హెచ్చుతగ్గులను, యూరో సెంట్రిసిజాన్ని, యుథనేసియాతో పాటు సోషలిజం వ్యతిరేకతకు కూడా ఉతమిచ్చేలా తయారయింది. “సోషలిస్టులు సమానత్వాన్ని ప్రవచిస్తుంటారు గానీ ఇది ప్రకృతి విరుద్ధమైనది. కావాలంటే బయాలజీ చూడండి” అని చెప్పడం కూడా  మొదలైంది.

ఒకరకంగా చూస్తే శతాబ్దాల చరిత్ర గల క్రిస్టియన్లు పైన చెప్పుకొన్నట్టు డార్విన్ సిద్దాంతం తెచ్చిన ప్రకంపనలను, అది సృష్టించిన అమానవీయతను కళ్లారా చూసిన తర్వాతే, వారిలో నైతిక ప్రశ్నలుదయించి ‘ఈ డార్వినిజం మనిషికి వుండే ఆధ్యాత్మిక ఉన్నతిని జంతు స్థాయికి దిగజార్చింద’నే అభిప్రాయానికొచ్చారు. అందుకే డార్విన్ సిద్ధాంతాన్ని ఖండించారు. బైబిల్ సృష్టివాదం మాత్రమే మనుషులను సమానంగా చూడగలదని నమ్మారు.

అయితే ఈ కాలపు హేతువాదులు డార్వినిజం వ్యతిరేక వాదాన్ని “మూఢతకు సైన్సుకూ మధ్య వైరుధ్యం” (Dogma versus Science) అనే చట్రంలోంచి మాత్రమే చూడ్డం తెలిసిన వారు. ఈ చట్రం 19వ శతాబ్దపు మత వాతావరణాన్ని విమర్శించడానికి పనికొచ్చి వుండొచ్చు. కానీ 20వ శతాబ్దంలోని కాథలిక్కులు డార్వినిజాన్ని కాదనడానికి కారణం మతపరమైంది కాదు, జ్ఞానసంబంధమైందీ కాదు, నైతిక ప్రశ్నగా ఇది మొదలైంది. అన్ని నైతిక ప్రశ్నలు కూడా ప్రాక్టికల్ ప్రశ్నలేనన్న విషయాన్ని మనం ఇక్కడ మరవ కూడదు. కొందరు క్రిస్టియన్ మేధావులు డార్విన్ ప్రతిపాదించిన సైంటిఫిక్ వివరణను ఒప్పుకున్నా, నైతికంగా అది ముందుకు తెచ్చే మానవ అసమానతలను ఎదుర్కోవడానికి వేరే మార్గం లేక మొత్తం డార్వినిజాన్నే ఖండించవలసి వచ్చింది. కానీ తర్వాత కాలంలో రాజకీయాల వల్ల డార్వినిజం పట్ల వ్యతిరేకత మతోన్మాదానికి ఊతంగా మారడం మనకు తెలిసిందే.

డార్విన్ ధోరణి
దీనికి అంతటికి కారణం జీవశాస్త్రానికి చెందిన డార్వినిజాన్ని మానవ సమాజానికి అన్వయించాలని హెర్బర్ట్ స్పెన్సర్ పూనుకోవడమే. ఒకరకంగా డార్వినే ఈ ధోరణికి ఊతం ఇచ్చేలా తన పుస్తకాల్లో రాశాడు అని కూడా మనం గమనించాలి. విక్టోరియన్ కాలానికి చెందిన డార్విన్లో ఈ రేసిజంకు చెందిన ఛాయలున్నాయా లేదో చెప్పలేం గానీ ఆయన రాసిన కొన్ని వాక్యాలు ఈ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయన్న వాదన మాత్రం ఉంది. “కొన్ని శతాబ్దాల తర్వాత నాగరికత తెలిసిన మానవజాతులు ఆదిమ జాతుల్ని తుడిచిపెట్టేస్తాయి” అని “డెసెంట్ ఆఫ్ మాన్” అనే పుస్తకంలో డార్విన్ అంటాడు. ఇటువంటి ధోరణులే ఆ కాలంనాటి జర్మన్ మేధావులలో విష బీజాలు నాటాయన్నది ఒకరకంగా వాస్తవం. ఇలా చూస్తే డార్విన్ రాసిన ‘డిసెంట్ ఆఫ్ మాన్’ పుస్తకం సైంటిఫిక్ రేసిజాన్ని బలపరిచేదిగా తయారైంది లేదా మనుషులలో కొన్ని జాతులు మిగిలిన వాటి కంటే ఎక్కువగా పరిణామం చెందాయనే విషయాన్ని ఒప్పుకున్నట్లయింది. శక్తి వంతులే మిగులుతారు (Survival of the fittest) అనే వాక్యం డార్విన్ ది కాదు. అది స్పెన్సర్ ది. తమకు తాముగా బలంగా ఉన్న జాతులు నిలుస్తాయని బలహీనమైన జాతులు అంతరించిపోతాయని సామాజికపరంగా స్పెన్సర్ ఇచ్చిన వివరణ అది. స్పెన్సర్ బ్రిటిష్ తత్వవేత్త, సామాజిక శాస్త్ర వేత్త. బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం ఉత్తమ స్థితికి చేరుకున్న సమయమది. వలస తత్వంలో భాగంగా బ్రిటన్ వివిధ దేశాల్ని జయించిన కాలమది. ఈ క్రమంలోనే బ్రిటిష్ మేధావులకు సైన్సు పేరిట తమ జాతీయ అహంకారానికి జీవశాస్త్రపు సమర్థన స్పెన్సర్ Survival of the Fittest నిర్వచన రూపంలో దొరికింది. తన పరిణామ వాదానికి ఈ వాక్యానికి సంబంధం లేదని డార్విన్ స్పష్టంగా ఖండించిన దాఖలాలు కూడా లేవు. ఖండించకపోగా దాన్ని అంగీకరించినట్టు పై వాక్యాలు కనపడుతున్నాయి. ఈ నిర్వచనం తన సిద్ధాంతం ప్రజలకు సులభంగా అర్ధమయ్యేందుకు ఉపయోగపడుతుందని ఆయన భావించాడు కూడా.

మరో కోణం నుంచి చూస్తే డార్వినిజాన్ని సామాజిక శాస్త్రవేత్త మాల్థూస్ వాదం ప్రభావితం చేసిందనేది కూడా వాస్తవం. దీన్ని స్వయంగా డార్వినే ప్రకటించుకొన్నాడు. మాల్థూస్ తన “Essay on the Principle of Population” అనే వ్యాసంలో సమాజంలోని క్రిమినల్స్, మానసిక రోగులు ఎక్కువ పిల్లల్ని కంటారనీ, విక్టోరియన్ ఉన్నత వర్గపు విద్యాధిక కుటుంబాలు తక్కువ పిల్లల్ని కంటారని సూత్రీకరిస్తాడు. “మానవకణాలు మనుగడ కోసం బహువేగంగా బహుసంఖ్యలోకి మారుతాయి” అనే డార్విన్ సూత్రీకరణలో మాల్థూస్ ప్రభావం కనిపిస్తుంది. స్పెన్సర్, డాల్టన్ లు 19వ శతాబ్దం చివరికొచ్చేప్పటికి అచ్చం డార్విన్ లాగే జీవశాస్త్ర అంశాన్ని సమాజానికి అన్వయించడం మొదలు పెట్టారు. అందువల్లనే స్పెన్సర్ వల్ల సోషల్ డార్వినిజం, గాల్టన్ వల్ల యుజెనిక్సూ మొదలయ్యాయి.

జాత్యున్మాదం
అయితే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ‘సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గా’ ట్విస్ట్ చేసి సోషల్ డార్వినిజాన్ని ప్రతిపాదించింది స్పెన్సరే తప్ప ఇందులో డార్విన్ పాత్ర ఏమీ లేదని ఆధునిక డార్వినిస్టులైన స్త్రీఫెన్ జాయ్ గౌల్డ్ వంటి వారి వాదన. “అసలు సోషల్ డార్వినిజం అనే పదమే డార్విన్ సిద్ధాంతానికి సంబంధించినది కాదు. అది స్పెన్సర్, గార్డెన్ తదితరులు రూపొందించినది” అని డార్విన్ ని కాపాడే ప్రయత్నం చేస్తాడు గౌల్డ్. నిజానికి మొదటి డార్వినిస్టుగా డార్విన్ బతికున్న కాలంలోనే సోషల్ డార్వినిజం వైపు అడుగులు చేసినవాడు ఎర్నస్ట్ హెకిల్. కానీ ఈ యుగపు డార్వినిస్టులు ఇతన్ని క్షమిస్తున్నారు. నిజానికి జాతుల మధ్య హెచ్చుతగ్గులను, అసమానతలను డార్వినిజం సమర్థిస్తోందన్నంతగా హెకిల్ రాతలు కొనసాగాయి. అతడు కాకేషియన్లను ఉన్నత జాతి మానవులుగాను, ఆఫ్రికన్లను తక్కువజాతి మానవులుగాను వింగడిస్తాడు. ఉన్నతజాతి మానవులకు అధమ స్థాయి మానవులకు మధ్య చాలా తేడా వుంటుందనీ, అధమస్థాయి మానవులకూ, కోతి చింపాంజీ లాంటి ఉన్నత స్థాయి ప్రైమేట్సుకీ మధ్య తేడా స్వల్పమేనని అంటాడు. చూడండి దీనిలో స్పష్టంగా జాతులు మధ్య హెచ్చు తగ్గులున్నాయన్న సూచన ఎంత వుందో! ఈ సూచన రిచర్డ్ డాకిన్స్ రూపంలో, డిఎన్ఏ ని కనుక్కున్న వారిలో ఒకడైన జేమ్స్ వాట్సన్ రూపంలో నేటికీ కొనసాగుతోంది. డాక్సిన్ 2011లో ఆస్ట్రాలోఫితికస్ లాంటి మానవజాతిని జన్యు ఇంజనీరింగ్ ద్వారా బ్రతికించి, అది ఏ విధంగా మనుషులకూ, కోతులకూ మిస్సింగ్ లింక్ గా వుందో పరిశీలించాలంటాడు.

ఇందులో తప్పేమీ లేదు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ గత రెండు శతాబ్దాలుగా సోషల్ డార్వినిజం పేరుతో ఆఫ్రికన్ పిగ్మీలను మనుషులకు కోతులకు మిస్సింగ్ లింకుగా అభివర్ణించే ఆ కాలపు డార్వినిస్టులకు రిచర్డ్ డాకిన్స్ కి తేడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆస్ట్రలోఫితికస్ మరలా ఏ జాతుల మధ్య హెచ్చు తగ్గులను సృష్టిస్తుందోననే భయం మొదలవుతుంది.

ఉన్నత జాతి ఉన్మాదం
ఏది ఏమైనా సోషల్ డార్వినిజం డార్విన్ ను సైతం ఇబ్బందులు పెట్టింది. Survival of the fittestతో, స్పెన్సర్ తో ప్రభావితమైన ఆనాటి సైన్సు “యుజనిక్స్” అనే కొత్త సైంటిఫిక్ విభాగాన్ని ముందుకు తెచ్చింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్టెక్ కు ఇది ప్రాక్టికల్ అప్లికేషన్. దారిన తర్వాత డార్వినిస్టులు తమపై వస్తున్న వ్యతిరేకతకు సమాధానంగా యుజెనిక్సు చూపడం మొదలుపెట్టారు. “బలంగా వుండే జాతులే నిలబడతాయి. బలహీనమైనవి నశిస్తాయి. కాబట్టి బలంగా వుండే సమాజాన్ని తయారు చేయాలంటే ఏం చేయాలి? బలమైన జాతుల మనుషుల మధ్య మాత్రమే సంపర్కం జరగాలి. బలహీనమైన వారిని నాశనం చేస్తే రాబోయే మానవ సమాజం గొప్పగా వుంటుంది” అన్న ఆలోచన మొదలైంది.

అమెరికాలో 1921లో “నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ యుజనిక్స్ మ్యూజియం” మొదలైంది. అందులో వివిధ జాతులకు చెందిన మానవుల చిత్రపటాలుంటాయి. ఎవరి మెదడు సైజు ఎంతుంటుందో, ఎవరికి తెలివి ఎక్కువగా వుందో, ఎవరి అంగసౌష్టవం ఎలా ఉందో వర్ణిస్తూ చిత్రాలుంటాయి. అవన్నీ కూడా చివరగా ఇచ్చే సందేశం బ్లాక్, హెస్పానిక్, ఏషియన్, మెక్సికన్ల కంటే కాకసన్లు ఉత్తమ జాతికి చెందిన వారని ! ఈ మ్యూజియం బయట ఈ యుజెనిక్స్ కి ఆద్యులుగా ఇద్దరి శిల్పాలు చెక్కబడి వుంటాయి. ఒకటి డాల్టన్ దయితే రెండవది డార్విన్ ది! డార్విన్ కుమారుడు లియోనార్డొతో పాటు గ్రహం బెల్ వంటి ఎందరెందరో ప్రముఖ సైంటిస్టులు ఈ మ్యూజియం నుండి ఆహ్వానం అందుకునేవారు. వీరందరూ తమ జాతులు సంకరం అయిపోతున్నాయని గగ్గోలు పెట్టేవారు. మరో పదేళ్లకు పిచ్చి మరింతగా ముదిరింది. కొంతమంది నల్లజాతి వారిని ప్రదర్శనకు పెట్టేవారు. హార్మోన్ సమస్య వల్ల గడ్డం మీసం వచ్చిన ఒక అమ్మాయిని మనుషులకు చంపాజీలకి మధ్యన మిస్సింగ్ లింకుగా ప్రదర్శనలో పెట్టారు. అక్కడ కోతులకు ఆహారం వేసే “ఒటా బెంగా” అనే ఒక నల్ల జాతి పిల్లవాడిని మరో మిస్సింగ్ లింకుగా ప్రచారం చేశారు. సందర్శకులు అతన్ని కర్రలతో పొడిచి చూసేవారు.

ఒకరకంగా ఈ అమానవీయ ఉన్మాదాన్ని మొదటి నుంచి అడ్డుకున్నది కాథలిక్ చర్చినే! మానవ సమాజాలకు మతోన్మాదమే కాదు సైంటిఫిక్ డిటెర్మినేషన్ రూపంలో, యుజెనిక్ రూపంలో ఉండే సైంటిఫిక్ ఉన్మాదం కూడా అంతే ప్రమాదకరమైనది అనేందుకు ఈ మ్యూజియం ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది!

ఇరవయ్యవ శతాబ్దం మొదటి మూడు దశాబ్దాలలో ఈ యుజెనిక్స్ పెద్ద ఉద్యమంగా పైకి లేచింది. దీని ప్రభావంతో జాతిని కాపాడుకోవాలంటే బలహీనులను, దివ్యాంగులను పట్టుకుని గుంపగుత్తగా స్టెరిలైజేషన్ చెయ్యాలని చట్టాలు చేశారు. అమెరికాలోని 32 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. ఫలితంగా కొన్ని వేల మంది బలవంతంగా స్టెరిలైజ్ చేయబడ్డారు.

సైన్సు యుగంలో నీచపు పోకడలు
విచిత్రమేమంటే మత ఛాందసత్వం ఎక్కువనుకొనే కొన్ని దక్షిణాది రాష్ట్రాల కంటే; శాస్త్రీయత, లౌకికత్వం బలంగా వున్నాయనుకొనే ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లోనే ఈ యుజెనిక్స్ స్వభావం ఎక్కువగా కనబడింది. యుజెనిక్సు డేటా క్లినిక్కులు ఏర్పడ్డాయి. అమెరికన్ రాష్ట్రాల పాఠశాలల్లో ప్రతి విద్యార్థి వంశవృక్షాన్ని వేయాలి. ఎవరెవరికి ఏ జబ్బులు వుండేవో రాయాలి. ఈ డేటాని స్కూళ్ళు గవర్నమెంటుకు సమర్పించాలి. తద్వారా ఎవరు బలవంతులో, ఎవరు బలహీనులో గవర్నమెంటు అధికారులు నిర్ణయిస్తారు. పెళ్లి చేసుకోవడానికి కూడా దంపతులు మొదటి తమ వంశవృక్షాన్ని, కుటుంబ సభ్యులనూ విధిగా సమర్పించాలి. బలహీనమైన జన్యుల గల వారు పెళ్ళికి అనర్హులు. వివిధ జాతులకు చెందిన వారు పెళ్లి చేసుకోకూడదు. తెల్లవాళ్ళ నల్లవాళ్లమధ్య పెళ్లి నిషిద్ధం. అలా చేస్తే బలహీన జాతులకు చెందిన జన్యువులు కలిసిపోయి మొత్తంగా జాతి నిర్వీర్యం అవుతుంది. నల్లజాతి వారు తక్కువ జాతి వారు (Sub human) కాబట్టి వారి ఇమిగ్రేషన్ పై కూడా విపరీతమైన అంక్షలను విధించేవారు. నల్లవారిని ఎక్కువ మందిని దేశంలోక రానీయడం వల్ల దేశం బలహీనమవుతుందని భయం పట్టుకుంది.

ఇదంతా ఏ మనువుకాలంలోనో కాదు. ఇవన్నీ సైన్స్ అభివృద్ధి చెందిందనుకున్న ఇరవయ్యవ శతాబ్దపు పోకడలు! దాదాపు 70 వేలమంది శారీరక మానసిక బలహీనులను, దివ్యాంగులను క్యాంపుల్లో వేసి చంపేశారు. ఎందుకంటే వీరు పిల్లల్ని కనడం వలన బలహీన సమాజం ఏర్పడుతుందని భయం! ఈ క్యాంపుల్లో చంపేసిన అనుభవమే తర్వాత యూదు వినాశనానికి (హోలో కాస్ట్)కి ఉతమిచ్చిందంటారు. నాజీయిజానికి కూడా ఇలాంటి జాత్యహంకారాలే మూలమని మనకు తెలుసు. ఇది ఎన్ని లక్షల మంది యూదుల జీవితాల్ని పొట్టన పెట్టుకుందో కూడా తెలుసిందే. ఈ ఊచకోతకు జీవశాస్త్రం నుంచి సపోర్టు రావడంలో 19 శతాబ్దంలోని డార్విన్ ఆధారిత సామాజిక డార్వినిజం, యుజెనిక్సుల వాతావరణమే కారణం. హిట్లర్ ఉన్నతమైన ఆర్యజాతి జీన్ పూల్ ఇతర జాతులతో కలవడం వల్ల కలుషితమవుతుందని ఈ కోవలో భాగంగానే భావించాడు.

కొత్త సైన్సూ కొత్త హెచ్చరికలూ!
ఆఫ్రికన్ పెగ్మీలను తక్కువ జాతి మనుషులుగా చూడడం; మతస్థుల పట్ల హేతువాదులు మేధోపరమైన అంటరానితనం పాటించడం కూడా స్పెన్సర్ నిర్వచించిన సామాజిక డార్వినిజం ఫలితాలే. అయితే జన్యు ఇంజనీరింగ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ లక్షణాలు ముందే నిర్ణయించే దశకు మనం చేరుకుంటున్న కొద్దీ సోషల్ డార్వినిజం, యుజెనిక్సూ రెండూ పునరుజ్జీవం పొందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కానీ మానవ సమాజాలు వివిధ దశల్లో ఎప్పటినుండో సామాజిక హెచ్చుతగ్గులను పాటిస్తూనే ఉన్నాయి. డబ్బు సంపాదన, ఉద్యోగ సంపాదన, హోదా సంపాదన, మేధావిత్వం, ఐక్యూ ఇలా అన్నిటిలో హెచ్చుతగ్గుల బెరీజులున్న సమాజాలనే మనం నిర్మించుకున్నాం. మనుషులుగా మనకుండే ఈ అనైతికకు బయలాజికల్ రూపం ఇచ్చే ఒకానొక వైజ్ఞానిక అంశమే సోషల్ డార్వినిజం. అన్ని రకాల అమానవీయతలను వదిలి, సైన్సును మానవీయత వైపు నడపగలిగే మేధావిత్వం, రాజకీయం మనకు ఎప్పటికైనా అందేనా అన్నదే అసలు ప్రశ్న. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని, సామాజిక క్షేత్రంలో కంటే మనుషుల కణాల లోపలి విషయాలు- అంటే మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ వంటి విషయాల్లో పరిశోధనలు జరుగుతున్న తరుణమిది. గమనించి చూస్తే ఈ జన్యు పరిశోధనలను తమ తమ రాజకీయ ప్రయోజనాల దృష్టితో వివరిస్తూ, తమకు తాము ఎంతో గొప్ప జాతులుగానూ మిగతావి క్రూరమైనవిగానో లేక ఆటవికమైనవిగానో ప్రతిపాదించే కొత్త సూత్రీకరణలు పెరిగిపోతున్నాయి. సైన్సు పరిశోధనలను వివరణాత్మక విషయాలుగా గాక తమ రాజకీయ లక్ష్యాలను నిర్దేశించే ప్రిస్క్రిప్షన్లుగా వాడుకునే ధోరణలు పెరుగుతున్నాయి. మళ్లీ మనం అమానవీయత వైపు పయనించే అవకాశాలు పెరుగుతున్నాయి.

ఇటువంటి తరుణంలో సైన్సు పేరిట జరిగిన, జరుగుతున్న దాష్టీకాలను దాచిపెట్టి సమాజాలు సైంటిఫిక్ గా మారడమే అసలైన సామాజిక లక్ష్యమని మాట్లాడే మాటలు మళ్ళీ ఏ ఉపద్రవాన్ని తీసుకొస్తాయో అనిపిస్తోంది. మనం మతం పట్ల మాత్రమే గాక సైన్సు పట్ల, దాన్ని వివరింప బూనుకుంటున్న సోకాల్డ్ మేధావుల పట్ల కూడా జాగ్రత్తతో ఉండక తప్పదు. Misanthropy has many faces. అందులో మతోన్మాదమే కాదు విజ్ఞానోన్మాదమూ కూడా వుందని గుర్తించక తప్పదు!

One thought on “ఉపద్రవంగా మారుతోన్న విజ్ఞానోన్మాదం!

  1. విజ్ఞానోన్మాదం డాక్టర్ గారు వివరించిన విధానం జాతి వివక్షత చాల భాగా వివరించారు

Leave a Reply to Bedudoori Rajasekhar Rahul Cancel reply

Your email address will not be published. Required fields are marked *