అరవింద్ గుప్తా

ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడు అనదగిన వాడు వైను బప్పు. ఆయన అవిశ్రామ కృషి వల్ల, భారతదేశంలో భవిష్య ఖగోళశాస్త్ర పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. వైను బప్పు 1927 ఆగస్టు 10న జన్మించారు. వారి కుటుంబం కన్ననూర్ నుంచి వచ్చినా, తండ్రి హైదరాబాద్లోని నిజామియా పరిశీలనాలయంలో పని చేసేవారు. అందువల్ల ఆయన పాఠశాల, కళాశాల విద్య హైదరాబాద్లో జరిగింది. ఆయన వక్తృత్వపు ప్రజ్ఞ వల్ల పాఠశాలలో అందరి అభిమానాన్ని పొందారు. కళాశాలలో ఆయన విజ్ఞానశాస్త్ర క్లబ్ ని స్థాపించి, కళాశాల పత్రికను ఎడిట్ చేసేవారు. కళాశాల భౌతికశాస్త్ర అసోసియేషన్కు సెక్రటరీగా ఎన్నో ప్రజారంజక విజ్ఞాన శాస్త్ర ప్రసంగాలను నిర్వహించారు. 1943లో సర్. సి.వి. రామన్ హైదరాబాద్లో ప్రసంగాలను చేసినప్పుడు, వైను ప్రతిరోజూ ఒక్కో వైపు 16 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి, ప్రతి ఒక్క ప్రసంగాన్నీ విన్నారు.

ఆయన ఒక కళాకారుడు కూడా. పుస్తకాలు విపరీతంగా చదివేవారు. ఆయనకు ఆంగ్ల కవిత్వం పట్ల చాలా మక్కువ. ఉర్దూ సాహిత్యమన్నా ఆయనకు చాలా ఇష్టం. ఆయనకి అత్యంత ఇష్టమైన కవి మీర్జా గాలిబ్. కళాశాలలో ఆయన క్రికెట్, టెన్నిస్ లో మంచి ఆటగాడు. ఒక సాహాసకునిగా ఆయన పైలట్ కావాలన్న నిక్షిప్తమైన కోరిక ఉండేది. ఛార్లెస్లిండ్బెర్గ్ అమర గాథ “ద స్పిరిట్ ఆఫ్ సెయింట్ లూయీస్” ఆయనకు ఇష్టమైన పుస్తకం. శాస్త్రవేత్త, కళాకారుడు అయినటువంటి హోమీ బాబా అంటే వైనుకి చెప్పలేనంత అభిమానం.

బప్పుకి ఉన్న కళాకారుని దృష్టి, ఆయన స్థాపించిన అనేక పరిశోధనాలయాలలోని చిత్రపటాలు, ఉద్యానవనాల్లో స్పష్టమౌతుంది. చిన్నతనంలోనే వైను నిజామియా పరిశీలనాలయంలోని దూరదుర్భిణిని సందర్శించారు.రాత్రిపూట ఆకాశంలోని అద్భుతాలు ఆయనను అమితంగా ఆకర్షించాయి! కళాశాలలో ఉన్నప్పుడే ఆయన స్పెక్ట్రోగ్రాఫ్ ని నిర్మించారు. వరసగా ఆరు రాత్రులు తన పడకగది కిటికీలోంచి “సెన్సిటివ్ ప్లేట్”ని బహిర్గతం చేసి 1946లో మొదటి శాస్త్రీయ పత్రాన్ని వెలువరించారు.

1948లో ఎం.ఎస్సి పూర్తయినాక వాతావరణ రంగంలో కొనసాగాలనుకున్నారు, అప్పట్లో ఇందుకు భారతదేశంలో అవకాశాలు తక్కువ. అదృష్టవశాత్తూ, యు.కె.లోని ఖగోళశాస్త్రవేత్త సర్ హెరాల్డ్ స్పెన్సర్ జోన్స్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ హార్లో షాప్ భారతదేశానికి వచ్చారు. హైదరాబాదులో వైను వారిని కలిశారు. ఐచ్ఛిక ఖగోళశాస్త్రవేత్తగా వైను ప్రయోగాల గురించి షాప్ చదివి ఉన్నారు. 1949లో షాప్ కృషి వల్ల హైదరాబాదు ప్రభుత్వ స్కాలర్షిప్ తో వైను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఎంతో సమర్థులైన, స్ఫూర్తినిచ్చే వ్యక్తులు కలిశారు. హార్వర్డ్ కు వచ్చిన కొద్ది నెలల్లోనే వైను ఒక తోకచుక్కని కనుగొన్నారు. ఫోటోప్లేట్ మీద పరిపాటిగా ఆకాశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన ఏదో అసాధారణ పదార్ధాన్ని గమనించారు.

తన సహోద్యోగులతో పాటు ఆయన ఒక కొత్త తోకచుక్కను కనుగొన్నారు. వారి పేరుమీదగా దానిని బప్పు -బోక్ – న్యూకిర్క్ తోకచుక్కగా పిలుస్తున్నారు. దీనిని కనిపెట్టినందుకు బప్పుకి పసిఫిక్ ఖగోళ శాస్త్ర సంఘం నుంచి డోనొహ తోకచుక్క పతకం లభించింది.

1951లో పిహెచ్.డి అనంతరం బప్పుకి ఖగోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన కార్నెజీ మెల్లన్ ఫెలోషిప్ లభించింది. దీనిని అందుకున్న మొదటి భారతీయుడు ఆయన. దీని వల్ల ఆయనకు ప్రపంచంలోనే అతి పెద్దదైన 200 అంగుళాల మౌంట్ పాలొమార్ టెలిస్కోప్ ను ఉపయోగించే అవకాశం కలిగింది. ఇక్కడ ఆయన ఆకాశ స్పెక్ట్రోస్కోపీలో ఎంతో క్లిష్టతరమైన సమస్యలను పరిశీలించారు. ఊల్ఫ్-రాయెట్ నక్షత్రాల మీద చేసిన అనంత పరిశీలనలు ఆయనను ఆ రంగంలో ప్రపంచ నిపుణుడిగా నిలబెట్టాయి.

1953లో బప్పు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడ ఖగోళశాస్త్రంలో పరిశోధనలు చేయడానికి ఉన్న సౌకర్యాలు నామమాత్రం. అతి పెద్ద దూరదుర్భిణి కేవలం 15 అంగుళాల రిఫ్రాక్టర్. 1954లో వారణాసిలోని నక్షత్రశాలలో ముఖ్య ఖగోళ శాస్త్రజ్ఞుడిగా చేరారు. దీనిని మరింత అనువైన చోటుకి మార్చాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించారు. నైనితాల్ దగ్గర ఒక కొండపైకి దానిని తరలించారు. కొద్ది సంవత్సరాలలోనే స్ఫూర్తి కలిగిన ఎంతోమందికి ఖగోళశాస్త్రంలో శిక్షణ ఇచ్చారు. వీరు తరువాత కాలంలో ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందేందుకు ఎంతో కృషి చేశారు.

1960లో, భారత ప్రభుత్వ కోరిక ప్రకారం, 170 సంవత్సరాల కొడైకెనాల్ పరిశోధనాలయానికి అతి పిన్న వయస్సులో బప్పు డైరెక్టరు అయ్యారు. దానిని 1792లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెని మద్రాసులో స్థాపించి 1899లో కొడైకెనాల్ కు తరలించింది. ఎన్.ఆర్.పోగసన్, “ఎవర్డ్ ప్రభావానికి” ఖ్యాతిగాంచిన జాన్ ఎవర్హెడ్ వంటి ప్రఖ్యాత ఖగోళశాస్త్రజ్ఞులు ఈ సంస్థకు డైరెక్టర్లుగా పనిచేశారు. బప్పు చిన్న దుర్భిణి, స్పెక్ట్రోగ్రాఫ్స్ తయారు చేసేందుకు పరికరాలు, ఆప్టిక్స్ వర్క్ షాప్  నెలకొల్పారు. పురాతన సౌర దుర్భిణి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వాటిలో ఆధునిక ఎలక్ట్రానిక్స్ ను చేకూర్చారు. కొడైకెనాల్లో పూర్తిస్థాయి ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ, పరిశోధనాలయం స్థాపించాలన్న బప్పు కల సాకారం చెందసాగింది.

38-centimeter telescope seen from the 1-meter telescope at Vainu Bappu Observatory

సంవత్సరం పొడవునా ఆకాశాన్ని చూడటానికి కొడైకెనాల్ సరిపోదని త్వరలోనే బప్పు గ్రహించారు. సరైన స్థలం వెతకడానికి కన్యాకుమారి నుంచి తిరుపతి వరకు ఆయన కాలినడకన ప్రయాణించారు. చివరకు తమిళనాడులోని జావడి కొండను తగిన స్థలంగా గుర్తించారు. జనసందడి లేని కావలూర్ అనే ఊరి వద్ద, చుట్టూ కొండలు ఉన్న ఒక పీఠభూమిని ఎంచుకున్నారు. పరిశోధనలకి వీలుగా అది ఒక స్థిరమైన వాతావరణం కలిగి ఉంది. 38 సెంటీమీటర్ల టెలిస్కోపుతో బప్పు కావలూర్ పరిశోధనాలయాన్ని నెలకొల్పారు. తరవాత దీనిలోనే ఒక మీటరు కార్ల్ జైస్ దుర్భిణిని చేర్చారు.

1971లో కొడైకెనాల్, కావలూర్ పరిశోధనాలయాలు రెండూ కలిపి ఒక స్వయం ప్రతిపత్తి గల పరిశోధనా కేంద్రం – (The Indian Institute of Astrophysics, IIA) ఏర్పడింది. ఈ సంస్థ భారతదేశంలో ఖగోళ భౌతికశాస్త్ర పరిశోధనలకి ఎంతగానో తోడ్పడింది. దీనిలో ఒక బలమైన సైద్ధాంతిక బృందం, అప్లికేషన్ బృందం ఉన్నాయి. వాటి లక్ష్యం భారతదేశంలో దేశీయమైన పెద్ద ఆప్టికల్ దుర్భిణిని నిర్మించడం. మొదట్లో రామన్ పరిశోధనా సంస్థ నుంచి ఐఐఏ పనిచేసింది. త్వరలోనే బెంగుళూరులోని కోరమంగళలో సొంత కాంపస్ కు మారింది. ఐఐఏ ని ప్రపంచస్థాయి పరిశోధనా కేంద్రంగా మలచేందుకు బప్పు ఎంతో కృషి చేశారు. జైస్ దుర్భిణిని నెలకొల్పిన పక్షం రోజులకు కావలూర్లో ఒక అరుదైన ఘటనని గమనించారు. జూపిటర్ ఉపగ్రహం “గానీమీడ్”లోని అల్ప వాతావరణాన్ని ఇది నిరూపించింది. రెండు సంవత్సరాల తరవాత అదే దుర్భిణితో యురేనస్ రింగ్స్ కనుగొన్నారు. వీటి వల్ల మనకు సౌర వ్యవస్థ గురించిన అవగాహన పెరిగింది. ఈ విధంగా బప్పు ప్రపంచస్థాయి సామర్థ్యం కలిగిన పరిశీలనాలయాన్ని స్థాపించడంలో సఫలీకృతులయ్యారు.

1970ల ఆరంభంలో నోబెల్ గ్రహీత ఎన్. చంద్రశేఖర్ ఐఐఏ సందర్శించి, బప్పు కృషిని కొనియాడారు. ఇంతటి వత్తిళ్ళతో జీవితాన్ని గడపడం వల్ల బప్పు 55 ఏళ్ళ వయసుకే బైపాస్ సర్జరీ అనంతరం 1982 ఆగస్టు 19న మరణించారు. అంతకు మునుపే ఆయన అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సంఘానికి (International Astronomical Union, IAU)కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ, బప్పు కలగన్న దుర్భిణిలను (243 సెంటీమీటర్ల) జాతికి అంకితమిచ్చారు. కావలూర్ పరిశీలనాలయానికి, వైను బప్పు పేరు పెట్టారు. బహుముఖ ప్రజ్ఞతో బప్పు అనేక గౌరవాలను పొందారు. 1970లోఆయనకు భౌతికశాస్త్రంలో శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం లభించింది. 1977లో భౌతికశాస్త్రంలో హరి ఓం ఆశ్రమ్ పురస్కారం లభించింది. 1981లోభారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ తో సత్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *