టి. వి. వెంకటేశ్వరన్

1892లో ఎర్నెస్ట్ హాన్బరి హన్కిన్స్ అనే సైంటిస్టుని కెమికల్ అనలిస్టుగా, బాక్టీరియాలజిస్టుగా పంజాబ్ ప్రావిన్సు, మధ్య ప్రావిన్సులలో పనిచేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. అతని ప్రధాన కర్తవ్యం బ్రిటీష్ సైనికుల్ని ప్రాణాంతక వ్యాధులనించి ప్రత్యేకించి కలరా నుంచి కాపాడ్డం.

ఢిల్లీలో అతను ప్రతిరోజూ వేలమంది స్థానికులు యమునా నదిలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులు కడగడం చూసి ఆశ్చర్య పోయాడు. ఇతర యూరోపియన్ ఆఫీసర్ల మాదిరే ఆ నీళ్లు పూర్తి కలుషితం అని, భారతీయ నదులన్నీ కాలుష్యమయం అనే అభిప్రాయానికి వచ్చాడు.

తొందర్లోనే అతను ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. రెండేళ్ళతర్వాత అంటే జనవరి 1894 లో అలాహాబాదులో ‘మాఘ కుంభ్’ జరిగింది. లక్షలమంది పుణ్య స్నానాలకోసం వచ్చారు. వారందరు ప్రయాగ్ లో బసచేశారు. వారి స్నానాలు ఇతర కార్యక్రమాలు అన్ని నది ఒడ్డునే. దానికి తోడు సగం కాలిన శవాల్ని నదిలో వదిలివేయడం. ఇవన్నీ చూసాక హన్కిన్స్ గంగానది కలరా వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం అవుతోందని భావించాడు. ప్రయాగ్ లో కలరా సోకిందంటే ఇక నదీ ప్రవాహంలో కింద వున్న గ్రామాలూ పట్టణాలకు సోకడం అనివార్యం. కలరా నీటిద్వారా వ్యాపిస్తుందని తెలిసిందే. కానీ ఆశ్చర్యకరంగా ప్రవాహానికి కిందవున్న గ్రామాల్లో కలరా వ్యాపించింది కానీ అది నది జలాల వలన కాదు. ముందే వ్యాధి సోకిన మనుషులు ఆ ఊర్లోకి రావడం వల్ల వచ్చింది. ఇదెలా సాధ్యం? కలరా నీటి వల్ల వ్యాపించే వ్యాధి అయినప్పుడు గంగా నదీ నీటి వల్ల మాత్రం వ్యాపించదా?

గంగానది ప్రత్యేకత
హన్కిన్స్ భారతదేశానికి వచ్చిన మొదటి రెండేళ్లలో మురుగు నీటి ద్వారా కలరా బాక్టీరియా  గంగ, యమునా నదుల్లో కలుస్తున్నా ఆ నదుల పక్కన నివసించే ప్రజలు ఆ నదుల నీళ్ళు తాగుతున్నా కలరాకు గురికావడం లేదని గమనించాడు. నీళ్లు కూడా మురికి వాసన లేకుండా వున్నాయి. ఇది యూరప్ లో హన్కిన్స్ చుసిన నదులకు భిన్నం. దీన్ని శాస్త్రీయంగా తేల్చుకోవాలని హన్కిన్స్ అనుకున్నాడు.

దీని కోసం అతను ఆగ్రా లోని మురుగు నీటి కాల్వలనుంచి, వాటి దగ్గరలో ప్రవహించే యమునా నది నీటి నుంచీ, సమీప బావుల నుంచీ నీటి నమూనాలు సేకరించాడు. మురుగు నీటిలో కలరా కారకమయిన విబ్రియో కలరా అనే క్రిమి వుంది. ఇది ఊహించిందే. కానీ అదే మురుగు నీటి కాల్వకు దగ్గరలో నదిలోంచి తెచ్చిన నీటి నమూనాలో బాక్టీరియా లేదు. మళ్ళీ బావి నీటిలో కలరా బాక్టీరియా వుంది.  యమునా నదిలో ఎదో మెకానిజం కలరా బాక్టీరియాను సంహరిస్తోంది. ఒక నిర్ణయానికి వచ్చే ముందు హన్కిన్స్ ఆ నీటి నమూనాల్లోకి కలరా బాక్టీరియాని పంపించి చూసాడు.  ఆశ్చర్యకరంగా నది నీటిలో బాక్టీరియా కేవలం మూడు గంటల్లో చనిపోయింది. అంతటితో ఆగకుండా హన్కిన్స్ నది నీటిని ఫిల్టర్ చేసి, మరిగించి ఆ నమూనాల్లోకి  బాక్టీరియా పంపించి చూసాడు. ఫిల్టర్ చేసిన నీటిలో బాక్టీరియా చనిపోయింది కానీ మరిగించిన నీటిలో మాత్రం బాక్టీరియా చనిపోలేదు. దీనితో మరిగించిన తర్వాత గంగా యమునల నీళ్లు కలరా బాక్టీరియాను చంపే శక్తి కోల్పోతున్నట్టు కనుక్కున్నాడు. ఒక్క కలరా బాక్టీరియానేకాదు టైఫాయిడ్ బాక్టీరియాను కూడా ఈ నీళ్లు అంతమొందిస్తున్నాయి.

ఈ ప్రయోగాల తర్వాత హన్కిన్స్, ఏ యాంటీసెప్టిక్ పదార్థం వల్ల జరుగుతుందో తెలియదు కానీ, గంగ యమునల నీళ్లు కలరా, టైఫాయిడ్ వ్యాధులను వ్యాప్తిని అడ్డుకోగలవు అని ప్రకటించాడు. కుంభమేళా వంటి సమయాల్లో బావినీళ్లకంటే నది నీళ్ళే సురక్షితం అని కూడా ప్రకటించాడు.

తన ఈ పరిశోధన వివరాలను హన్కిన్స్ 1896 లో పాశ్చర్ ఇనిస్టిట్యూట్ ప్రచురించే సైన్సు పత్రికలో ప్రచురించాడు. మొదట్లో ఇదొక జానపద గాథ అని కొట్టేసారు కానీ, తర్వాత చాల మంది పరిశోధకులు దీన్ని ధ్రువీకరించారు. హన్కిన్స్ పరిశోధన అప్పటికే ప్రజల్లో బలంగా వున్న గంగానది ‘స్వయంశుద్ధి’ నమ్మకాన్ని మరింత బలపరిచింది.

ఈ స్వయం శుద్ధి ఎలా సాధ్యం?
నదిలో చాలా ఎక్కువ నీళ్లు ఉంటూ వేగంగా ప్రవహిస్తుంటే అందులో కలిసే కాలుష్యాలు పలచబడటం ద్వారా నది శుభ్రంగా ఉండటం ఒకటి. ఇంకోటి నది ఒడ్డున ఇసక, సన్నని గులక ఉండటం వల్ల కొన్ని మలినాలు అందులో చిక్కుబడిపోయి నది శుభ్ర పడటం.

నగరాలు, పట్టణాల్లో గృహాలనుంచి వచ్చే మురుగు, నీటికాలుష్యానికి ఒక ప్రధాన కారణం.  నీటి ప్రవాహానికి ఈ మురుగు కలిసినప్పుడు హైడ్రోలైజ్ అయ్యి అందులోని రసాయనాలు విడగొట్టబడి కలుషితాలు తగ్గిపోతాయి. అలాగే సూర్యరశ్మి సోకడం ద్వారా రసాయనాలు విడగొట్టబడతాయి. దీనిని ఫోటోలైసిస్ అంటారు. ఈ హైడోలైజెషన్, ఫోటోలైసిస్ లను భౌతిక రసాయనిక చర్యలు అంటారు. నీటిని శుద్ధి చేయడంలో ఈ భౌతిక రసాయనిక చర్యలు తోడ్పడినా, జీవసంబంధమయిన చర్యలదే నీటి శుద్ధిలో ప్రధాన పాత్ర. డీకంపోసర్లు అనే ఒక రకమైయినా సూక్ష్మ జీవులు కలుషితాలను ప్రాధమిక ఖనిజ సమ్మేళనాలుగా విడగొడతాయి. ఈ ప్రక్రియను ఖనిజీకరణ అంటారు. నీటిలో కరిగిన ఈ ఖనిజాలు జంతువులూ, మొక్కలకు పోషకాహారం అవుతాయి. ఇది నదులు తమను తాము శుభ్రపరుచునే విధానం.

గంగా నది స్వయంశుద్ధి రహస్యం
హన్కిన్స్ పరిశోధన తర్వాత చాలా ఏళ్లకు ఫ్రెడెరిక్ డబ్ల్యూ టవర్ట్ , ఫెలిక్స్ డి హెరెల్లె లు బాక్టీరియోఫేజ్ అనే  బాక్టీరియాను తినేసే వైరస్ లను కనుగొన్నారు. తర్వాతపరిశోధనల్లో గంగా నదిలో ఈ వైరస్ రకాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. ఎలాగైతే కోవిడ్-19 లాంటి వైరస్ లు మనుషులకు హానికారకాలో ఈ వైరస్ లు బాక్టీరియాకి హానికారులు.కొన్ని వేల రకాల బాక్టీరియోఫేజ్ వైరస్ లను గంగాజలాల్లో కనుగొన్నారు. దీని వలెనే గంగానదిలో హానికారక బాక్టీరియా  వృద్ధి నిరోధించబడుతోంది.

అయితే ఇవి గంగానదిలోకి ఎలా వచ్చాయి? ఈ బాక్టీరియోఫేజ్ వైరస్ లు గంగా నది పుట్టే హిమాలయాల్లోని మంచుఖండాల్లో కూడా ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. లక్షల సంవత్సరాల క్రితం హిమాలయాల మంచులో ఈ వైరస్ లు అబయోటిక్ కణాలుగా బంధించబడ్డాయనీ అవే మంచు కరిగి నప్పుడు నీటిలోకి వస్తున్నాయని పరిశోధకుల అంచనా.

గంగాజలంలో హానికారక బ్యాక్టీరియాను సంహరిస్తున్నాం బాక్టీరియోఫేజ్ వైరస్ల ఆవిష్కరణ గంగాజలాల స్వయంశుద్ధిని కొంతమేరకు వివరించాయి. పూర్తిగా కాదు.

గంగానది జన్మస్థలం అయిన హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే ఎత్తైన, చురుకైన, ఇటీవలే ఏర్పడిన పర్వతాలు. హిమాలయాలు ఏర్పడి ఐదు కోట్ల సంవత్సరాలు మాత్రమే అయింది. (భూమి పుట్టి 454 కోట్ల సంవత్సరాలు అయ్యింది). ఐదు కోట్ల సంవత్సరాల కింద ఏర్పడ్డ హిమాలయాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నేటికీ అవి సంవత్సరానికి ఒక సెంటీమీటర్ చొప్పున పెరుగుతున్నాయి. వర్షపు నీరు గాలిలోని కార్బన్ డైయాక్సైడ్ ను కరిగించుకొని కొంత ఆమ్ల లక్షణాలతో ఉంటాయి. ఆ వర్షం నీరు హిమాలయాల్లోని క్యాల్షియం ఉన్న సిలికేట్ శిలలపై పడ్డప్పుడు జరిగే రసాయన చర్యల వలన సున్నపురాయి, కొన్ని ఖనిజాలు ఏర్పడతాయి.

హిమాలయాలు ఇంకా పెరుగుతూ ఉండటం వల్ల ఎప్పటికప్పుడు కొత్త శిలలు ఏర్పడుతూ ఈ రసాయన చర్యలు కొనసాగుతూ ఉండడానికి తోడ్పడుతున్నాయి. గంగా బ్రహ్మపుత్ర నదులు దాదాపు 130 మిలియన్ టన్నుల కరిగిన లవణాలను బంగాళాఖాతంలోకి తీసుకు వెళుతున్నాయి. ఇది ప్రపంచంలో నదులు సముద్రాలలోకి తీసుకువెళ్లే లవణాల్లో మూడు శాతం.  ఈ సిలికేట్లు లోహపు అయాన్లు నీటిలో కలిసి కిందికి ప్రవహిస్తాయి. ఈ లోహపు అయాన్లు నదిలో అడుగున మట్టిలో పేరుకు పోతాయి. ఇవి బ్యాక్టీరియాని సంహరించడం ద్వారా గంగా జలాలను శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతున్నాయి.

ఈ రెండు ప్రక్రియల వల్ల గంగా నది స్వయంశుద్ధి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అన్ని సహజ ప్రక్రియలు మాదిరే ఈ స్వయం శుద్ధికి కూడా ఒక హద్దు ఉంది నీటిలో చేరే వ్యర్ధాలు ఒక మేర దాటనంతవరకు నది తనను తాను శుభ్రం చేసుకోగలుగుతుంది కానీ ఇప్పుడు పరిమితి దాటిపోయిన మానవ వ్యర్ధాలు మానవ నిర్మిత సింథటిక్ వ్యర్ధాలు కలిసి నదుల స్వయం శుద్ధి సామర్థ్యాన్ని మించిపోయాయి. అందుకే ఇటీవల కుంభమేళా సమయంలో కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన నీటి నమూనాల్లో హానికారక బ్యాక్టీరియా పరిమితికి మించిపోయి నీళ్లు ఏ రకంగానూ వాడడానికి పనికిరాని తేలింది. భారతీయులందరికీ గంగా నది స్నానం పవిత్రం. కానీ మనమే దానికున్న అద్భుత స్వయం శుద్ధి సామర్థ్యాన్ని మించి వ్యర్ధాలు కలిపి కలుషితం చేసాం. ఒక శాస్త్రీయ పరిశోధన, పథకం మాత్రమే ఈ కాలుష్యాన్ని తగ్గించి గంగకు ఉన్న అద్భుత స్వయం శుద్ధి సామర్థ్యాన్ని నిలబెట్టగలదు.

అనుసృజన — వి.రాహుల్జీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *