అరవింద్ గుప్తా

డా॥ వి.ఎన్.శిరోద్కర్ పేరు ప్రపంచమంతా “శిరోద్కర్ కుట్టు” కనుగొన్న వ్యక్తిగా ఖ్యాతి గాంచింది. సర్జన్ ఆయన మహిళల వ్యాధుల చికిత్సకు ఎంతో దోహదం చేశారు. విఠల్ నగేశ్ శిరోద్కర్ 1899లో గోవాలోని శిరోదా గ్రామంలో జన్మించారు. గ్రామం పేరు మీదనే వారికి ఆ ఇంటి పేరు సంక్రమించింది. హుబ్లీలో విద్యను అభ్యసించి ముంబయిలోని గ్రాంట్ వైద్య కళాశాలలో చేరారు. 1923లో ఎం.బి.బి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గర్భధారణ, ప్రసూతి శాస్త్రంలో స్పెషలైజేషన్తో ముంబయి విశ్వవిద్యాలయం నుంచి 1927లో యం.డి. పొందారు. ఉన్నత విద్యకోసం ఇంగ్లాండు వెళ్ళారు. అక్కడ పనిచెయ్యటం ఆయనకు ఎంతగానో తోడ్పడింది. ఆధునిక శస్త్ర చికిత్స విధానాలను అక్కడ నేర్చుకున్నారు. ఎందరో ప్రముఖ వైద్యులను, శాస్త్రజ్ఞులను కలుసుకున్నారు. 1931లో ఎఫ్ ఆర్ సి ఎస్ (ఇంగ్లాండు) పొందారు. ముంబయిలో జె.జె. ఆసుపత్రులకు గర్భధారణ, స్త్రీల వ్యాధులలో గౌరవ ఆచార్యులుగా నియుక్తులయ్యారు.

జె.జె. ఆసుపత్రి చాలా విశిష్టమైనది. 4,000 పడకలతో ప్రపంచంలోని పెద్ద ఆసుపత్రులలో అది ఒకటి. 1,500 పట్టా స్థాయి, 650 పిజి స్థాయి విద్యార్థులు ఉంటారు. అది ఆసియాలో ఆధునిక విద్యకు 175 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాచీన విద్యా సంస్థ.

ఇదే సంస్థలో చారిత్రక ఖ్యాతి గాంచిన రాబర్ట్ కాచ్ పనిచేశారు, క్షయవ్యాధి మీద చేసిన పరిశోధనలకి అతనికి నోబెల్ పురస్కారం లభించింది.

మామూలు గర్భసంచిలో గర్భాశయ ముఖ కండరం మూసుకుని ఉంటుంది. బలహీన గర్భాశయంలో గర్భాశయ ముఖద్వారం తెరుచుకుని ఉంటుంది. 1955లో డా॥ శిరోద్కర్ గర్భాశయ ముఖానికి శస్త్ర చికిత్స గురించి వివరించారు. ఇది కాల పరీక్షకు నిలబడి ఈనాటికీ దీనిని పాటిస్తున్నారు. గర్భాశయ లోపాలను ముఖంలోని సరిచేయడానికి ప్రత్యేకమైన పరికరాలను రూపొందించారు. దీనికి చాలా మార్పులు చేశారు కానీ అసలు శస్త్ర చికిత్స ఇప్పటికీ అద్వితీయంగా నిలిచి ఉంది.

1951లో పారిస్ లోనూ, 1956లో నేపుల్స్ లోనూ జరిగిన అంతర్జాతీయ సమావేశాలలో తన శస్త్ర చికిత్స గురించి వివరించారు. ఒక హాలీవుడ్ తారకి ఈ పద్ధతితో శస్త్ర చికిత్స సఫలం కావడంతో అతడి ఇటాలియన్ బంధం మరింత బలపడింది. అన్ని రకాల గర్భస్రావాలకు తన శస్త్ర చికిత్స పని చేయదని తెలుసుకోగల సునిశిత బుద్ధి ఆయనది. ఎటువంటి పరిస్థితుల్లో తన శస్త్ర చికిత్స ఉపయోగపడే అవకాశముందో, ఎటువంటి వాటిలో ఉపయోగపడదో స్పష్టంగా విశదీకరించారు. సామాన్యంగా అనిపించే ప్రతిదానిని ప్రశ్నించే తత్వం కలిగిన డా॥ శిరోద్కర్ కు శస్త్ర చికిత్స, దాని వెనక ఉన్న ఆలోచన తట్టి ఉండొచ్చు. ఈ శస్త్ర చికిత్సపై రాసిన పత్రానికి పీఠికలో ఇలా పేర్కొన్నారు, “గురువులందరికీ తగిన గౌరవంతో, పరిపూర్ణం కాని శస్త్ర చికిత్స పద్ధతుల పట్ల నేను సంతృప్తుడిని కాలేదు. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న పద్ధతులను మెరుగు పరచడానికి నాకు ఉపాయాలు తడుతూ ఉండేవి.”

1951 జూన్ లో ఫ్రెంచి గైనకాలజీ సంఘ రజతోత్సవ ఉత్సవాల్లో, గర్భాశయ ముఖం చుట్టూ మూడు వరసల కాట్ట్న పెట్టడానికి శస్త్ర చికిత్స చేసే విధానాన్ని చిత్రంగా చూపించారు. ఆ తరువాత కరిగే గుణం ఉన్న కాటట్ ఇందుకు సరైనది కాదని గమనించారు. ఈ పద్ధతిని మార్చి 4-6 నెలల్లో అకారణంగా జరిగే గర్భస్రావాలకు తొడ నుంచి తీసిన నారపట్టి (ఫాసియా లాటా) లినెన్లు ఉపయోగించే శస్త్ర చికిత్సను రూపొందించారు. దీనినే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా “శిరోద్కర్ శస్త్ర చికిత్స”గా పిలుస్తున్నారు. ఇందుకు రాబోయే తరాలు ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటాయి. “Contributions to Obstetrics and Gynecology” వ్యాసాన్ని ప్రచురించారు. 1963, తిరిగి 1970లో మైగ్స్, స్టర్జిస్ రాసిన “Progress in Gynecology” IV, V “బలహీన గర్భాశయ ముఖం మీద ఒక అధ్యాయాన్ని రాశారు. 1967లో మార్కస్ & మార్కస్ రాసిన “Advances in Obstetrics and Gynecology” లోని “A New Approach to the Understanding of the Anatomy and Treatment of Uterine Prolapse” అనే అధ్యాయంలో శిరోద్కర్ అభిప్రాయాలను పొందుపరిచారు. గర్భ నిరోధానికి లేదా సంతతి నిరోధానికి ఆయన గర్భాశయ ముఖం పైన ముసుగు పెట్టే పద్ధతిని వివరించారు.

1971 మార్చి 7న ప్రొఫెసర్ శిరోద్కర్ ముంబయిలో మరణించారు. ఆయన తల్లి గర్భాశయ ముఖ క్యాన్సర్ తో మరణించారు. డా॥ శిరోద్కర్ కొడుకు మనోహర్ శిరోద్కర్ ఈ వ్యాధికి ఉన్న వైరల్ కారణాలపై పరిశోధనలు జరిపారు. మొదట్లో ఆయన జాన్ హాప్కిన్స్ ప్రజారోగ్య కళాశాలలో పని చేశారు. క్యాన్సర్ ని కలగచేసే “రౌస్ సర్కోమా” వైరస్ (మొట్టమొదటగా కనుగొన్న క్యాన్సర్ వైరస్) గురించి పరీక్షలు జరిపారు. తరవాత ఆయన పూనాలోని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వైరస్ పరిశోధనా కేంద్రంలో పని చేశారు.

యువకునిగా ఉన్నప్పుడు మనోహర్ శిరోద్కర్, ప్రఖ్యాతిగాంచిన తన తండ్రి పట్ల ఆరాధన ఉన్నప్పటికీ, వైద్య విద్య పట్ల ఆసక్తి చూపలేదు. 1976లో, మనోహర్, ఆయన భార్య సుధ డా॥వి.ఎన్. శిరోద్కర్ జ్ఞాపక పరిశోధన ఫౌండేషన్ ని స్థాపించారు. ఈ సంస్థ మనోహర్ శిరోద్కర్, ఆయన తండ్రి కన్న కలలకు రూపాన్ని ఇచ్చింది. ఈ సంస్థ అట్టడుగు వర్గాల యువతుల్లో గర్భాశయముఖ క్యాన్సర్ పరీక్షలు జరుపుతుంది. వైరల్ వ్యాధులను నయం చేయడానికి కొత్త జైవిక ఏజెంట్లపై పరిశోధనలు చేస్తుంది. విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండటమే కాకుండా, ప్రొ. వి.ఎన్. శిరోద్కర్ విస్తృతంగా రాసేవారు. సాంఘిక వైద్యంలో ఆసక్తి కనపరిచేవారు. గర్భస్రావాలకు సంబంధించిన శాంతీలాల్ షా కమిటీలో ఆయన సభ్యులు. భారత దేశంలో కుటుంబ నియంత్రణ సంస్థను స్థాపించారు.

1971లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *