సంపాదకీయం

వృత్తాసుర సంహారం కోసం దేవతల కంసాలి త్వష్ట ఇంద్రుడికి వజ్రాయుధం తయారు చేసి ఇచ్చాడట. దీంతో ఆ ఆర్య యోధుడికి ఎదురులేకుండా పోయిందట. ఒంటి చేత్తో శత్రు స్థావరాలను కకావికలం చేసాడట. ఫలితంగా ఇంద్రాధిపత్యం శాశ్వతంగా దఖలు పడిపోయిందట! ఇది పురాణం.

ఆశ్చర్యం ఏమంటే ఆధునిక యుగంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతికి ఒక వజ్రాయుధం చిక్కింది. కాకుంటే ఇప్పుడాయనకు పురాతత్వ శాస్త్ర వేత్తలు నేల పొరల్నండి తవ్వితీసి దాన్నందించారు. దీన్నీ ఆధునిక దేవేంద్రుడు ఒంటిచేత్తో పట్టుకొని ఇప్పటి దాకా రాజ్యమేలిన ఉత్తర భారతపు ప్రాచీన నాగరికతా చరిత్ర కథనాలన్నిటినీ కకావికలం చేస్తున్నాడు. పురానాగరికతలో తమిళనాడు ఆధిపత్యం నిర్ద్వంద్వంగా దఖలు పడిపోయినట్టేనని సవాలు చేసి మరీ చెబుతున్నాడు!

ఇంతకూ త్వష్ట చేసిన వజ్రాయుధం ఏమిటి ? అంటే ‘అదొక ఇనుపముళ్ల గద ‘ అంటాడు రాంభట్ల కృష్ణమూర్తి! ఎంత మొరటుదైనా ఇనుప ఆయుధాన్ని తొలుత చేజిక్కించుకున్న ఇంద్రుడు అనార్యులు ఎంతో శ్రమపడి మట్టీ కర్రా కంపలతో కట్టుకొన్న ఆనకట్టలను ధ్వంసం చేయడమే వృత్రాసుర సంహారమని ఆయన వ్యాఖ్యానం .

ఇప్పుడు సరిగ్గా స్టాలిన్ కి చిక్కిన ఆయుధం కూడా ఈ ఇనుముదే కావడం ఆశ్చర్యకరం! అదే తమిళనాడులోని ఆడిచ్చనలూరు, శివగలై, కిల్నిమండి, మంగడు, తెలుంగనూర్ల, మాయిలదుంపరైలల్లో క్రీస్తు పూర్వం 2953- 3345 నాటికే (5300 ఏళ్ళ క్రితమే) ఇనుప పరికరాలు పరిశ్రమ స్థాయిలో భారీగా ఉత్పత్తి అయినట్టు ఇటీవల పురావస్తు శాఖ తేల్చి స్టాలిన్ చేతికిచ్చిన ఆధునిక వజ్రాయుధం. దీంతో సరికొత్త “అయో”మయ రాజకీయం తెర మీదికొచ్చింది.

నేటి దాకా మనం సింధూనాగరికతే భారతదేశంలోని మొదటి పట్టణ నాగరికతగా భావిస్తున్నాం. దానికి వెయ్యేళ్ల తర్వాత మాత్రమే (క్రీస్తు పూర్వం 700 -300) ఇనుము యుగం మొదలై ప్రాదేశిక రాజ్యాలు, భారీ నగరాలు ఏర్పడి కొత్త నాగరికత వెలిసిందనుకొంటున్నాం. మౌర్య సామ్రాజ్యాన్ని దీనికి ఆనవాలుగా చూపుతున్నాం. ఇప్పుడిదంతా తల్లకిందులు కాబోతోంది!

వాస్తవానికి రాగి కన్నా ఇనుప ఖనిజమే విస్తారంగా లభిస్తుంది. కానీ దాన్ని కరిగించి. పరికరాలు చేయటం క్లిష్టమైన సాంకేతికతో కూడిన పని. దీనికి 1200 -1400 డిగ్రీల నిలకడైన ఉష్ణోగ్రత కావాలి. అందుకు తగ్గ కొలిమి వుండాలి. తగినంత ఆక్సిజన్ అందించడానికి తోలుతిత్తి కావాలి. గాలివాటం చూసుకోవాలి. మొదట తీవ్రంగా కరిగించి తర్వాత మెల్లగా చల్లబరచాలి. ఇనుప ఖనిజం కూడా నాణ్యమైనదై వుండాలి. ఇందు వల్లే రాగి కన్నా ఇనుమును కరిగించడం మనిషికి చాలా కాలం తర్వాత గానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు తమిళనాడు పురావస్తు శాఖ రాగియుగం రాకుండానే అక్కడ ఇనుము యుగం వచ్చిందంటోంది. గార్డెన్ చైల్డ్ చేసిన చారిత్రక యుగవిభజనను తారుమారు చేస్తోంది!

ఇనుమును భారీ ఎత్తున వాడడం అంటే మానవేతిహాసంలో అది నిప్పును స్వాధీనం చేసుకొన్నంత మహా సంఘటన. నాగలికి ఏ లోహపు కర్రు వుందనే దాన్నిబట్టి ఆ రోజుల్లో అశ్మ, అయసీ, కాంచ పురాలని వ్యవసాయ క్షేత్రాలకు పేర్లు పెట్టేవారు. ఇనుప కర్రు నాగలికి చేరి, కొడవలి గొడ్డలి లాంటివి చేతికందగానే వ్యవసాయం ఊహాతీతంగా విస్తరించింది. చేతివృత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. వాణిజ్యం కొత్త పుంతలు తొక్కింది. మహా నగరాలు వెలిశాయి. విశాల సామ్రాజ్యాలు పుట్టుకొచ్చాయి. చక్రవర్తులు అవతరించారు. మత విప్లవాలు తోసుకొచ్చాయి. ఇనుముకు ముందు, తర్వాత అన్నట్టు చరిత్ర విడిపోయింది. ఇదంతా గంగా మైదానంలో కాదు వైగై, కావేరీ తీరాల్లోనే మొదట జరిగిందని సవాలు చేస్తున్నాడు స్టాలిన్ !

ఇనుము ప్రాచీనతపై పరిశోధనలు, వాదోపవాదాలు ఇప్పటివేం కాదు. ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితమైనవీ కావు. క్రీస్తుపూర్వం మొదటి సహస్రాబ్దిలో ఆసియా మైనర్లో మొదట ఇనుము పోత పోసారని చరిత్రకారులన్నారు. తర్వాత దాన్ని రెండో సహస్రాబ్దికి నెట్టారు. కొందరు హరప్పాలోను ఇనుము ఆనవాళ్ళను వెతికారు. గంగావ్యాలీ మల్హర్ లోనూ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోనూ క్రీస్తు పూర్వం 1800 నాటికే ఇనుప పరికరాలు బయటపడ్డ దాఖలాలున్నాయి. కర్ణాటకలోని హల్లూరు, కుమారహళ్లి కూడా కొంతకాలం ఈ పోటీల్లో ముందు నిలబడ్డాయి. తర్వాత వీటన్నింటినీ వెనక్కు నెట్టి మన గచ్చిబౌలి, బ్రహ్మపురి క్రీస్తుపూర్వం 2200 -1940 నాటికే తాము ఇనుము యుగంలోకి ప్రవేశించినట్టు చెప్పుకున్నాయి. ఇక ప్రాచీన అనటోలియాలో హిట్టైట్ కాలం నాటికే ఇనుప పరికరాలు లభించాయన్న వాదం ఎప్పటినుంచో వుండనే వుంది. ఎవరు ఏం చెప్పినా ఒక నూతన యుగావిష్కరణ చేయగల స్థాయికి ఇనుము వాడకం చేరుకోవడం క్రీస్తు పూర్వం 12 -11 శతాబ్దాల నాటికంటే వెనక జరగలేదని ఇప్పటి దాకా పరిశోధకులంతా అభిప్రాయపడుతూ వచ్చారు. కొత్తగా నేడు తమిళనాడు దీన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోంది.

దీని కోసం ఆ రాష్ట్రమేమీ తక్కువ శ్రమించలేదు. ఏబై ఏళ్లుగా విస్తారంగా తవ్వకాలు జరిపింది. కేంబ్రిడ్జి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్ని రంగంలోకి దించింది. రేడియో కార్బన్ 14 పరీక్ష కోసం ప్రపంచ ప్రఖ్యాత ‘డేటా అనలటిక్’ ప్రయోగశాలను ఆశ్రయించి, High Probability Density Range ( HPD) పరిజ్ఞానాన్ని వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాయజ్ఞానికి కావలసిన నిధుల్నేగాదు, రాజకీయ మద్దతునీ పుష్కలంగా అందించింది. చివరకు పురావస్తు శాఖ రూపొందించిన Antiquity of Iron బ్రోచర్ ను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విడుదల చేసారు. అక్కడితో ఆగక పరిశోధకులు వెల్లడించాల్సిన అన్వేషణా ఫలితాల్ని తానే వెల్లడి చేసి, తమ సరికొత్త వజ్రాయుధం ఉత్తర భారత జాతీయవాద రాజకీయ ఆయుధాలన్నిటిని ఎలా తుత్తునియలు చేస్తుందో ప్రకటించకనే ప్రకటించారు. అంటే ఇప్పుడు వజ్రాయుధం అనార్యుల చేతికి చిక్కిందన్న మాట. ఆర్యులు కాచుకోవల్సిన వాళ్లయ్యారన్న మాట!

 శాస్త్రం శాస్త్రంగా వికసించాలనీ, సత్యం సత్యంగా భాసిల్లాలనీ, రుజువు అంతిమ నిర్ణాయకం కావాలనీ మనం కోరుకుంటాం. అదే సందర్భంలో నూతన రుజువులు లభించినప్పుడు, నూతన సత్యావిష్కరణ జరిగినప్పుడు వాటిని తటపటాయింపులు లేకుండా, భేషజాలకు పోకుండా స్వీకరించడం ఉన్నత మానవ సమాజ లక్షణమని కూడా మనం నమ్ముతున్నాం.

కానీ సమాజం నిట్టనిలువునా రెండుగా విభక్తమైనప్పుడు, దీనికి తోడు జాత్యహంకార ద్వేషాలు జడలు విప్పుతునప్పుడు ఎవరి వజ్రాయుధాలు వారు వెతుక్కొంటారు. శాస్త్రాన్ని సైతం శస్త్రంగా మార్చుకొంటారు. ఎవరికి వారు చరిత్రను తమ చుట్టూ తిప్పుకుంటారు.

శాస్త్ర ప్రియులముగా మనమే ఇలాంటి “అయో”మయ రాజకీయాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాల్సింది! సత్యం పక్షాన నికరంగా నిలబడాల్సింది!!

One thought on ““అయో”మయ రాజకీయాలు !

  1. అయో మయ రాజకీయాలు
    సంపాదకీయం బాగుంది.
    సైన్స్ లో పరిణామ క్రమం లాగ కొత్త విషయాలు కనిపిస్తే ముందరికి పోవడం లాగా, నాగరికత బయటపడిన తర్వాత దానికంటే ముందున్న నాగరికత బయట పడడం మానవ సమాజ వికాసం ముందు గానే జరిగిందన్న విషయాన్ని బాగా వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *