– మిఠాయి యుగంధర్ బాబు

అది జార్ఖండ్ లోని పాలెం జిల్లా దగ్గర హైదర్ నగర్. మిట్ట మధ్యాహ్నం మంచి ఎర్రటి ఎండలో ఎర్రటి పిడకల మంట.. ఆ మంటలో ఎవరో కొబ్బరికాయలు, బియ్యం వేశారు. మంట పైకి ఎగసింది. కొంచెం దూరంలో నల్ల మేకకు ఎర్రటి బొట్టు పెడుతున్నారు. కొందరు ఓ మహిళ శరీరాన్ని దారంతో గట్టిగా చుడుతున్నారు. అక్కడ ఓ మాంత్రికుడు మంత్రాలు పటిస్తూ అన్నంలో మాంసం కలుపు తున్నాడు. ఆయన ముందర ఓ క్యూ, ఆ క్యు లైనులో మహిళలు కొందరు కోడి పిల్లలను పట్టుకొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.

అక్కడికి వచ్చిన చాలామంది తమ శరీరంలో ‘దెయ్యం ప్రవేశించింది’ అని నమ్మి వచ్చిన వారు. ఆ దెయ్యాన్ని వదిలించుకోవడానికి వారు అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ తతంగమంతా “భూత్ మేళా” అంటారు. ఓ మాంత్రికుడు నృత్యం చేస్తూ (గంతులు వేస్తూ ) ఏదో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. శిష్యులు అతనికి ఓ పావురం ఇచ్చాడు. ఆ పావురాన్ని నాలుగు చోట్ల గట్టిగా గుచ్చి ఎగిరేసాడు. ఆ పావురం గిలగల కొట్టుకుంటూ ఎగిరిపోయింది. అంతే “నీలో దెయ్యం పావురం గుండా వెళ్లిపోయిందని” ఎదురుగా ఉన్న మహిళలను నమ్మించాడు. అతనికి కావాల్సిన ముడుపులు ముట్టాయి.

జార్ఖండ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం దయ్యం పట్టిన వాళ్ళు, చేతబడి చేస్తున్నారని అపవాదు ఎదుర్కొని చంపబడిన వారు గత 7 ఏళ్లలో 231 మంది. అందులో మహిళలే ఎక్కువ.

ఇది ఒక్క జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రమే కాదు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న తంతే.

తెలుగు రాష్ట్రాలలో అనేక ఆంజనేయ దేవాలయాల్లో ఆదివారం పూట… అమావాస్య రోజున ఈ తతంగం జరగడం మీరు గమనించే ఉంటారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, గట్టిగా ఏడుస్తూ, తల కొట్టుకుంటూ, గట్టిగా నవ్వుతూ… ఎక్కువగా స్త్రీలు కనిపిస్తూ ఉంటారు. ఓ మంత్ర గాడు లేక పూజారి చింతబరికెలు తీసుకుని దయ్యం పట్టిన (అని భావిస్తున్న) వ్యక్తిని కొడుతూ “వదులుతావా లేదా వదులుతావా లేదా… నీలాంటి దయ్యాన్ని, మీ తాతను, నీ తల్లోని జేజమ్మను కూడా వదిలిస్తా. నువ్వెంత? అని ఇంకా ఎక్కువగా కొడుతూ ఉంటే ఆ వ్యక్తి దెబ్బలకు తట్టుకోలేక పోతున్నా.. పోతున్నా.. ఇతని/ఈమెను వదిలేసి పోతున్నా.. ఇక మళ్ళీ ఎవరిని పట్టను” అని ఆ దెయ్యం పోతున్నట్టు ఓ దృశ్యాన్ని సృష్టిస్తారు.

 “దెబ్బకు దెయ్యం దిగి వచ్చింది” సామెత ఊరకే రాలేదు. పై తతంగాల వల్లనే ఏర్పడింది. అనేక సినిమాల్లో, పాత సినిమాల్లో ముఖ్యంగా ఇలాంటి సీన్లు మీరు చూసే ఉంటారు. సందర్భోచితంగా అక్కడ ఒక పాట కూడా పెడతారు. అసలు దయ్యాన్ని మనిషికి పరిచయం చేసింది సాటి మనిషే. మనతో పాటు ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలు దెయ్యం గురించి భయం కలిగించే విధంగా కథలు కథలుగా చెబుతారు. మనం వాటి పట్ల భయం ఏర్పరచు కుంటాం. హర్రర్ సినిమాలు, సీరియల్స్, పుస్తకాలు, కథలు కల్పనలు, సినిమాల్లో వర్ణణలు చిన్నప్పటి నుంచి విని, దెయ్యం గురించి ఓ వ్యతిరేక భావన…. భయంతో ఉంటాము.

చింతచెట్టు దగ్గర ఎవరో చనిపోయి దెయ్యంగా మారి, వచ్చే వారిని పోయే వారిని భయపెడుతున్నట్లు ఎవరో తెలిసిన వాళ్ళు మనకు కొత్తగా చెప్పినప్పటి నుంచి ఆ చెట్టు చెంతకు పోవాలంటే భయపడతాము. భయం కంటే గిలి ఎక్కువ. అసలు ఈ దెయ్యం భావన ఎలా ఏర్పడిందో గమనిద్దాం.

వ్యవసాయం తెలియనప్పుడు భూమి దున్న బడలేదు. భూమిలో పదార్థాలు చెక్కుచెదరకుండా ఉండేవి. గాలులు వేగంగా వచ్చినప్పుడు అవి నేలను తొలిచి అక్కడ ఓ గొయ్యి ఏర్పడేది. నేల లోపల మరుగులో దాగున్న భాస్వరము (Phosphorus) బయటపడి నిప్పు రాజుకొని గాలితో పాటు మండిపోయేది (భాస్వరము గాలితో చేరితే వెంటనే మండి పోతుంది, అందుకే దాన్ని సీసాలో నీటిలో నిలువ చేస్తారు). మండుతున్న ఆ నిప్పును చూసి ఆదిమ మానవులు దానిని “కొరివి దెయ్యం” అని భావించి పరుగులు తీశారు. ఆ కాలంలో ఈ కొరివి దెయ్యాలు ప్రజలను విపరీతంగా భయపెట్టేది.

(ఇదే కొరివి దెయ్యంతో మా జిల్లాలో ఓ పల్లెలో దెయ్యం తిరుగుతోందని, రాత్రిపూట గడ్డివాములు వాటంతట అవే తగలబడి పోతున్నాయని ప్రచారం జరిగింది. ఊరి వాళ్లంతా దెయ్యానికి… కొరివి దెయ్యానికి భయపడి ఊరు వదిలి పోవడానికి సమాయత్తం అయ్యారు… అసలు విషయం చివరికి తెలిసింది ఏమంటే, ఓ పెద్దమనిషి తన స్వార్థం కోసం తన ప్రత్యర్థి గడ్డివాములు కాల్చడానికి భాస్వరం ఉపయోగించి మంటలు పుట్టించి అలా ప్రజలందని భయభ్రాంతులను చేశాడని నిరూపితమైంది).

ఇలా కొరివి దెయ్యం తో ప్రారంభమై రకరకాల దెయ్యాలు… రకరకాల రూపాలతో….. రకరకాల పేర్లతో మానవుని భ్రమల్లో తిష్ట వేసుకున్నాయి. వీటిని సంతృప్తి పరిచేందుకు అనేక రకాలైన బలులు ఇచ్చేవాళ్లు. వాటికోసం రకరకాల మాంత్రికులు, రకరకాల మంత్రాలు పుట్టుకొచ్చాయి. వాళ్లు దెయ్యానికి నలుపు రూపం ఇచ్చుకున్నారు. రాత్రి వేళల్లో “చీకటి (దెయ్యం)” వారిని భయపెట్టింది. దేనినో చూసి దెయ్యమని భయపడి నరాల బలహీనతకు గురయ్యే వారు. (దీనిని హిస్టీరియా వ్యాధి అంటాము).. భయంతో గుండె ఆగిపోవడం కూడా జరిగేది. అయితే దెయ్యం కొట్టి అతడు చనిపోయాడు అని భావించేవారు.

దాదాపు 120 సంవత్సరాల ముందే కందుకూరి వీరేశలింగం గారు తన స్వీయ చరిత్రలో ఇలా చెబుతారు…
“ఆ కాలము నందు ఎల్లవారికిని దయ్యములందలి విశ్వాసము అత్యధికము. స్త్రీలలో ఒకప్పుడు దయ్యం పట్టని వారు ఎక్కడనో కానీ లేక ఉండిరి. ఎవరికీ ఏ వ్యాధి వచ్చినను వైద్యుని ఇంటికి మారుగా ముందుగా భూత వైద్యుని ఇంటికో, సోది చెప్పు వారి ఇంటికో పరిగెత్తుతూ ఉండిరి. ఏ ఇంట ఏ పురుషుడు మరణము చెందినను దెయ్యమై తిరుగు చుండునని ఎల్లరూ నమ్ముచుండిరి”.

ఇలా అందరూ నమ్మడమే కాదు… వీరేశలింగం గారి తల్లి గారు కూడా ‘తనకు దెయ్యం పట్టినదని ఎప్పుడు భావించేవారు’. అందువల్ల ఎందరో భూత వైద్యులు వచ్చి వైద్యం చేసేవాళ్లు. మొదట్లో వీరేశలింగం గారు కూడా వీటిని నమ్మేవారు. కానీ రాను రాను ఎలాంటి ఫలితం లేకపోవడం, మంత్రగాళ్లు చేసే మోసాలను గమనించారు. తనకు దెయ్యం చూపమని ఎందరో భూత వైద్యుల్ని వేడుకున్నాడు. ఒక్కరు కూడా చూపలేక పోయారు. వీరేశలింగం గారు తనే దెయ్యాన్ని చూడాలని ఎన్నోసార్లు రాత్రిపూట స్మశానాలకు ఒంటరిగా వెళ్లి చూశాడు. కానీ ఒక్క రోజైనా ఒక దెయ్యం కూడా ఆయనకు కనిపించలేదు. చివరకు దయ్యాలు లేవని ఆయన గట్టిగా నమ్మాడు(అదే కదా నిజం). ఇతరులు చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మక మనము అనుభవంతో తెలుసుకోవాలని ఆయన గట్టిగా చెప్పాడు.

మానవుడు అవసరం, స్వార్థం, బలహీనత, మనుగడ కోసం, ఆధిపత్యం కోసం దెయ్యాన్ని సృష్టించాడు. దెయ్యం పట్టడం అనేది ఒక “మానసిక రుగ్మత”…. హిస్టీరియా అంటారు. తీరని కోరికలు…. అంటే పిల్లలు పుట్టకపోవడం, పెళ్లి ఆలస్యం కావడం, చాలా పెద్ద ఇంట్లో చాలాకాలం ఒంటరిగా ఉండడం, వత్తిడి జీవనం, ఆధ్యాత్మిక చింతన, చెప్పుడు మాటలు సునాయాసంగా నమ్మేవారు… ఆచరించేవారు, మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు, బిడియస్తులు, ఒంటరితనం ఇష్టపడేవారు, ఇష్టమైన వారు ఆకస్మికంగా దూరం కావడం, వదిలి వెళ్ళడం ఇలాంటి కారణాలవల్ల హిస్టీరియా ప్రవర్తన ఉంటుంది. వీరి ప్రవర్తన ఒక్కోసారి అసాధారణంగా ఉంటుంది… దానిని దెయ్యం పట్టింది అనుకుంటాము.

ఇలా దయ్యాలు పట్టడం, దెయ్యాలు వదిలించడం అన్ని మతాల్లోనూ ఉన్నాయి. అనేక హార్రర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాయి. “ద ఎగ్జార్సిస్ట్”, “ఓమన్ 666”, “ఈవిల్ డెడ్” ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలు ఒంటరిగా థియేటర్లో చూస్తే ప్రైజ్ మనీ ఇస్తామని కూడా ప్రచారం చేసుకున్నారు. దెయ్యంపై తెలుగులో, హిందీలో సినిమాలు కోకొల్లలు. ఈ సినిమాల్లో అన్నీ ఆడ దెయ్యాలే. వాటికి యూనిఫామ్ కూడా ఉంటుంది. జుట్టు పొడవుగా నిగ నిగ లాడుతూ ఉంటుంది (ఏ షాంపూ వాడతాయో మనకు తెలియదు), తెల్లటి చీర… కాళ్ళకు ఘల్ ఘల్ మని గజ్జలు… ఎప్పుడు పాటలు పాడుతూ అలా తిరుగుతూ ఉంటాయి.

హిస్టీరియాతో విపరీతంగా ప్రవర్తించే వారికి దెయ్యం పట్టింది అని భావించి, ఆ వ్యక్తిని శిక్షిస్తే ఆ దెబ్బలు తట్టుకోలేక దెయ్యం పారిపోతుందని ఓ మూడు నమ్మకం. అంతేగాని దెయ్యం పట్టిందని చెప్తున్న ఆ వ్యక్తిని ఓ మానసిక వైద్యునికి చూపించరు. నిరక్షరాస్యత, చెప్పుడు మాటలు, మూఢనమ్మకాలు వీటన్నిటికీ కారణాలు.

హిస్టీరియా గురించి మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ 1886 లో చాలా చక్కగా వివరించారు. “స్టడీస్ ఆన్ హిస్టీరియా” అనే పుస్తకంలో హిస్టీరియాకు కారణము లైంగికత అని, ఇది మానసిక సంఘర్షణల నుండి శారీరక లక్షణాలుగా మారుతుందని ఆయన ప్రతిపాదించాడు. తన చికిత్సలో రోగుల నుండి ఈ భావనలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీనిని సైకో అనాలసిస్ అంటారు.

దెయ్యం పట్టినట్టు భావించే వారికి మానసిక చికిత్సే అసలైన చికిత్స. కానీ ప్రజలు హిస్టీరియా కోసం వైద్యుడు దగ్గర వెళ్తే పిచ్చి పట్టినట్టు అనుకుంటారని భయం. చదువు లేకపోవడం, మూఢనమ్మకాలు, సమాజం పట్ల భయాలు, దాస్య భావజాలం… వీటన్నిటి వల్ల మహిళలే ఈ రుగ్మతలతో ఎక్కువగా బాధ పడుతున్నారు. అందుకే మహిళలు చదువుకోవాలి చదువు ఒక్కటే వీటన్నిటికీ పరిష్కారం.

చివరగా చెప్పేదేమంటే దెయ్యాలు పూనడం,
దెయ్యాలు పట్టడం అంతా వట్టి బూటకాలు అసలు దయ్యాలు లేవు. ఉంటేగా….
లేని దయ్యాలు ఉన్న మనుషుల్ని ఎప్పటికీ పట్టవు… పీడించవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *