“రాజేశ్వరి అలా తాకడానికి వీలు లేకుండా దూరంగా ఎందుకు ఉండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిది ఏముంది ? ప్రకృతి సిద్ధంగా, స్త్రీకి ఎంతో సహజమైన ఈ ‘ఋతు కార్యక్రమం’ ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అని నలుగురికి చాటి చెప్పడం ఏం బాగుంది ? … ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు ?”

          ఈ వాక్యాలు 45 ఏళ్ల ముందు యువ మాస పత్రికలో ధారావాహికంగా వచ్చిన “మీనా” అనే నవల (దరిమిలా సినిమాగా కూడా వచ్చింది) లోనిది. రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారు మహిళను బహిష్టు సమయంలో ఇంటి బయట కూర్చోపెట్టడం గురించి ఆక్షేపిస్తూ రాశారు. అప్పుడే కాదు 45 ఏళ్లు గడిచిన తర్వాత కూడా, ఇప్పుడు కూడా ఇంకా మన సమాజంలో బహిష్టు (నెలసరి, రుతుస్రావం) సమయంలో మహిళల పైన అతి దారుణమైన వివక్ష జరుగుతోంది.

          నెలసరి సమయంలో మహిళలను ఇంటి పనులకు, పూజలకు దూరంగా ఉంచే ఆచారం గురించి మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. దీన్ని సమర్ధించే వాళ్ళు ‘ఇది ఆమె కోసమే’ అని, ఆమెకు రెస్ట్ కావాలని, హైజెనిక్ గా ఉండాలని, ఏవేవో కబుర్లు చెబుతారు. ఎన్ని చెప్పినా ఇవన్నీ ఆమె వ్యక్తిగతం కదా. మనమెందుకు ఆంక్షలు విధించాలి. ఇది ఇళ్లల్లో విషయమైతే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కొన్ని గ్రామాలలో రుతుస్రావం లో ఉన్న మహిళలను ఏకంగా ఊరికే దూరం పెడుతున్నారు.

          అనంతపురం జిల్లా రోళ్ల మండలం గంత గొల్ల హట్టి గ్రామంలో జరుగుతున్న వింత ఆచారంపై కథనాలను బిబిసి 2018లో ప్రచురించింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఊరినాయన పల్లి, ఊరి నాయని కొత్తూరు, పాళ్యం, సల్లార్లపల్లి తో పాటు తమిళనాడులోని ఏకలనత్తం గ్రామాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. మహిళలను నెలసరి సమయంలో ఊరికి దూరంగా, ఆరుబయలు లో ఉండాలనే ఆచారాన్ని వీళ్ళు పాటిస్తున్నారు. పొలాల దగ్గర రాళ్ల లో పుట్టల్లో ఇంటి దూరంగా గడపాలి. అక్కడే వండుకోవాలి. అక్కడే తినాలి. ఎండైనా, వానైనా, గాలొచ్చినా…. తార్పాల్ పట్టలతో తలదాచుకొని నాలుగో రోజు మాత్రమే ఇంటికి రావాలి. బాలింతలు పాలిచ్చే పిల్లలతో పాటు గడపాలి. రాత్రిపూట చలిలో బిక్కుబిక్కుమంటూ పాములకు భయపడి బతకాలి. ఇప్పుడు కొంతమందికి వాళ్ళకి ఊరు బయట బహిష్టు సమయంలో ఉండేందుకు పక్కా ఇల్లు కట్టించారు. ప్రపంచానికి తెలిసిన సంగతులు ఇలాంటివి కొన్ని మాత్రమే, తెలియని సంఘటనలు ఎన్నో. ఎంతో వివక్ష, ఎన్నో ఆంక్షలు.

          గతంలో ఆడపిల్లలకు 10 సంవత్సరాలు దాటకుండానే బాల్య వివాహం చేసేవాళ్ళు. ఎందుకంటే పెళ్లి కాకుండానే అమ్మాయి రసజ్వల అయితే ఆ పిల్ల తల్లిదండ్రులకు నరకంలో రజస్వల రక్తాన్ని తాగిస్తారని అపోహ. ఈ అపోహ మాని బాల్య వివాహాలు రద్దు చేయడానికి సమాజంలో చాలామంది సంస్కర్తలు పనిచేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలు కొంత వరకు చక్కబడ్డాయి.

          దీనితోపాటు మన ప్రవచన కారులు …బాలిక మొదటి సారి రజస్వల ఏ రోజు కావాలి? ఏ తిథిలో కావాలి? ఏ నక్షత్రంలో కావాలి ? అని నిర్దేశిస్తూ ఉంటారు. సహజ సిద్ధంగా జరిగే కార్యక్రమాన్ని కూడా వీళ్లు తిథులు, వారాలు నక్షత్రాల ఆంక్షలు పెడుతున్నారు. అలా కాకుండా వేరే రోజుల్లో రజస్వల అయితే అది దోషము.. దోష పరిహారార్థం మళ్ళీ శాంతులు, హోమాలు, పరిహారాలు….

          మగ పిల్లవాడు కూడా యుక్త వయసు వచ్చినాక శరీర మార్పులు వస్తుంది కదా.. గడ్డాలు మీసాలు వస్తాయి కదా… మరి దాని గురించి ఎలాంటి ఆంక్షలు ఉండవు.

          ముట్టు కావడం …రక్తస్రావం కావడం అన్నది బూతు అని మాట్లాడుకోగూడని విషయం అనీ.. అది తప్పు అని, మహిళలకు శాపమని రకరకాలుగా అనుకుంటారు. ముట్టు అయిన స్త్రీలు వంట చేస్తే, అది భర్త తింటే ఆ మహిళ నరకానికి పోతుందని చెబుతారు. ముట్టు గుడ్డలను ఉతికి ఆరేసుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఎండపడని చోట (పర పురుషులకు కంటపడని చోట) ఆరవేసి, అవి ఆరకుండా దానిద్వారా చర్మ వ్యాధులతో, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. పట్టణ మహిళలకు డిస్పోజబుల్ న్యాప్కిన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ పల్లెల్లో ఇవి అందుబాటులో లేవు. పాఠశాలలో ఆడపిల్లలకు ప్రభుత్వం సానిటరీ ఫ్యాట్స్ మెటీరియల్స్ సప్లై చేస్తోంది. పిల్లలే తయారు చేసుకోవడానికి తర్ఫీదు ఇప్పిస్తోంది. నేను విచారిస్తే చాలా చోట్ల ఇది సక్రమంగా జరగటం లేదు. అమ్మాయిలలో ఆత్మ నూన్యత అక్కడి నుంచే ప్రారంభమవుతోంది.

          ఈ న్యూనత నుండి ఆడపిల్లలు బయట పడాలని పంజాబ్ లో పాటియాలలో ఓ ప్రభుత్వ కళాశాలలో “నికిత ఆజాద్” అనే అమ్మాయి ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు. అదే *హ్యాపీ టూ బ్లీడ్* (#happy to bleed…ముట్టు అయినందుకు సంతోషించు). ఒకానొక గుడిలో మహిళల ప్రవేశం గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు ఆ గుడి ముఖ్య అధికారి “మహిళల పవిత్రతను (purity) కనిపెట్టే మిషన్ ఏదైనా కనుగొనేంతవరకు మహిళలకు మా గుడిలో ప్రవేశం లేదని” ఎగతాళిగా చెప్పాడాయన. ఈ ప్రకటనతో ఆగ్రహం చెంది, ముట్టు చుట్టూ మహిళలపై పేరుకుపోయిన వివక్షతను ఎదిరించడానికి నికిత ఈ “హ్యాపీ టు బ్లీడ్” 21.11.2015 న ప్రారంభించింది.

ఈ ఉద్యమం లో చాలామంది మహిళలు ఆనందంగా పాల్గొన్నారు. అనేక ప్లే కార్డ్స్ తో హ్యాపీ టూ బ్లీడ్ అని పోస్ట్ చేశారు. దేశమంతా ఈ అంశం గురించి బహిరంగంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. మహిళలు బహిష్టు గురించి సిగ్గుపడడం చాలా వరకు తగ్గింది. అయితే ఇదంతా పెద్ద పట్టణాలకే పరిమితం.

          ఇంకా ఎన్నో మూఢాచారాలు, నమ్మకాలు మన ఆరోగ్యం చుట్టూ వున్నాయి. ఒకవైపు మానవ మేధను దాటి కృత్రిమ మేధ ముందుకు వెళుతున్న సమయంలో ఇంకా ఇలాంటి నమ్మకాలు వాటితో వచ్చే వివక్ష ఉండటం అర్థరహితం. బహిష్టు ఒక సహజ శరీర ధర్మం అని దాని వెనుక వున్న శాస్త్రీయ కారణాలను వివరిస్తూ, బహిష్టు గురించి వున్న మూఢనమ్మకాలు, వాటివల్ల వచ్చే వివక్షలను రూపుమాపడం సైన్సు ఉద్యమ కార్యకర్తల లక్ష్యంగా ఉండాలి.

– యుగంధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *