రాహుల్జీ
భారత దేశపు వైవిధ్యం దాని భౌగోళిక స్వరూపంలో దాని సంప్రదాయం, సంస్కృతిలో మాత్రమే కాదు దాని తాత్విక ధోరణుల్లో కూడా వైవిధ్యం, భిన్నత్వం ఆ భిన్నత్వాన్ని అమోదిందించే సంప్రదాయం వుంది. ఇది ప్రాచీన కాలం నుంచే వుంది. ఇది భారతదేశపు ప్రత్యేకతా, బలం కూడా. భిన్న వాదాలను సమ్మతించే సంప్రదాయం మనకు మన పురాణాల్లో కనిపిస్తుంది. మన పురాణాల్లో చాలాసార్లు అసలు కథతో పాటు ఎన్నో పక్క కథలు వుంటుంటాయి. చాలాసార్లు ఆ ఉప కథలు అసలు కథలో చెప్పదలచుకున్న విషయాన్ని వాదం రూపం లో చెప్పడానికి ఉద్దేశించినవి అయ్యి వుంటాయి. దీనికి పెద్ద ఉదాహరణ మహాభారతంలోని భగవద్గీత. అది అర్జునుడు బంధువులను చంపడం సరైనదేనా అని కృష్ణుని ప్రశ్నించడంతో మొదలవుతుంది. భగవద్గీత మహాభారతంలో ఒక చిన్న సంఘటన. రెండు నైతిక స్థానాల గురించిన సంఘర్షణ. ఒకపక్క కృష్ణుడు చేయాల్సిన పనిని మంచిచెడులు ఆలోచించకుండా చేయమంటే ఒక మంచి కోసం జరిగే చెడు గురించి ఆలోచించే అర్జునుడి ప్రశ్నలోంచి పుట్టింది భగవద్గీత. ఇందులో కృష్ణుడి వాదన గెలుస్తుంది.భారతదేశంలో వాదోపవాదాల సంప్రదాయానికి ఇది పెద్ద ఉదాహరణ. ఒక విషయాన్ని కేవలం ఒకవైపు నుంచి కాక దాని రెండో పార్శ్వాన్ని కూడా స్పృశించడం ఇక్కడ గమనించొచ్చు.
అందరు ప్రజలకీ ఒకే రకమైన స్థాయి లేని సమాజంలో సహజంగానే అందరికీ ఆ అవకాశం ఉండదు. అయితే అందుకు మినహాయింపులు కూడా లేకపోలేదు. స్త్రీలకు ఈ వాదోపవాదాల్లో స్థానం మనం బృహదారణ్యక ఉపనిషత్తులో చూడొచ్చు. దీని కొనసాగింపేకావొచ్చు, మనది మత, కుల, లింగ వివక్షలు ఎంతో లోతుగా పాతుకుపోయిన, ఘనీభవించిన సమాజం అయినా చాలా అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దగ్గర స్త్రీలు రాజకీయాల్లో, పాలనలో వుండటం ఎక్కువగానే చూడొచ్చు, స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ఎందరో మహిళలు రాజకీయ పార్టీలను నడిపించడం, వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలను కూడా నడిపించడం చూస్తూనే వున్నాం.
మళ్లీ పురాణాల దగ్గరికి వెళితే స్త్రీలు వాదోపవాదాల్లో పాల్గొనే దృష్టాంతం మనం బృహదారణ్య ఉపనిషత్తులో చూడవచ్చు. ఇక్కడ పండితురాలయిన గార్గి, యాజ్ఞవల్కుడిని భగవంతుని స్వభావం గురించిన జ్ఞానానికి సంబంధించి ప్రశ్నలు సంధించి సమాధానంతో సంతృప్తి చెందాకే అతడిని భగవంతుని స్వభావం గురించిన చర్చలో ఆనాటి పండితులు ఎవరు ఓడించలేరని ప్రకటిస్తుంది. అలాగే యాజ్ఞవల్కుడికి అతని భార్య మైత్రేయికీ “లౌకిక సంపదలు సాధించగలిగినది ఏమిటి?” అనే విషయమై జరిగిన చర్చ మరింత ఆసక్తిదాయకం. మైత్రేయి ఈ భూమి మీద ఉన్న సంపద మొత్తం తనదైతే తనకు అమరత్వం సిద్ధిస్తుందా అని అంటుంది. “ధనవంతులు అనుభవించే సౌకర్యాలు నీకు వుంటాయి కానీ అమరత్వం మాత్రం సిద్ధించదు” అంటాడు యాజ్ఞవల్కుడు. అమరత్వం సాధించని సంపదలు ఎందుకోసం? అని మైత్రేయి అంటుంది.” మన ఆశయం మంచి జీవితం కోసం అయితే మన ఆసక్తి కూడా జీవితం మీదే ఉండాలి. అంతేకానీ సంపద పోగు చేయడం మీద కాదు ” అని యాజ్ఞవల్కుడు చెప్పడంలో ఒక భౌతిక తాత్వికత గోచరిస్తుంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఇద్దరి మధ్య వాదంగా చెప్పడం అందులోనూ ఒకరు స్త్రీ అయివుండటం గమనించాల్సిన విషయం.
పురాణాల్లో, ఇతిహాసాల్లో లేదా చరిత్రలో ప్రశ్నించిన మహిళలు ప్రతిసారి సున్నితంగా ఏమీ వాదించలేదు. భారతంలో ధర్మరాజు రక్తపాతం వద్దని ఆలోచిస్తున్న సమయంలో ద్రౌపది గట్టిగా వ్యతిరేకిస్తుంది. ధర్మరాజును తూలనాడడానికి కూడా వెనకాడదు.
కేవలం పైవర్గాలకు చెందిన వాళ్ళ వాదనలే కాక పైవర్గాలను ఎదిరించి, వాదించిన సందర్భాలు కూడా భారత పౌరాణికాల్లో చూడొచ్చు. సామాజిక వర్గ భావన చిగుళ్ళు వేస్తున్న రోజుల్లో సమాజపు సమానత్వ వ్యతిరేక భావాలను సవాలు చేసే సంఘటనల ప్రస్తావన పురాణాల్లో ఉంది. ఉదాహరణకి మహాభారతాన్ని బృగుమహర్షి భరద్వాజుడికి చెబుతూ కుల విభజన మనుషులకు రంగుల్ని బట్టి ఏర్పడ్డది అన్నప్పుడు, మరి ఒకే సామాజిక వర్గంలో మనుషులు రకరకాల రంగుల్లో ఉండటం ఎలా సాధ్యం అనే వాదన భరద్వాజుడు తెస్తాడు. అలాగే భవిష్య పురాణం అనే రచనలో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా భగవంతుని కుమారులే అయినప్పుడు ఒకే తండ్రి బిడ్డలకు వివిధ కులాలు ఎలా వుంటాయి అనే ప్రశ్న కనిపిస్తుంది. ఈ ప్రశ్న ఆరోజు ప్రముఖమైనది కాకపోవచ్చు కానీ ఆనాడు అసలు వ్యవస్థను వ్యతిరేకించే వాదనలే లేవు అనడం సత్య దూరం అని నిరూపిస్తోంది.
ఈ భిన్న వాదనల సంప్రదాయం ఉపఖండంలో ఏమైనా మార్పును తెచ్చిందా అంటే తప్పకుండా తెచ్చింది. అదికూడా వివిధ రూపాల్లో తెచ్చింది. ఈ భిన్న వాదనలను సమ్మతించే సంప్రదాయమే భారతదేశం, స్వాతంత్రం తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవడానికి దోహదపడింది. ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న మొదటి ప్రాచ్య దేశం కూడా భారతదేశం కావడం యాదృచ్చికం కాదు. కేవలం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవడమే కాదు నిలబెట్టుకుంది కూడా. ప్రజాస్వామ్యమే కాదు లౌకికవాదం ఈ దేశానికి కొత్తదేమి కాదు. భిన్న వాదనలను సమ్మతించే ఈ సంప్రదాయం భిన్న మతాలను ఆదరించేదిగా కూడా భారతదేశాన్ని చేసింది.
(from “The Argumentative Indian” by AmartyaSen)
Excellent article