సైన్స్ చరిత్రలో కొన్ని పుటలు..

18వ శతాబ్దం, విప్లవాల కాలం. మేధావులు మామూలు మనుషులు కలిసిమెలిసి మాట్లాడుకున్న కాలం. సంఘాలుగా ఏర్పడిన కాలం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చుట్టూ మొట్టమొదటిసారిగా సంఘాలు ఏర్పడిన కాలం ఆదే.

అట్లా ఏర్పడిందే లూనార్ సొసైటీ. ఇంగ్లాండ్ లో1765-1813 మధ్యకాలంలో ఈ సొసైటీ చురుగ్గా ఉండేది. అందులో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆలోచన పరులూ ఉండేవారు. నెలకు ఒకసారి, పున్నమికి దగ్గరలో ఉండే సోమవారం నాడు కలుసుకుని, ఆ వెన్నెల రాత్రులలో చర్చించుకునేవారు. వాద వివాదాల తర్వాత, ఇళ్లకు చేరడానికి, వెన్నెల వెలుగు ఉపయోగపడేది. ఇదేదో మామూలు విషయంగా ఇప్పుడు అనిపించవచ్చు. కానీ, ఆనాడు సైన్స్ కూ, సామాజిక మార్పులకూ ఇవి ప్రేరణలను అందించాయి.,ఈ రాపిళ్ళలో ఏర్పడిన నిప్పురవ్వలు బ్రిటన్ లో ఒక పారిశ్రామిక విప్లవాన్ని రగిల్చాయి అంటారు.

“మంచి జీవితం అంటే ఒక చక్కటి భౌతిక జీవితం (material life) కంటే ఎక్కువ. కానీ ఒక చక్కటి భౌతిక జీవితం లేకుండా, మంచి జీవితం ఉండదు” – అనే ఆలోచన ఈ లూనార్ సొసైటీని నడిపింది. ఇంతకీ, పిచ్చివాళ్ళ సంఘంగా, ఆనాడు కొందరు భావించిన, ఈ లూనార్ సొసైటీలో ఎవరెవరు ఉన్నారు? స్టీమ్ ఇంజన్ కనిపెట్టిన జేమ్స్ వాట్, వృక్ష శాస్త్రవేత్త, ఏ రాస్మస్ డార్విన్ (డార్విన్ తాత), మనసాయన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ, అమెరికా మూడవ అధ్యక్షుడు థామస్ జఫర్సన్ మెంటార్ విలియం స్మాల్, గుండె జబ్బుల మందు, డిజిటాలిస్ ను కనుక్కున్న డాక్టర్ విలియం విథ రింగ్, కార్మికులకు మొదటిసారి ఇన్సూరెన్స్ , సిక్ పే లను ప్రవేశపెట్టినపెట్టిన మాథ్యూ బౌల్టన్ .. లాంటివారు! తరువాతి కాలాలలో ప్రఖ్యాతులు.

1831 లో మరో సైన్స్ సంఘం బ్రిటన్ లో ఏర్పడింది. ‘బ్రిటన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ ఆఫ్ సైన్స్’ అనే దాని పేరు. రాయల్ సొసైటీ(1662) ప్రభుత్వ ప్రతినిధిగా ఉందనీ, సైన్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని భావించిన కొందరు, ఈ సంఘాన్ని పెట్టారు. ‘ఇంగ్లాండులో సైన్సు వెనుక పట్టు..’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని వేసిన, బాబేజ్ అతని మిత్ర బృందం ఈ సంఘ స్థాపకులు. వీరు సైన్స్ వైపు గట్టిగా నిలబడి మాట్లాడటం ప్రారంభించారు. చాలా నగరాలలో, ఈ సంఘానికి శాఖలు ఏర్పడ్డాయి. ఆనాటి సైన్సు పరిశోధనలు, వైజ్ఞానిక వివాదాలన్నీ, అక్కడ చర్చకు వచ్చేవి. సైన్స్ కు మతానికి మధ్య ఉండే ఘర్షణ కూడా చర్చలో ఉండేది. వీరు సైన్సు పాపులరైజేషన్ లో, ఒక పాత్ర నిర్వహించారు.

ఇటువంటి సంఘాలు యూరోప్ అంతటా ఏర్పడ్డాయి. అకాడమీ (1701), సెయింట్ పీటర్స్ బర్గ్ అకాడమీ (1724), అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ (1743) -ఇటువంటివే. ఇవన్నీ చిన్న చిన్న బృందాలే. ఇందులో ఉండే శాస్త్రవేత్తలు ప్రభుత్వాలపై ఆధారపడేవారు కాదు. కొందరు తమ సొంత డబ్బుతో నడిపేవారు.

సమావేశాలు, చర్చలు, పత్రికలో రాతలు, తమ పరిశోధన ఫలితాలను ఇతరులతో చర్చించడం ఇలాంటి పద్ధతులతో ఆనాడు, సైన్స్ వ్యాప్తి జరిగింది. 18వ శతాబ్దంలో, సైన్స్ ముందుకు తీసుకు పోవడంలో ఒక ముఖ్యమైన పాత్ర వీటికి ఉంది.

అయితే మన దేశంలో, మొట్టమొదట ఇటువంటి ప్రయత్నాలు, ఎప్పుడు జరిగాయి? ఎవరు చేశారు? అనేది ఆసక్తికరం.

Mahendralal Sircar
pic courtesy Wikipedia

పాశ్చాత్య  ప్రపంచానికి వెలుపల. ఉన్న దేశాలలో, ఆధునిక విజ్ఞాన శాస్త్రం వైపు ఆసక్తి చూపిన మొదటి దేశం, ఇండియానే అని అంటారు. 19వ శతాబ్దం రెండో భాగం నుండి ప్రారంభమైన ఈ ఆసక్తులు, 1876వచ్చేసరికి ఒక స్పష్టమైన రూపం తీసుకున్నది. ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్చర్ అఫ్ సైన్స్’-అనే సంఘం, కలకత్తాలో ఆవిర్భవించింది. సైన్స్ పట్ల  ఒక అభిరుచిని, స్పృహను భారతీయులలో కల్పించడంలో ఇదొక చారిత్రక పాత్రలో నిర్వహించింది. భారతీయులే చొరవ తీసుకుని, తమకోసం తమ పెట్టుకున్న మొట్టమొదటి మధ్యతరగతి సంఘం ఇదే కావచ్చు. ఈ సంఘం ప్రారంభించి, జీవితమంతా ధారపోసినవాడు డాక్టర్ మహేంద్ర లాల్ సిర్కార్. యూరోప్ లో వైజ్ఞానిక రంగాలలో ఏం జరుగుతుందో, లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన మొట్టమొదటి భారతీయుడాయన.

ఉన్నత విద్యలో, సైన్స్ ఉండాలని, బ్రిటిష్ పాలకులను గట్టిగా ఒత్తిడి చేశాడు. వారు పెద్దగా సహకరించింది లేదు. అట్లే స్థానికంగా ఉన్న రాజులో, భూస్వాములో కూడా అరకొర గానే ఉన్నారు. కానీ డాక్టర్ సిర్కార్, ఈ ఇబ్బందులు మద్యే, ఈ సంస్థను ముందుకు తీసుకుపోయాడు. ఒక హోమియో డాక్టర్ గా, తాను సంపాదించేది, బాగానే ఉండేది. అదంతా దీనికోసమే ఖర్చు పెట్టేవాడు. భారతీయుల సాంస్కృతిక జీవితంలోకి, కూడా సైన్సు ప్రవేశించాలని ఆయన ఆశించాడు.

జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలకు, స్ఫూర్తిదాయకమైనవాడు డాక్టర్ సిర్కార్.

2 thoughts on “సైన్స్ చరిత్రలో కొన్ని పుటలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *