ఆగస్టు 20
జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం!

ఆగస్టు 20, డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ను మతఛాందసశక్తులు  కిరాతకంగా బలిగొన్నదినం. సైన్సు కోసం, శాస్త్రీయ ఆలోచనల కోసం ఒక యోధుడు బలిదానం చేయాల్సి రావటం స్వతంత్ర భారత చరిత్రలో సిగ్గుతో తలవంచుకోవలసిన దినం. మరోవైపు ఆధునిక దృక్పథం కోసం తపించే శక్తులందరికీ ఇది ఒక దీక్షాదినం కూడా.

దబోల్కర్ ఉసురు తీసిన శక్తులే ఆ తరువాత డాక్టర్ గోవింద పన్సారేని, ప్రొఫెసర్ ఎంఎం కుల్బర్గిని, గౌరీలంకేశ్ ను కూడా క్రూరంగా హత్య చేశాయి. అభ్యుదయ భావజాలంపై తన అక్కసునంతా తీర్చుకున్నాయి.

2018లో మహారాష్ట్రలో ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థలు – ముఖ్యంగా ఏఐపిఎస్ఎన్, మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి కలిసి ఆగస్టు 20ని శాస్త్రీయ దృక్పథ దినంగా పాటించాలని పిలుపునిచ్చాయి. అనూహ్యంగా ఇది దేశమంతా అల్లుకొని వందల సంస్థలను, వేలాది మేధావుల్ని, సామాజిక కార్యకర్తలను- ముఖ్యంగా విద్యాలయాల్లోని విద్యార్థుల్ని కదిలించింది. గత ఎనిమిదేళ్లలో ఈ దినం శాస్త్రీయ ఆలోచనల కోసం తపించే వారందరికీ దీక్షాదినంగా మారింది.

సైన్సుకు, శాస్త్రీయ ఆలోచనలకు గడ్డుకాలం దాపురించిన చరిత్ర ప్రస్తుతం మన దేశంలో నడుస్తోంది. మత ఛాందస శక్తులు సమాజంలోని అన్ని రంగాల్లోకి చొచ్చుకొని వస్తున్నాయి. ప్రధానంగా విద్యాలయాలనూ, మన యువకుల్ని ఇవి తీవ్రంగా ప్రభావితం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. చూస్తుండగానే దేశం కళ్ళ ముందున్న వెలుతురును చూడలేని అంధకార యుగంలోకి జారిపోతోంది.

ఈ నేపథ్యంలో శాస్త్రీయతకు, వైజ్ఞానిక దృక్పథానికి కట్టుబడ్డ ప్రజాస్వామిక సంస్థలన్నీ ఒక తాటి మీదికి రావలసి వుంది. శాస్త్ర వ్యతిరేక ధోరణులన్నిటిని ప్రతిఘటించాల్సి వుంది. ఇది మరో స్వాతంత్య సమరం. అజ్ఞానం నుంచి తిరోగామత్వాన్నించి మనల్ని మనం విముక్తి చేసుకోవల్సిన దినం. దీన్ని గుర్తుంచుకునే కలకత్తాలో జరిగిన ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (AIPSN) ఆగస్టు 20ని “జాతీయ శాస్త్రీయ దినంగా” పాటించాలని తీర్మానిస్తూ పిలుపునిచ్చింది.

జనవిజ్ఞాన వేదికతో పాటు  దేశవ్యాప్తంగా గల ప్రజాసైన్సు ఉద్యమ సంస్థలు ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 1 దాకా జాతీయ శాస్త్రీయ దినాన్ని (NSTD) దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆగస్టు 20ని  ప్రత్యేకించి శాస్త్రీయ దృక్పథ దినంగా వాడవాడలా నిర్వహిస్తున్నాయి. వైజ్ఞానిక ప్రపంచం, సైన్సు సంస్థలు ,అధ్యాపకులు, అభ్యుదయ ప్రజాస్వామ్య సంస్థలు ఇందులో క్రియాశీల భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం.  

2 thoughts on “జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం!

  1. మూఢ నమ్మకాల చట్టం ఆవశ్యకత ధభోల్కర్, కల్భుర్గి, గోవింద్ పన్సారే మరియు గౌరి లంకేష్ లాంటి అభ్యుదయ వాదుల హత్యలు నిరూపిస్తూన్నాయి. మతం పేరుతో మాఫియా చేసే హత్యలకు ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *