C.V.కృష్ణయ్య (CVK)
పాఠాలు చదవడానికి సమయం చాలడం లేదు. ఇతర పుస్తకాల చదవడానికి సమయం ఎక్కడ ఉంది? పిల్లలు చదివేది కథల పుస్తకాలే కదా! కథల్లో ఏముంది కాలక్షేమం చేయడానికి తప్ప. ఇది చాలామంది తల్లిదండ్రుల టీచర్ల అభిప్రాయం. ఈ అభిప్రాయమే పిల్లల భవిష్యత్తును దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నది. ఎందులోనూ నైపుణ్యంలేని వ్యక్తుల్ని తయారు చేసి ఈ విద్యా వ్యవస్థ మానవ వనరుల్ని వృధా చేస్తున్నది. ఈ విషయాల గురించి లోతుగా పరిశీలిద్దాం.
అక్షరాలు వచ్చిన వాళ్లంతా విద్యావంతులు కాదు. విశాల ప్రపంచాన్ని మానవ సమాజాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్లే నిజమైన విద్యావంతులు. అలాంటి విశాల ప్రపంచం పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే అర్థమవుతుంది. వేల సంవత్సరాలుగా మనషులు సంపాదించిన జ్ఞాన సంపద పుస్తకాలలో నిక్షిప్తమై ఉంది. ఆ సంపద ఎవరికి వారు స్వయంగా తవ్వి తీసుకోవాలి. ఎవరూసహాయం చేసేవారు ఉండరు. మరి పాఠ్యపుస్తకాలలో ఉన్నది ఏమిటి? అది చాలదా? పాఠ్యపుస్తకాలలో ఉన్నది సముద్రంలో నీటి బొట్టంత. బడిలో చదువు టీచర్ పిల్లల చేయి పట్టుకొని నడక నేర్పడం లాంటిది. ఎల్లకాలం వెంట ఉండి చేయి పట్టుకుని నడిపించేవారు ఉండరు. తనకు తాను నడవగలగాలి, పరుగెత్తాలి. పాఠ్యపుస్తకాలు చదివి పరీక్షలు రాయడం ఊపిరి బిగబట్టి 100 మీటర్లు పరుగు పందెంలో పాల్గొనడం లాంటిది. ఇది చాలదు. జీవితకాలం ప్రశాంతంగా పరుగు తీయాలి. వివిధ రకాల పుస్తకాలు ఇందుకోసం చదవాలి.
తెలివిగల తల్లిదండ్రులు తమ బిడ్డలకు పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవమని ప్రోత్సహిస్తారు. రకరకాల పుస్తకాలు తెచ్చి పిల్లలకు ఇస్తారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలువేస్తారు. అజ్ఞానులు అయిన తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదవకుండా కాపలా కాస్తారు. తమ బిడ్డల భవిష్యత్తుకు అడ్డుకట్టలు వేస్తారు. పసితనము నుండి ఇతర పుస్తకాలు చదివే పిల్లలతో పాఠ్యపుస్తకాలకే పరిమితమైన పిల్లలు ఎన్నడూ పోటీ పడలేరు.
- ఎంత ఎక్కువగా పుస్తకాలు చదివితే అంత బాగా రాయడం నేర్చుకుంటారు. కింది తరగతుల్లో తప్పులు లేకుండా రాయడానికి ఇంపోజిషన్లు చూసి రాతలు ఇచ్చి పిల్లల్ని వేధిస్తుంటారు. తప్పుల్లేకుండా రాయాలంటే రకరకాల పుస్తకాలు ఎక్కువగా చదవాలి.
- మాట్లాడే భాషకు రాసే భాషకు తేడా ఉంటుంది .ఈ తేడాను పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. రాసే భాష కూడా సులభంగా నేర్చుకుంటారు. తన అభిప్రాయాల్ని స్పష్టంగా తెలియజేస్తారు. ఎందుకంటే చదవడం ద్వారా వాక్య నిర్మాణంతో పాటు రకరకాల శైలులు తెలుసుకొని ఉంటారు .లేకపోతే రాయడానికి ఇబ్బంది పడతారు.
ఎలాంటి పుస్తకాలు చదవాలి:
పిల్లలకు ఇష్టమైనవి ఎలాంటి పుస్తకాలు అయినా చదవచ్చు. అయితే మొదటి దశలో ప్రతి ఒక్కరు కథల పుస్తకాలు ఇష్టపడతారు. కథల పుస్తకాల్లో ఏముంది? అని చాలామంది ప్రశ్నిస్తారు. కథల పుస్తకాల్లో మొత్తం మానవ సమాజం అంతా ఉంది. మనిషి సంఘజీవి. తమ ఇరుగుపొరుగు వారితో కలిసి జీవిస్తూ వారి విషయాలు తెలుసుకుంటూ తనతో పోల్చుకుంటూ మంచి చెడులు తెలుసుకుంటారు. ఇది మానవ సహజం. అందుకే కథలంటే పిల్లలు ఇష్టపడతారు. రకరకాల మనుషుల స్వభావాలు మంచి చెడులు సమస్తము తెలుసుకుంటారు. కథల ద్వారా కాకపోతే ఇవన్నీ ఎలా తెలుస్తాయి. ఇలా కథల పుస్తకాల మీద ఇష్టం పెరిగి పెద్దవారయ్యే కొద్దీ ఇతర పుస్తకాల మీదికి మనసు మరలుతుంది. చరిత్ర, ‘భూగోళం’ ఇతరశాస్త్ర గ్రంథాలు చదవడం క్రమంగా అలవాటు అవుతుంది. తనకిష్టమైన సబ్జెక్టు ఏదో దానికి సంబంధించిన పుస్తకాలు మరింత లోతుగా చదువుతారు. ఇలా చదవడం వలన ఏదో ఒక దాంట్లో ప్రవేశం జరిగి నైపుణ్యం సంపాదిస్తారు. తాను చేసే వృత్తిని మరింత నాణ్యంగా చేయడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ దేశం అభివృద్ధి కావాలన్నా ఇతర దేశాలతో పోటీ పడాలన్నా సైన్సు యొక్క అవసరాన్ని గుర్తిస్తారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్ ను ఆలంబనంగా చేసుకుని తన జీవిత ప్రయాణం సాగిస్తారు. నిజమైన దేశభక్తులుగా ఎదుగుతారు. పుస్తకాలు చదివే అలవాటున్న వ్యక్తులు ఒత్తిడి నుండి ఒంటరితనం నుండి బయటపడతారు. పుస్తకం స్నేహితుడి లాంటిది. ఒక తోడు. మనకు మంచీ చెడుల గురించి చెబుతుంది. గతించిన వారంతా పుస్తకాల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటారు. మానవీయతతో మంచి మనుషులుగా ఎదగాలంటే ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలి. పసితనము నుండి పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వారి సొంత లైబ్రరీ ఏర్పాటు చేసుకొనేలా సహాయపడాలి. భారతీయ సమాజం శాస్త్రీయ సమాజంగా ఎదగాలి.